Begin typing your search above and press return to search.

మీటింగ్ అంటే తల కొట్టేసినట్లుగా ఉందట

By:  Tupaki Desk   |   21 July 2015 10:00 AM IST
మీటింగ్ అంటే తల కొట్టేసినట్లుగా ఉందట
X
ఓటుకు నోటు వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. తెలంగాణ విపక్షాన్ని అడ్డంగా బుక్ చేసి.. తెలంగాణ అధికారపక్షం తిరుగులేని విజేతగా నిలిచిన ఎపిసోడ్ అన్నది తెలిసిందే. ఈ ఇష్యూ బయటకు వచ్చిన నాటి నుంచి రాజకీయ వర్గాల్లో చాలానే మార్పులు వచ్చేశాయి. అప్పటివరకూ కీలక పాత్ర పోషించిన నమ్మకం పాత్ర పరిధి బాగా తగ్గిపోయింది. ఎవరికి వారు.. ఎవర్ని నమ్మకంలోకి తీసుకోని పరిస్థితి. అలా అని బయటకు బాహాటంగా చెప్పకున్నా ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

వీరికి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం చాలా నిర్మోహమాటంగా వ్యవహరిస్తున్నారు. క్యాంప్ ఆఫీసులో తనతో సమావేశమయ్యే సీనియర్ ఐఏఎస్ అధికారుల ఫోన్లను అనుమతించటం లేదంట.

క్యాంప్ ఆఫీసులోకి అడుగు పెట్టటానికి ముందే.. సీనియర్ అధికారుల వద్దనున్న మొబైల్స్ ను భద్రత సిబ్బంది తీసేసుకుంటున్నారట. వెనక్కి తిరిగి వెళ్లే సమయంలో వారి ఫోన్లను తిరిగి ఇచ్చేస్తున్నారంట. ఈ ధోరణి వారికి తీవ్ర అసంతృప్తికి గురి చేస్తుందంటున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లే అవకాశం ఇద్దరంటే ఇద్దరు ఉన్నతాధికారులకే ఉందని చెబుతున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు రాష్ట్ర డీజీపీ.. మరొకరు సీఎస్ మాత్రమే అని చెబుతున్నారు. మిగిలిన వారి దగ్గర మొబైల్ ఫోన్లు తీసుకున్న తర్వాతే అనుమతిస్తున్నారని.. ఇలాంటి పరిస్థితిని తాము ఎప్పుడూ ఎదుర్కొనలేదని.. కీలక స్థానాల్లో ఉన్న తమకు ఇది చాలా అసౌకర్యంగా.. అవమానకరంగా ఉన్నట్లుగా భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు ఉదంతం తర్వాత.. ముందస్తు జాగ్రత్తలు.. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశ్యంతో ఇలాంటివి చేస్తున్నారని చెబుతున్నారు.