Begin typing your search above and press return to search.

అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర.. దండయాత్ర.. మంత్రిగారి కొత్త నిర్వచనం

By:  Tupaki Desk   |   9 Sep 2022 2:38 PM GMT
అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర.. దండయాత్ర.. మంత్రిగారి కొత్త నిర్వచనం
X
సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నానాథ్. ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని.. మూడు రాజధానులు వద్దంటూ అమరావతికి కోసం వేలాది ఎకరాల్ని ప్రభుత్వానికి ఇచ్చిన అమరావతి రైతులు తమ తదుపరి పాదయాత్రను అమరావతి నుంచి అరసవల్లి వరకు చేయనున్న వైనంపై ఆయన స్పందించారు. మూడు రాజధానులకు వైసీపీ ప్రభఉత్వం కట్టుబడి ఉందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖపట్నం.. అమరావతి.. కర్నూలులో రాజధానుల్ని ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేశారు.

అమరావతి ప్రాంతానికి రాజధాని కావాలని రైతులు చేస్తున్నది యాత్ర కాదని.. విశాఖపట్నానికి రాజధాని వద్దూ అంటూ చేస్తున్న దండయాత్రగా ఆయన అభివర్ణించారు. 'దీనిని ఎవ్వరం ఊరుకోం. ఈ ప్రాంత ప్రజలు అంగీకరించారు. పాదయాత్రను ఉత్తరాంధ్ర ప్రజలు హర్షించరు. పాదయాత్రతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంది. పాదయాత్ర పేరుతో దండయాత్ర చేస్తే జనం చూస్తూ ఊరుకోరు. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే చంద్రబాబు బాధ్యత వహించాలి' అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

అమరావతిలో పేదలకు చోటు లేదా? అని ప్రశ్నించిన ఆయన.. దాని కోసం గుంటూరు.. విజయవాడలకు అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. తన సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని.. 29 గ్రామాల కోసమే ఉద్యమం చేస్తున్నారంటూ గుడివాడ మండిపడ్డారు. అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ చెందాలనే సీఏం జగన్ ఆలోచన అని.. ఈ రోజున పాదయాత్ర పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించటానికి ప్రయత్నిస్తున్నారన్నారు.

ఉత్తరాంధ్ర ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. పాదయాత్రను విశాఖ ప్రజలు హర్షించరన్నారు. అసెంబ్లీలో మూడురాజధానులకు సంబంధించి కొత్త బిల్లు పెడతామని.. ఆ తర్వాత ఎప్పుడైనా ముఖ్యమంత్రి విశాఖకు వచ్చేయొచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపన ఉంటుందన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.