Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ స‌మీక్ష‌లో ఈ ఎమ్మెల్యేలు ఫ‌స్ట్.. వీళ్లేనా లాస్ట్!

By:  Tupaki Desk   |   19 July 2022 3:30 AM GMT
జ‌గ‌న్ స‌మీక్ష‌లో ఈ ఎమ్మెల్యేలు ఫ‌స్ట్.. వీళ్లేనా లాస్ట్!
X
గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా సీఎం వైఎస్ జ‌గ‌న్.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్చార్జులు, జిల్లాల పార్టీ అధ్య‌క్షులు, ప్రాంతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లతో స‌మీక్ష నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మీక్ష‌లో ప‌లువురు ఎమ్మెల్యేల‌పై సీఎం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. కొంత‌మంది ఎమ్మెల్యేలు గ‌డ‌ప గ‌డ‌ప ప్రోగ్రామ్ ను బాగా నిర్వ‌హిస్తుండ‌గా.. మ‌రికొంత‌మంది అస‌లు ఇప్ప‌టివ‌ర‌కు ప్రారంభించ‌లేద‌ని మంద‌లించిన‌ట్టు స‌మాచారం.

ముఖ్యంగా మాజీ మంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డిల‌పై సీఎం వైఎస్ జ‌గ‌న్ అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇప్ప‌టివ‌ర‌కు ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. అలాగే మ‌రో ప‌ది మంది ఎమ్మెల్యేలు కేవ‌లం ప‌ది రోజులు మాత్ర‌మే ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించార‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది. అలాగే మ‌రికొంద‌రు తూతూమంత్రంగా గ్రామాల్లో ప‌ర్య‌టిస్తున్నార‌ని ఎమ్మెల్యేల దృష్టికి తెచ్చిన‌ట్టు చెబుతున్నారు.

పనితీరు మార్చుకోవాలని.. గ్రాఫ్ మెరుగుపరచుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేది లేదని సీఎం వైఎస్ జ‌గ‌న్ ఖరాఖండిగా తేల్చిచెప్పినట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. సీటు ఇవ్వ‌క‌పోతే త‌న‌ను త‌ప్పు ప‌ట్ట‌వ‌ద్ద‌ని.. ఆ త‌ప్పంతా మీదే అవుతుంద‌న్న‌ట్టు స‌మాచారం. కాగా న‌ర‌సాపురం ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్ర‌సాద‌రాజు గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని బాగా చేస్తున్నార‌ని సీఎం జ‌గ‌న్ ప్ర‌శంసించిన‌ట్టు స‌మాచారం.

జీవితంలో ఏ కార్యక్రమమైనా నాణ్యతతో చేస్తేనే నిలదొక్కుకోగలమ‌ని సీఎం జ‌గ‌న్ నేత‌ల‌కు చెప్పిన‌ట్టు తెలుస్తోంది. మునుపటి కన్నా మెరుగైన ఫలితాలు సాధించాలని.. 175 సీట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని వారికి సూచించారు.

కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించామని.. వచ్చే ఎన్నికల్లో అక్కడ కూడా విజయం సాధించాలని సూచించారు. సంక్షేమ పథకాలను సకాలంలో నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని, దాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఎమ్మెల్యేల బాధ్యత అని స్ప‌ష్టం చేశారు.