Begin typing your search above and press return to search.

మరో చైనా విమానానికి తప్పిన ముప్పు.. ఈసారి క్షిపణే

By:  Tupaki Desk   |   4 Jun 2022 1:30 PM GMT
మరో చైనా విమానానికి తప్పిన ముప్పు.. ఈసారి క్షిపణే
X
చైనా విమానాలకు వరుసగా గండాలు ఎదురవుతున్నాయి. దాదాపు మూడు నెలల కిందట 132 మందితో వెళ్తున్న చైనా విమానం కొండల్లో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎవరూ బతికి బట్టకట్టలేదు. చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్ లో చోటుచేసుకున్న ఆ ప్రమాదం దిగ్భ్రాంతులను చేసింది. దీనిపై అమెరికాకు చెందిన నిపుణులు పరిశీలన చేసి.. కాక్ పిట్ లోనే విమానం కూల్చివేతకు కుట్ర జరిగిందనే అనుమానం వ్యక్తం చేశారు. బ్లాక్ బాక్స్ విశ్లేషణ అనంతరం వారు ఈ నిర్ధారణకు వచ్చారు. నాడు కూలిపోయింది బోయింగ్ 737-800 విమానం.

నాడు సవ్యంగానే వెళ్తున్న విమానం.. నిమిషం వ్యవధిలో 20 వేల అడుగుల కిందకు దిగింది. వుజుహు నగర సమీపంలో కొండను ఢీకొట్టి కుప్పకూలింది. తాజాగా చైనాకు చెందిన మరో విమానానికి పెద్ద ముప్పు తప్పింది. ఈసారి ఏకంగా ఓ క్షిపణే విమానాన్ని ఢీకొట్టేంత పరిస్థితి ఎదురైంది. చైనా విమానం వెళ్తుండగా మధ్యలో క్షిపణి దూసుకొచ్చింది. ఏటీసీ ఆ విమానాన్ని హెచ్చరించి దారి మళ్లించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

ఇదీ బోయింగ్ విమానమే.. క్షిపణీ చైనాదే..

మూడు నెలల కిందట ప్రమాదానికి గురైన విమానం లాగే ఇదీ బోయింగ్ విమానమే. ఈ విమానం దక్షిణ చైనా సముద్రం మీదుగా వెళ్తుండగా.. అదే సమయంలో ఈ సముద్ర ఉపరితలం నుంచి చైనా క్షిపణి ని ప్రయోగించింది. క్షిపణి రాకను గుర్తించిన ఏటీసీ.. పైలట్లను అప్రమత్తం చేసింది. 90 డిగ్రీలు ఎడమకు తిప్పమని సలహా ఇచ్చింది. దీనంతటికీ సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను బోయింగ్ విమానం కాక్‌పిట్‌ నుంచి రికార్డ్‌ చేసినట్లుగా తెలుస్తోంది. విమానం ప్రయాణిస్తోన్నసమయంలోనే చైనా నేవీ .. టైప్‌ 094 న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌ నుంచి జేల్‌ఎల్‌-3 క్షిపణి ని ప్రయోగించినట్లు తెలిసింది.

ఎప్పుడు జరిగింది?

ప్రమాదం తప్పడం అందరికీ ఉపశమనం ఇచ్చింది. కానీ.. ఈ ఘటన ఏ రోజున జరిగింది.. విమానంలో ఎంత మంది ఉన్నారు. వివరాలేవీ తెలియరాలేదు. ఈ వీడియోను అమెరికాకు చెందిన
ఓ పైలట్‌ మే 25న ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఆ బోయింగ్‌ విమానం కాథీ పసిఫిక్‌ సంస్థకు చెందినదిగా తెలుస్తోంది.

అయితే తమ సంస్థకు చెందిన విమానమేదీ అలాంటి ఘటనను ఎదుర్కోలేదని కాథీ పసిఫిక్‌ చెప్పడం గమనార్హం. కాగా.. దక్షిణ చైనా సముద్రంలో క్షిపణి ప్రయోగాలు చేపడుతున్నట్లు చైనా.. విమానయాన సంస్థలకు గానీ లేదా ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోలర్‌ కు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదట. దీన్ని బట్టి చూస్తే చైనా ఈ ప్రయోగాలను అత్యంత రహస్యంగా చేస్తోందని అర్థమవుతోంది.

తైవాన్ ను భయపెట్టేందుకేనా..?

తమ పొరుగునున్న తైవాన్ తమదే అని చైనా అంటోంది. వన్ చైనా నినాదాన్ని గట్టిగా వినిపిస్తోంది. తైవాన్ వాదన మాత్రం భిన్నంగా ఉంది. పైగా తైవాన్ కు అమెరికా మద్దతిస్తోంది. ఈ నేపథ్యంలో తైవాన్ ను హెచ్చరించేందుకే ఈ ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మే నెల రెండో భాగంలో దక్షిణ చైనా సముద్రంలో సైనిక డ్రిల్‌ చేపట్టనున్నట్లు చైనా గతంలోనే చెప్పింది. క్షిపణి ప్రయోగాలు జరుపుతామని మాత్రం సమాచారం ఇవ్వలేదు. దక్షిణ చైనా సముద్రంలో ఆధిపత్యం కోసం డ్రాగన్‌ విపరీతంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ప్రయోగం జరగడం గమనార్హం.