Begin typing your search above and press return to search.

బాదుడు సరిపోనట్లు.. యూపీఐ చెల్లింపుల మీదా మోడీ సర్కారు కన్ను?

By:  Tupaki Desk   |   20 Aug 2022 5:31 AM GMT
బాదుడు సరిపోనట్లు.. యూపీఐ చెల్లింపుల మీదా మోడీ సర్కారు కన్ను?
X
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే.. జేబులో పర్సు పెట్టుకోవటం తప్పనిసరి. లేదంటే అంతో ఇంతో నోట్లను జేబుల్లో పెట్టుకున్న తర్వాత బయటకు రావాల్సి ఉండేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అందుబాటులోకి వచ్చిన సాంకేతికత కారణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ఫోన్ ద్వారా పేమెంట్ చేసే సౌకర్యం అందుబాటులోకి రావటంతో.. పేమెంట్ తీరు పూర్తిగా మారిపోయింది. నేరుగా బ్యాంకు ఖాతాలోకి డబ్బులు వెళ్లిపోయే సౌలభ్యంతో రోడ్డు మీద అమ్మే వస్తువుల వ్యక్తి నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకు.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా డిజిటల్ పేమెంట్లు జోరుగా సాగుతున్నాయి.

ఈ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్.. అదేనండి యూపీఐ పేమెంట్లతో మొత్తం పరిస్థితే మారిపోయింది. పెద్దనోట్ల రద్దు అనంతరం సామాన్యులు నుంచి సెలబ్రిటీల వరకు అందరూ డిజిటల్ పేమెంట్ల మీద మక్కువ చూపిస్తన్నారు. ఈ తీరుతో జేబులో డబ్బులు ఎక్కువగా పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. భారీ ఎత్తున సాగుతున్న ఈ యూపీఐ లావాదేవీలపై సర్వీసు ఛార్జీలు వసూలు చేస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని ఆర్ బీఐ పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఇందులో భాగంగా పేమెంట్లకు సంబంధించిన ఛార్జీలపై ఒక చర్చా పత్రాన్ని తెర మీదకు తీసుకొచ్చిన ఆర్ బీఐ.. దీనిపై అక్టోబరు 3 లోపు తమ అభిప్రాయాల్ని.. సూచనల్ని అందించాల్సిన అవసరాన్ని కోరుతున్నాయి. సురక్షితంగా.. అత్యంత సులువుగా నగదు బదిలీ చేసుకునే వీలు ఉండటంతో.. ఈ విధానం వైపు అందరూ మొగ్గు చూపుతున్న వేళ.. దీనిపై ఛార్జీల వడ్డన వేస్తే.. కేంద్రానికి భారీగా ఆదాయం వచ్చే వీలుంది. రోజువారీగా సాగుతున్న లావాదేవీలు దాదాపు 21 కోట్లకు పైనే సాగుతున్నాయి.

మొత్తం 338 బ్యాంకులు లావాదేవీల్లో పాలు పంచుకుంటున్నాయని.. వీటి విలువ అంతకంతకూ పెరిగిపోతున్న పరిస్థితి. గత ఏడాది జులైలో 324 కోట్ల లావాదేవీలు జరిగాయి. వాటి విలువ రూ.6.06 లక్షల కోట్లకు పైనే. ఈ ఏడాది అదే నెలలో 628.8 కోట్ల లావాదేవీలు జరిగితే.. వాటి విలువ రూ.10.62లక్షల కోట్లుగా తేల్చారు. అంటే.. ఏడాది వ్యవధిలో లావాదేవీల సంఖ్య రెట్టింపు కావటమే కాదు.. వాటి మొత్తం కూడా భారీగా పెరుగుతోంది.

మొత్తం లావాదేవీల్లో యాభై శాతం వరకు రూ.200 లోపువే ఉంటున్నట్లు చెబుతున్నారు. రోడ్డు పక్కన పది రూపాయిలకు టీ తాగినా కూడా యూపీఐ పేమెంట్ చెల్లిస్తున్న నేపథ్యంలో లావాదేవీల సంఖ్య అంతకంతకూ ఎక్కకువ అవుతోంది. ఇలాంటి వేళ.. యూపీఐ సేవలపై రుసుములతో పాటు.. వాటిపై జీఎస్టీ విదిస్తే.. భారీగా ఆదాయం వస్తుందంటున్నారు.

కానీ.. అదే జరిగితే.. డిజిటల్ పేమెంట్లు తగ్గిపోయి నగదు చెల్లింపులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉంటే..ఆర్ బీఐ తాజా కసరత్తు చూసినోళ్లు మోడీ సర్కారుపై మండిపడుతున్నారు. ఏదో కారణం చూపించి.. పన్ను బాదుడు బాదేస్తున్న వేళ.. ఇప్పుడీ యూపీఐ చెల్లింపుల్లోనూ బాదుడు కార్యక్రమాన్ని షురూ చేస్తే మాత్రం వ్యతిరేకత భారీగా పెరుగుతుందన్న మాట వినిపిస్తోంది.