Begin typing your search above and press return to search.

ఆమె ద్వారా వెంక‌య్య‌పై మోడీ - షా క‌న్నేశారా?

By:  Tupaki Desk   |   24 Aug 2017 5:30 PM GMT
ఆమె ద్వారా వెంక‌య్య‌పై మోడీ - షా క‌న్నేశారా?
X
ఉప రాష్ట్రప‌తిగా ఎన్నికైన వెంక‌య్య‌నాయుడు అభిమానులు నిరాశ చెందే ప‌రిణామం ఇది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ జౌళి శాఖ మంత్రిగా ఉన్న‌స‌మ‌యంలో సమాచార ప్రసారాల శాఖను అదనంగా అప్పగించిన విషయం తెలిసిందే. అనూహ్య నిర్ణయాలతో ఆ శాఖ అధికారులు బిత్తరపోయేలా చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే వెంకయ్య నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నింటినీ ఆమె పున:సమీక్షకు పూనుకున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌ షా - ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోడీ కంటే సీనియర్‌ అయిన వెంకయ్య నాయుడు తన శాఖల విషయంలో స్వతంత్రంగానే వ్యవహరించేవారు. మోడీని పొగడ్తలతో ముంచెత్తుతూనే తన శాఖకు సంబంధించి ఇతరుల సూచనలను ఆయన పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఆయన సీనియారిటీని చూసి నేతలెవరూ ఒత్తిడి చేయలేకపోయేవారు.

దీన్ని దృష్టిలో పెట్టుకునే వెంకయ్య నాయుడు హయాంలో తీసుకున్న నిర్ణయాలన్నింటిపైనా ఇప్పుడు పున:సమీక్ష జరిపి తమకు అనుకూలమైనవారిని కీలకమైన పదవుల్లో నియమించేందుకు ప్రధాని మోడీ - అమిత్‌ షా సిద్ధమయ్యారని తెలుస్తోంది. వారి ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించే స్మృతి ఇరానీ సమాచార ప్రసారాల శాఖలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారని అర్థమవుతోంది. ఇందుకు ప‌లు ప‌రిణామాలు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయని అంటున్నారు. గోవాలో ఈ ఏడాది నవంబర్‌ 20 నుంచి 28 వరకు జరగబోయే అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కోసం వెంకయ్య నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు 21 మందితో ఒక ప్రివ్యూ స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి మూడేళ్ల పదవీకాలాన్ని నిర్ణయిస్తూ సభ్యుల రెమ్యూనరేషన్‌ ను సైతం భారీగా పెంచారు. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫ్పీ) కోసం అనేక అంతర్జాతీయ చిత్రాలను వడపోసి ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ కమిటీ 150 సినిమాలను వీక్షించింది. అయితే సరిగ్గా ఇదే సమయంలో స్మృతి ఇరానీ ఈ శాఖ బాధ్యతలను చేపట్టారు. నిజానికి ప్రివ్యూ కమిటీ రెండో దశలో మరిన్ని సినిమాలు వీక్షించేందుకు సిద్ధమైంది. అయితే ఢిల్లీకి చెందిన జానపద గాయని కిరణ్‌ ఝా పేరు జాబితాలో చేర్చేందుకు మంత్రి అనుమతి అవసరం. ఈ మేరకు కిరణ్‌ ఝా ఫైల్‌ స్మృతి ఇరానీ వద్దకు చేరింది. ఈ పేరును వెంకయ్య నాయుడు పొరపాటుగా ఏమీ చేర్చలేదు. ఆమె గతంలో కూడా కమిటీలో పనిచేశారు. అయితే ఈ కొత్త పేరును స్మృతి తిరస్కరించారు.

అయితే అంతటితో ఊరుకోలేదు. మొత్తాన్ని మొత్తం కమిటీనే రద్దు చేసి పడేశారు. ఇప్పటికే 150 సినిమాల స్క్రీనింగ్‌ అయిపోయిందని, మల్లీ ఇవన్నీ చూడాలంటే చాలా సమయం పడుతుందని అధికారులు ఎంత చెప్పినా స్మృతి ససేమిరా అన్నారు. పాత కమిటీని రద్దు చేసిన స్మృతి వెంటనే 40 మందితో కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. కేవలం ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాతోనే సరిపెట్టకుండా స్మృతి ఇరానీ తన మార్కు అన్ని విభాగాల్లోనూ చూపుతున్నారు. ఇఫ్ఫీ గురించి ఓవైపు వివాదం చెలరేగుతుండగానే సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌ సీ) చీఫ్‌ గా ఉన్న పహ్లాజ్‌ నిహ్లానీపై వేటు వేశారు. ఆయన పోతూ పోతూ నేరుగా స్మృతి ఇరానీనే నిందిస్తూ వెళ్లారు.
ఇందుకు ‘ఇందు సర్కార్‌’ సినిమా విషయంలో మంత్రితో ఏర్పడ్డ విబేధాలే కారణమని ఆరోపించారు. అసలు కట్స్‌ లేకుండా ఇందు సర్కార్‌ సినిమాను ఎందుకు అనుమతించలేదని స్మృతి తనను ప్రశ్నించారని, తాను ప్రొసీజర్‌ ప్రకారమే కొన్ని సీన్లను కట్‌ చేయాల్సిందిగా సూచించానని చెప్పుకొచ్చారు. ఇది నచ్చకనే తనను తొలగించారని నిహ్లానీ విమర్శించారు. అంతే కాదు, గతంలో భజరంగీ భాయిజాన్‌ సినిమా విషయంలోనూ హోంశాఖ తనపై ఒత్తిడి చేసిందని, ఉడ్తా పంజాబ్‌ సినిమా విషయంలోనూ తనపై అనేక ఒత్తిళ్లు వచ్చినా రివైజింగ్‌ కమిటీ ఓకే చెప్పాకనే తాను క్లియరెన్స్‌ ఇచ్చానని చెప్పారు. ఈ వివాదాల విషయం ఎలా ఉన్నా నిహ్లానీని తొలగించిన వెంటనే పక్కా సంఘ్‌ అభిమాని ప్రసూన్‌ జోషిని సీబీఎఫ్‌ సీ చీఫ్‌ గా స్మృతి ఇరానీ నియమించారు.

అయితే స్మృతి ఇరానీ ఈ మార్పులన్నీ ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ క‌లుగుతోంది. కేవలం తన వ్యక్తిగత ప్రాభవం కోసమే చేస్తున్నారా అంటే కాదనే తెలుస్తోంది. ప్రభుత్వాధినేత నరేంద్ర మోడీకి అత్యంత విధేయురాలిగా స్మృతి ఇరానీకి పేరుంది. అధినేతల మనసెరిగి ప్రవర్తించడంలో ఆమెకు మరెవరూ సాటిలేరని చెప్పుకుంటారు. అలాంటి వ్య‌క్తి తాజా అడుగుల వెనుక బీజేపీ పెద్ద‌ల గ్రీన్ సిగ్న‌ల్ కార‌ణం అయి ఉంటుంద‌ని చెప్తున్నారు.