Begin typing your search above and press return to search.

మోడీ.. కోహినూర్ వజ్రాన్ని తెస్తారా?

By:  Tupaki Desk   |   8 Aug 2015 5:32 AM GMT
మోడీ.. కోహినూర్ వజ్రాన్ని తెస్తారా?
X
తెల్లోడు మనల్ని వందల ఏళ్లు మర్చిపోయి.. లక్షల కోట్ల రూపాయిలు దోచుకెళ్లిన సంగతి తెలిసిందే. మన దగ్గర దోచుకెళ్లిన వాటిలో రెండే రెండింటి గురించి ప్రతి భారతీయుడు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన కోహినూర్ వజ్రాన్ని.. నెమలి సింహాసనాన్ని తెల్లోడు తిరిగి ఇచ్చేస్తే ఎంత బాగుండన్న భావన చాలామంది వ్యక్తం చేస్తుంటారు.

అయితే.. ఇదేమంత ఈజీ కాదు. చూస్తూ.. చూస్తూ కొల్లగొట్టిన అమూల్య సంపదను తెల్లోడు ఇచ్చేసే ఛాన్స్ లేదు. ఓ పాతికేళ్ల కింద కూడా ఇదంతా పగటి కలగా.. పనిమాలిన ఆలోచనగా ఉండేది. కానీ.. ఇప్పుడే పరిస్థితుల్లో మార్పు వచ్చింది.

బ్రిటన్ లోని భారత సమాజం ఇప్పుడు కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇచ్చేయటం మంచిదని.. భారత్ తో మరింత స్నేహాన్ని కాంక్షించే ఉద్దేశమే ఉంటే.. ఆ పని చేయాలన్న డిమాండ్ ఇప్పుడు పుంజుకుంటుంది. పలువురు భారతీయులు ఈ విషయం మీద గత కొద్దికాలంగా తమ వాదనను వినిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ నవంబరులో ప్రధాని మోడీ బ్రిటన్ లో పర్యటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. భారత్ కు చెందిన కోహినూర్ వజ్రాన్ని భారత్ కు ఇచ్చేయాలన్న వాదనను భారత సంతతికి చెందిన కీత్ వాజ్ చెబుతున్నారు. నిజానికి ఆయన ఇలాంటి వాదనను వినిపించటం ఇదే తొలిసారి కాదు. కాకుంటే.. ఈసారి ఆయన సరికొత్త ప్రతిపాదన చేశారు. బ్రిటన్ పర్యటనకు వస్తున్న భారత ప్రధాని మోడీకి కోహినూర్ వజ్రాన్ని తిరిగి అప్పగిస్తే బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

భారత్ తో సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు భారత్ కు కోహినూర్ వజ్రాన్ని తిరిగి అప్పగిస్తే.. గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశం ఉందని.. దాన్ని వినియోగించుకోవాలన్న వాదనను వినిపిస్తున్నారు. కీత్ వాజ్ వాదన విన్నప్పుడు.. సగటు భారతీయుడి కల.. సాకారం అయ్యే అవకాశం ఉందేమోనన్న ఆశ కలగటం ఖాయం. ఇలాంటి వాదనను మరింత బలంగా వినిపిస్తే.. ఏమో.. కోహినూర్ భారత్ కు తిరిగి వచ్చినా ఆశ్చర్యం లేదేమో.