Begin typing your search above and press return to search.

కేసీఆర్ కాదు.. ఆయన తాత వ‌చ్చినా మాకు న‌ష్టం లేదు: ఏపీ మంత్రి హాట్ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   8 Oct 2022 5:34 AM GMT
కేసీఆర్ కాదు.. ఆయన తాత వ‌చ్చినా మాకు న‌ష్టం లేదు: ఏపీ మంత్రి హాట్ కామెంట్స్‌!
X
జాతీయ రాజ‌కీయాల్లో త‌న స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్.. భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) పేరుతో కొత్త జాతీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ త‌ర‌ఫున దేశ‌వ్యాప్తంగా అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దించి త‌న స‌త్తా చాటాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు. త‌ద్వారా కేంద్రంలో అధికార బీజేపీకి షాకివ్వాల‌నే యోచ‌న‌లో ఉన్నారు.ఈ నేప‌థ్యంలో కేసీఆర్ జాతీయ పార్టీకి అనుకూలంగా, వ్య‌తిరేకంగా అనేక కామెంట్స్ వ‌స్తున్నాయి.

ముఖ్యంగా కేసీఆర్‌.. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు త‌దిత‌ర రాష్ట్రాలపై ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌ల్లో తెలుగు ప్ర‌జ‌లు భారీగానే ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే వారి ఓట్ల‌తోపాటు ఆయా రాష్ట్రాల్లో రైతుల‌ను ఓట్లను కొల్ల‌గొట్టాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు.

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుపై విమ‌ర్శ‌లే ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. గ‌తంలో తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో ఏపీ ప్ర‌జ‌ల‌ను దూషించిన కేసీఆర్ పార్టీని ఏపీలో ఎవ‌రూ ప‌ట్టించుకోర‌ని వైసీపీ నేత‌లు తేల్చిచెబుతున్నారు. వ‌చ్చే 25 ఏళ్లు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డే సీఎంగా ఉంటార‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీతో త‌మ‌కొచ్చే న‌ష్టం, క‌ష్టం ఏమీ లేవ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. వైసీపీ ముఖ్య నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సైతం ఎవ‌రికైనా పార్టీ పెట్టుకునే హ‌క్కు, స్వేచ్ఛ ఉన్నాయ‌ని పేర్కొంటూనే తాము ఎవ‌రి కూట‌మిలో, ఫ్రంట్‌లో క‌ల‌వ‌బోమ‌ని తేల్చిచెప్పారు.

తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మిగిలిన నేత‌ల కంటే కాస్త దూకుడుగా కేసీఆర్‌పై ఆయ‌న కామెంట్స్ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఆంధ్రప్ర‌దేశ్‌లో బీఆర్ఎస్ ప్ర‌భావం ఎలా వుంటుంద‌ని మీడియా ప్ర‌తినిధులు తాజాగా కారుమూరి నాగేశ్వ‌రరావును ప్ర‌శ్నించారు. దీనికి స్పందించిన మంత్రి కారుమూరి.. కేసీఆర్‌ కాదు కదా.. ఆయన తాత వచ్చినా మాకు నష్టం లేద‌ని హాట్ కామెంట్స్ చేశారు. సింహం సింగిల్‌గానే వ‌చ్చిన‌ట్టు వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కూడా అదే రీతిలో వ‌స్తారు అని మంత్రి కారుమూరి నాగేశ్వ‌రరావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తిప‌క్షాల‌న్నీ క‌ల‌సి వ‌చ్చినా .. అత్య‌ధిక మెజార్టీతో తామే గెలుస్తామ‌ని తేల్చిచెప్పారు. కేసీఆర్ వ‌ల్ల త‌మ‌కు ఎలాంటి న‌ష్టం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఇప్ప‌టివ‌ర‌కు బీఆర్ఎస్ (భార‌త రాష్ట్ర స‌మితి)పై జ‌న‌సేన‌, టీడీపీ, బీజేపీ త‌దిత‌ర పార్టీలు అంత‌గా స్పందించ‌లేదు. వ్య‌తిరేకంగా కామెంట్లు చేసిందీ లేదు. ఈ వ్య‌వ‌హారంపై ఆచితూచి స్పందించాల‌న్న‌ట్టుగానే ఉన్నాయి. అయితే వైసీపీ నేత‌లు మాత్రం బీఆర్ఎస్ పార్టీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తుండ‌టం విశేషం.

ఇటీవ‌ల తెలంగాణ మంత్రులు జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవ‌డం, సంద‌ర్భం లేక‌పోయినా విమ‌ర్శ‌లు చేయ‌డం, ఇందుకు ప్ర‌తిగా వైసీపీ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లో భావోద్వేగాల‌ను రెచ్చ‌గొట్టి రెండు రాష్ట్రాల్లో జ‌గ‌న్‌, కేసీఆర్ ల‌బ్ధి పొందాల‌నే వ్యూహంలో భాగంగానే టీఆర్ఎస్, వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌లు ఉన్నాయ‌ని భావిస్తున్న‌వారు లేక‌పోలేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.