Begin typing your search above and press return to search.

'రాజ్ పథ్'పేరు మార్చిన మోడీ సర్కార్.. కొత్త పేరు ఇదేనట

By:  Tupaki Desk   |   6 Sep 2022 4:36 AM GMT
రాజ్ పథ్పేరు మార్చిన మోడీ సర్కార్.. కొత్త పేరు ఇదేనట
X
ఏళ్లకు ఏళ్లుగా.. జనజీవనంలో ఒక భాగంగా మారిన కొన్ని పేర్లను మార్చే విషయంలో సరికొత్త పంథాను అనుసరిస్తోంది మోడీ సర్కార్. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఇప్పటికే పలు పేర్లను మార్చిన కేంద్రం తాజాగా ఢిల్లీలోని చారిత్రక రాజ్ పథ్ పేరును మార్చాలని నిర్ణయించింది. అదే సమయంలో దానికి కొత్త పేరును కూడా డిసైడ్ చేయటం గమనార్హం.

దేశ రాజధాని ఢిల్లీ అన్నంతనే గుర్తుకు వచ్చేది రాజ్ పథ్. సినిమాల్లోనూ ఢిల్లీని చూపించే వేళ.. ఐకానిక్ గా రాజ్ పథ్ మార్గాన్ని చూపిస్తుంటారు. ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాస్ చంద్రబోస్ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వద్ద వరకు ఉన్న రోడ్డును రాజ్ పథ్ గా వ్యవహరిస్తుంటారు.

బ్రిటిషర్ల కాలంలో రాజమార్గంగా రాజ్ పథ్ పేరునే వినియోగించేవారు. ఇటీవల కాలంలో రాజ్ పథ్.. సెంట్రల్ విస్టా లాన్ ను కొత్త రూపాలతో త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో.. దేశ రాజధాని నడిబొడ్డున ఉన్న రాజ్ పథ్ మార్గ్ పేరు మార్చాలని మోడీ సర్కారు భావిస్తోంది. ఇందులో భాగంగా దీనికి ‘కర్తవ్యపథ్’గా కొత్త పేరుపెట్టాలని నిర్ణయించారు.

ఈ నెల (సెప్టెంబరు) ఏడున న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో నిర్వహించే ప్రత్యేక సమావేశంలో కౌన్సిల్ ముందుకు రాజ్ పథ్ పేరును మార్చే ప్రతిపాదనను తీసుకొచ్చి.. తాము అనుకున్న కర్తవ్య పథ్ పేరును పెట్టనున్నారు. బ్రిటీషర్లు వాడిన పేర్లను.. గుర్తులను వదిలించుకోవాల్సిన అవసరం ఉందంటూ పంద్రాగస్టు వేళ తన ప్రసంగంలో స్పష్టం చేసిన ప్రధాని మోడీ.. అందుకు తగ్గట్లే తాజాగా రాజ్ పథ్ పేరును మార్చేందుకు డిసైడ్ అయ్యారు.

ఇంతకీ ఈ మార్గానికి రాజ్ పథ్ పేరు ఎందుకు వచ్చిందన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. చరిత్రలోకి వెళ్లాల్సి ఉంటుంది. లండన్ లో జార్జ్ 5 తన తండ్రి ఎడ్వర్డ్ 7 స్మారకార్థం 1905లో కింగ్స్ వేను (రాజమార్గం) ప్రారంభించారు. రాజ్ పత్ దీనినే పోలి ఉంటుంది. 1911లో కోల్ కతా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చిన బ్రిటీష్ వైశ్రాయ్ పాలన వేళ.. దర్బార్ కోసం అప్పటి బ్రిటిష్ చక్రవర్తి జార్జ్ 5 వచ్చారు. ఆ సమయంలోనే రాజ్ పథ్ పేరు వాడుకలోకి వచ్చింది.

సెంట్రల్ విస్టా రీడెవలప్ మెంట్ లో భాగంగా ఈ రోడ్డును మీడియా.. ప్రభుత్వ డాక్యుమెంట్లలో సెంట్రల్ విస్టా ఎవెన్యూగా చెబుతారు. అయినప్పటికీ అనధికారికంగా మాత్రం రాజ్ పథ్ గానే నడుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే కర్తవ్య పథ్ గా మార్చనున్నారు. రానున్న రోజుల్లో మోడీ సర్కారు మరెన్ని గుర్తుల్ని.. ప్రదేశాల పేర్లను మార్చాల్సి వస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.