Begin typing your search above and press return to search.

కొత్త దుమారం: అమ్మ‌ను హ‌ల్వాతో చంపారా?

By:  Tupaki Desk   |   7 March 2019 7:17 AM GMT
కొత్త దుమారం: అమ్మ‌ను హ‌ల్వాతో చంపారా?
X
అమ్మ మ‌ర‌ణంపై అనుమానాలు ఉన్న వేళ‌.. వాటిని మ‌రింత బ‌ల‌ప‌ర్చేలా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు త‌మిళ‌నాడు రాష్ట్ర న్యాయ‌శాఖామంత్రి సీవీ ష‌ణ్ముగం. ఊహించ‌ని విధంగా ఆయ‌న అమ్మ జ‌య‌ల‌లిత మ‌ర‌ణంపై వ్యాఖ్య‌లు చేశారు. పెను దుమారంగా మారిన ఆయ‌న వ్యాఖ్య‌లు ఇప్పుడు కొత్త చ‌ర్చ‌కు తెర తీశాయి. అమ్మ జ‌య‌ల‌లిత‌కు హ‌ల్వా ఇచ్చి చంపేశారంటూ ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

అన్నాడీఎంకే త‌ర‌ఫున పోలింగ్ బూత్ ఏజెంట్ల స‌మావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయ‌న‌.. తాజా ఆరోప‌ణ‌లు చేయ‌టంతో జ‌య‌ల‌లిత అభిమానులు ఒక్క‌సారిగా నివ్వెర‌పోయారు. ఇప్ప‌టికే అమ్మ‌ది స‌హ‌జ మ‌ర‌ణం కాద‌న్న ఆరోప‌ణ‌లు..అనుమానాలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్న విష‌యం తెలిసిందే.ఇలాంటివేళ‌.. అధికార ప‌క్ష మంత్రి ఒక‌రు చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి.

ఆమ్మ‌ను ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న స‌మ‌యంలో ఆమెను క‌లిసేందుకు తాను ప్ర‌య‌త్నించాన‌ని.. కానీ సాధ్య‌ప‌డ‌లేద‌న్నారు. అంతేకాదు.. శ‌శిక‌ళే త‌మ‌ను ఆసుప‌త్రిలోకి అనుమ‌తించ‌లేద‌న్నారు. అమ్మ షుగ‌ర్ వ్యాధితో ఇబ్బంది ప‌డుతున్న విష‌యం తెలిసి కూడా ఆమెకు హ‌ల్వా ఇచ్చార‌న్నారు. ఈ విధంగా ఆమె వ్యాధి ముద‌ర‌టానికి.. స‌హ‌జంగా మ‌ర‌ణించాల‌న్న ఉద్దేశంతో ఈ ప్లాన్ వేసిన‌ట్లుగా ఆయ‌న చెప్పారు.

తాను చేసిన ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూరేలా ఆయ‌న కొత్త అంశాల్ని తెర మీద‌కు తీసుకొచ్చారు. అమ్మ‌కు కార్డిక్ అరెస్ట్ రావ‌టంతో ఆమె మ‌ర‌ణించిన‌ట్లుగా చెబుతున్నార‌ని.. అదే నిజ‌మైతే ఆసుప‌త్రి వ‌రండాలో ర‌క్తం ఎందుకు చిందింద‌ని ప్ర‌శ్నించారు. అక్క‌డ ప‌డిన ర‌క్తం ఎక్క‌డిది? అదెలా వ‌చ్చింది? అని ప్ర‌శ్నించారు. జ‌య‌ల‌లిత కోలుకున్న త‌ర్వాత కార్డిక్ అరెస్ట్ ఎలా వ‌స్తుంద‌ని ప్ర‌శ్నించారు.

తాను సంధించిన ప్ర‌శ్న‌ల‌కుస‌మాధానాలు రావాలంటే శ‌శిక‌ళ‌ను ప్ర‌శ్నించే తీరులో ప్ర‌శ్నిస్తే స‌మాధానాలు వాటంత‌ట అవే వ‌స్తాయ‌ని.. అస‌లు నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌న్నారు. మ‌రీ కొత్త ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో అధికార యంత్రాంగం.. ఆసుప‌త్రి వ‌ర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.