Begin typing your search above and press return to search.

దేశంలో అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించిన మోడీ !

By:  Tupaki Desk   |   16 Nov 2021 11:30 AM GMT
దేశంలో అత్యంత  పొడవైన ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించిన మోడీ !
X
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం సుల్తాన్‌ పూర్ జిల్లా క‌ర్వాల్ ఖేరీ వ‌ద్ద ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పూర్వాంచ‌ల్ ఎక్స్‌ ప్రెస్ వేను ప్రారంభించారు. ప్ర‌ధాని మోదీ సీ-130 హెర్క్యుల‌స్ విమానంలో ఈ ప్రారంభోత్స‌వానికి హాజ‌ర‌య్యారు. పూర్వంచ‌ల్ ఎక్స్‌ ప్రెస్ వేపై నిర్మించిన ఎయిర్ స్ట్రిప్‌ పై ఆ సీ-130 విమానం ల్యాండ‌య్యింది. ఈ ఎక్స్‌ ప్రెస్ వే ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోదీ తో పాటు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగీ ఆదిత్య‌నాథ్‌, గ‌వ‌ర్న‌ర్ ఆనందీబెన్ ప‌టేల్ కూడా పాల్గొన్నారు. ఈ ఎక్స్‌ ప్రెస్ వేను మొత్తం 341 కిలోమీట‌ర్ల పొడ‌వుతో నిర్మించారు.

ఈ ఎక్స్‌ ప్రెస్ వే ల‌క్నో జిల్లాలో ల‌క్నో-సుల్తాన్‌పూర్ జాతీయ ర‌హ‌దారిపైగ‌ల‌ చౌద్‌ స‌రాయ్ గ్రామం వ‌ద్ద ప్రారంభ‌మై.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌-బీహార్ స‌రిహ‌ద్దుకు తూర్పున 18 కిలోమీట‌ర్ల దూరంలో జాతీయ ర‌హ‌దారి 31 మీదగ‌ల హైద‌రియా గ్రామం వ‌ద్ద ముగుస్తుంది. అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ఎయిర్‌ ఫోర్స్ ఫైట‌ర్ జెట్‌ లు ల్యాండ్ అవ‌డానికి, టేకాఫ్ అవ‌డానికి వీలుగా ఈ ఎక్స్‌ ప్రెస్ వేపై నిర్మించిన 3.2 కిలోమీట‌ర్ల ఎయిర్ స్ట్రిప్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఉన్న‌ది.

ప్ర‌స్తుతం ఆరు లేన్‌ ల‌లో నిర్మిత‌మైన ఈ ఎక్స్‌ ప్రెస్ వేను భ‌విష్య‌త్తులో ఎనిమిది లేన్‌ ల‌కు మార్చ‌నున్నారు. ఈ ఎక్స్‌ ప్రెస్ వే నిర్మాణానికి అంచ‌నా వ్య‌యం రూ.22,500 కోట్లు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లోని తూర్పు ప్రాంతాలు ప్ర‌త్యేకించి ల‌క్నో, బారాబంకీ, అమేథీ, అయోధ్య, సుల్తాన్‌ పూర్‌, అంబేద్క‌ర్ న‌గ‌ర్‌, అజాంగ‌ఢ్‌, మ‌వూ, ఘాజీపూర్ జిల్లాల ఆర్థిక ప్ర‌గ‌తికి మ‌రింత ఊతం ఇవ్వ‌డం కోసం ఈ ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించారు.

ఇక ర‌హ‌దారిని ప్రారంభించిన అనంత‌రం ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ.. పూర్వాంచల్ ప్రాంతవాసులకు ఈ ఎక్స్ ప్రెస్ హైవేను అందిస్తున్నందుకు ఆనందంగా ఉంద‌న్నారు. పూర్వాంచ‌ల్ ఎక్స్‌ ప్రెస్ హైవే ఉత్త‌ర ప్ర‌దేశ్‌ కు గ‌ర్వ‌కార‌ణమ‌న్నారు. రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలో ఆర్థిక పురోగ‌తికి ఈ ర‌హ‌దారి ఎంతో దోహదం చేస్తుంద‌న్నారు.