Begin typing your search above and press return to search.

ఇప్పుడు ఏపీనే చీక‌టైంది.. మంత్రి హ‌రీష్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   13 April 2022 2:30 PM GMT
ఇప్పుడు ఏపీనే చీక‌టైంది.. మంత్రి హ‌రీష్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
ఏపీపై తెలంగాణ మంత్రి హ‌రీష్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకటి అవుతుందని మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డి అన్నారని ఆయ‌న‌ గుర్తు చేశారు. అయితే.. తెలంగాణ నిరంత‌రాయంగా క‌రెంటు ఇస్తూ.. వెలుగులు చిమ్ముతుంటే.. ఇప్పుడు ఏపీనే చీకటైందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ వస్తోందన్నారు. దీనిని బ‌ట్టి.. తెలంగాణ అభివృద్ధిలో ఉందో లేదో ఆలోచించుకోవాల‌ని.. ఆయ‌న సూచించారు. ఇక‌, పామాయిల్‌ సాగుకు ఎకరానికి రూ.80 వేల సబ్సిడీ ఇస్తున్నామన్నారు. పామాయిల్‌ సాగుతో ఏటా ఎకరానికి రూ.లక్షా 50 వేల ఆదాయం లభిస్తోందన్నారు.

మన దేశంలో నూనె వినియోగం ఎక్కువని.. ఉత్పత్తి తక్కువగా ఉందని హ‌రీష్ అన్నారు. బాయిల్డ్‌ రైస్ కొనబోమని కేంద్రం అంటోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక చరిత్ర అని.. ఇక దానికి భవిష్యత్ లేదని హరీష్‌రావు పేర్కొన్నారు. మ‌రోవైపు.. హరీష్‌రావు... కేంద్రానికి లేఖ రాశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ బూస్టర్‌ డోస్‌కు అనుమతివ్వాలంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వ్యాక్సిన్ కేంద్రాల్లో బూస్టర్ డోస్ ఇస్తుండగా 18 నుంచి 59 ఏళ్ల మధ్య వారికి కేవలం ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే బూస్టర్ డోస్ అందుబాటులో ఉంద‌న్నారు.

ఈనెల 10 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు కేంద్రం ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సైతం 18 ఏళ్లు పైబడి అర్హలైన వారికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమతించాలని కోరుతూ... మంత్రి లేఖ రాశారు.

రాష్ట్రంలో ఏప్రిల్ 10 నాటికి దాదాపు 9,84,024 మంది బూస్టర్ డోస్ తీసుకునేందుకు అర్హత కలిగి ఉన్నట్టు మంత్రి లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 18 ఏళ్లు పైబ‌డిన వారికి మొద‌టి డోసును 100 శాతం, రెండో డోసును 100 శాతం, 15-17 ఏళ్ల కేట‌గిరీలో మొద‌టి డోసును 90శాతం, రెండో డోసును 73శాతం, 12-14 ఏళ్ల వ‌య‌స్సు వారికి 78 శాతం వ్యాక్సినేష‌న్ పూర్తి చేసినట్టు వివరించారు. మ‌రి దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.