Begin typing your search above and press return to search.

మంత్రి స‌బిత‌.. క‌బ్జాల‌ను ప్రోత్స‌హిస్తున్నారు.. మాజీ ఎమ్మెల్యే తీగ‌ల ఫైర్‌

By:  Tupaki Desk   |   5 July 2022 10:41 AM GMT
మంత్రి స‌బిత‌.. క‌బ్జాల‌ను ప్రోత్స‌హిస్తున్నారు.. మాజీ ఎమ్మెల్యే తీగ‌ల ఫైర్‌
X
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో అంత‌ర్గ‌త క‌ల‌హాలు రోడ్డున ప‌డుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఆశిస్తున్న వారు.. వ‌స్తుందో.. రాదో.. అనే బెంగ‌తో.. ప్ర‌స్తుత సిట్టింగుల‌పై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా ఈ క్ర‌మంలో.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై టీఆర్ ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి విరుచుకు పడ్డారు. మీర్‌పేట్‌ను సబితా ఇంద్రారెడ్డి నాశనం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

మీర్‌పేట నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోనని ఆయన హెచ్చరించారు. తమ ప్రాంతం కోసం అవసరమై తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని వెల్లడించారు. సబితా ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆయన చెరువులు, పాఠశాలల స్థలాలను వదలడం లేదని ఆరోపించారు.

తమ పార్టీ నుంచి మంత్రి సబిత ఎమ్మెల్యేగా గెలవలేదని అభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శించారు. ట్రంక్ లైన్ పనులు ఇంకా పూర్తిచేయలేదన్నారు. మంత్రి సబిత వైఖరిపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానని తీగల కృష్ణారెడ్డి తెలిపారు.ముదురుతున్న టికెట్ పోరు!

గత ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున సబితా ఇంద్రారెడ్డి టీఆర్ ఎస్‌ నుంచి బ‌రిలో నిలిచిన‌ తీగల కృష్ణారెడ్డిని ఓడించారు. అనంతరం సబితారెడ్డి కారెక్కి.. కండువా మార్చుకుని.. కేసీఆర్ గూటికి చేరిపోయారు. ఈ క్ర‌మంలోనే మంత్రి పదవి పొందారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.

నియోజకవర్గంలో తీగల కృష్ణారెడ్డి ఓ వర్గం కొనసాగుతుండగా మంత్రి సబితా ఇంద్రారెడ్డిది మరోవర్గం ఉంది. సబితారెడ్డి టీఆర్ ఎస్‌లో చేరి మంత్రి పదవి పొందటంతో తనకు ప్రాధాన్యం తగ్గిందని తీగల భావిస్తు న్నారు.

కొన్నాళ్లుగా అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలు తీగల తాజా వ్యాఖ్యలతో బహిర్గతమయ్యాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌హేశ్వ‌రం టికెట్‌ను స‌బిత త‌న కుమారుడుకు ఇప్పించుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్న నేప‌థ్యంలో తీగ‌ల ఇలా రోడ్డున ప‌డుతున్నార‌నే వాద‌న కూడా ఉంది. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.