Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్ గా మారిన మోడీ..కేసీఆర్ మీటింగ్‌!

By:  Tupaki Desk   |   29 Nov 2017 4:42 AM GMT
హాట్ టాపిక్ గా మారిన మోడీ..కేసీఆర్ మీటింగ్‌!
X
హైద‌రాబాద్ మెట్రో రైల్‌.. జీఈఎస్ స‌ద‌స్సు సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇద్ద‌రు చాలాసేపు క‌లిసే ఉన్నారు. టీవీ లైవ్ లో చూసిన వాళ్ల‌ల్లో చాలామంది ఒక విష‌యాన్ని గుర్తించే ఉంటారు. బేగంపేట విమానాశ్ర‌యానికి చేరుకున్న‌ప్ప‌టి నుంచి తిరిగి వెళ్లే వ‌ర‌కూ ప‌లు వేదిక‌ల మీద క‌లిసి క‌నిపించారు ప్ర‌ధాని మోడీ.. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ లు.

ఇద్ద‌రు ప్ర‌ముఖులు క‌లిసిన సంద‌ర్భంలో ఒక‌సారి కాకుంటే ఒక‌సారి అయినా ఇరువురు అధినేతలు మాట్లాడుకోవ‌టం.. ఆస‌క్తిక‌రంగా చ‌ర్చించుకోవ‌టం క‌నిపిస్తుంది. కానీ.. నిన్న‌టి ప్ర‌ధాని టూర్లో అలాంటిది అస్స‌లు క‌నిపించ‌దు. బేగంపేట విమానాశ్ర‌యం ద‌గ్గ‌ర నేత‌ల్ని ప‌రిచ‌యం చేయ‌టం మిన‌హా ప్ర‌త్యేకంగా మాట్లాడుకున్న‌ది క‌నిపించ‌దు.

ఇక‌.. మియాపూర్ ద‌గ్గ‌ర నిర్వ‌హించిన మెట్రో రైలు ప్రారంభం ద‌గ్గ‌రా.. మెట్రో రైల్లో ప్ర‌యాణించిన స‌మ‌యంలోనూ ఈ ఇరువురి మ‌ధ్య మాట్లాడుకోవ‌టం క‌నిపించ‌దు. దాదాపు ప‌ది నిమిషాల‌కు పైనే మియాపూర్ నుంచి కుక‌ట్‌ప‌ల్లి వ‌ర‌కూ ప్ర‌యాణించిన ప్ర‌ధాని.. ముఖ్య‌మంత్రులు ఇద్ద‌రూ మాట్లాడుకోలేదు.

ఆ మాట‌కు వ‌స్తే ప్ర‌ధాని మోడీకి ఒక‌ప‌క్క గ‌వ‌ర్న‌ర్ కూర్చుంటే.. మ‌రోప‌క్క మంత్రి కేటీఆర్ కూర్చున్నారు. మెట్రో రైల్లో ప్ర‌యాణంలో మోడీ.. కేటీఆర్ లు కొంత మాట్లాడుకున్నారు. ఇలా ఒక‌రికి ఒక‌రు ఎవ‌రి దారి వారిదే అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన‌ప్ప‌టికీ.. రాత్రి విందు వేళ‌లో మాత్రం ఇందుకు భిన్న‌మైన ప‌రిస్థితి చోటు చేసుకుంది.

ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్ లో ఇచ్చిన విందు సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ల మ‌ధ్య‌న ఏకాంత స‌మావేశం జ‌రిగింద‌ని చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా వారు కొంత‌సేపు మాట్లాడుకున్నార‌ని తెలుస్తోంది. ఇదే కాకుండా కొంత‌మంది పారిశ్రామిక‌వేత్త‌ల‌తో క‌లిపి ప్ర‌ధాని.. ముఖ్య‌మంత్రుల మ‌ద్య స‌మావేశం జ‌రిగిన‌ట్లుగా స‌మాచారం. అయితే.. ఈ స‌మావేశంలో పాల్గొన్న పారిశ్రామివేత్త‌లు ఎవ‌ర‌న్న విష‌యం మాత్రం బ‌య‌ట‌కు రాలేదు. బ‌య‌ట ఉన్న‌ప్పుడు ఎవ‌రి దారి వారు అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన మోడీ.. కేసీఆర్ లు.. నాలుగు గోడ‌ల మ‌ద్య జ‌రిగిన విందు సంద‌ర్భంగా మాత్రం మాట్లాడుకోవ‌టం గ‌మ‌నార్హం.