Begin typing your search above and press return to search.

వివాదాల ఎమ్మెల్యేల‌కు మంత్రి గారి స‌ర్టిఫికెట్‌

By:  Tupaki Desk   |   4 Jan 2022 2:30 PM GMT
వివాదాల ఎమ్మెల్యేల‌కు మంత్రి గారి స‌ర్టిఫికెట్‌
X
ఏ పార్టీ అయినా.. ఏ ప్ర‌భుత్వ‌మైనా.. వివాదాల‌కు దూరంగా ఉండాల‌నే కోరుకుంటుంది. ఎవ‌రైనా.. ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. తొక ఝాడిస్తే.. క‌త్తిరించేందుకు కూడా వెనుకాడ‌దు. దీనికి కార‌ణం..పార్టీకి మ‌చ్చ రాకుండా.. ప్ర‌జ‌ల‌లో పార్టీకి బ‌లం స‌న్న‌గిల్ల‌కుండా చూసేందుకే. అయితే.. వైసీపీలో మాత్రం చిత్ర‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. వివాదాస్ప‌ద ఎమ్మెల్యేల‌కు.. పార్టీ కీల‌క నేత‌లు అండ‌గా ఉన్నార‌నే వాద‌న వినిపిస్తోంది. మీరు ఏమైనా చేయండి.. ఎవ‌రు అడ్డు వ‌స్తారో.. చూస్తా! అన్న‌ట్టుగా.. సీనియ‌ర్ నేత‌లు.. స‌ద‌రు వివాదాస్ప‌ద ఎమ్మెల్యేల‌కు స‌ర్టిఫికెట్లు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో సైతం... పార్టీ అభ్యర్థిగా ఉంటారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. వసంత వెంకట కృష్ణ ప్రసాద్కు వ్యతిరేకంగా పని చేస్తే పార్టీకి వ్యతిరేకంగా పని చేసినట్టేనని వైసీపీ నేతలకు తేల్చిచెప్పారు. అలాంటి వారిపై పార్టీలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిజానికి కొన్నాళ్లుగా.. వ‌సంత‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. కొండ‌ప‌ల్లిలో అక్ర‌మ మైనింగ్ చేస్తున్నార‌ని.. ఆయ‌న దూకుడుతో పేద‌లు ఇళ్లు పోగొట్టుకున్నార‌ని కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మ‌రి ఇలాంటి నేత‌కు పెద్దిరెడ్డి అభ‌యం ఇస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇంటిపై.. మందీ మార్బ‌లంతో వెళ్లి.. క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ.. వివాదానికి కార‌ణ‌మైన‌.. పెడన ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేశ్ విష‌యంలోనూ మంత్రి పెద్దిరెడ్డి పాజిటివ్‌గా రియాక్ట్ అవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ.. ఆయ‌న అక్కడే కొనసాగుతారని తెలిపారు. అనవసరంగా వారిద్దరి మధ్య విభేదాలు సృష్టిస్తే ఊరుకోబోమని చెప్పారు. అలా ఎవరైనా చేస్తే వారిని పార్టీ నుండి బయటకు పంపేందుకు సైతం వెనుకాడమని పేర్కొన్నారు. అందరూ కలిసి మెలిసి పనిచేస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. అనవసర వివాదాలకు దారితీసే చర్యలు మానుకోవాలని హితవు పలికారు. కానీ, అస‌లు వివాదాల‌కు కేంద్రంగా ఉన్న ఇద్ద‌రు నేత‌ల విష‌యంలో.. ఇలా నిర్ణ‌యం తీసుకుని.. కేడ‌ర్‌ను భ‌య పెట్ట‌డం ఏమేర‌కు స‌మంజ‌స‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.