Begin typing your search above and press return to search.

సోఫా వద్దని కుర్చీ తెప్పించుకొని మరీ కూర్చున్న మోడీ

By:  Tupaki Desk   |   6 Sep 2019 6:52 AM GMT
సోఫా వద్దని కుర్చీ తెప్పించుకొని మరీ కూర్చున్న మోడీ
X
ఎప్పుడేం చేయాలన్న దాని కంటే ఎప్పుడేం చేయకూడదన్న విషయంపై అవగాహన ఉన్న రాజకీయ నేతకు తిరుగు ఉండదు. ఎంతటి తెలివి ఉన్నప్పటికీ.. చేయకూడని పనిని చేయకూడని సమయంలో చేస్తే ఎంత పెద్ద నేతకైనా తిప్పలు తప్పవు. దేశంలో చాలామంది నేతలు ఉన్నా మోడీ మాత్రం అందుకు భిన్నమైన నేతగా చెప్పక తప్పదు. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా వ్యవహరించాలన్న విషయాన్ని ఆయనకు ఒకరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. తాజాగా ఆ విషయాన్ని తన చేతలతో మరోసారి చేసి చూపించారని చెప్పాలి.

ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకుహాజరయ్యారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామం అక్కడ ఆయనకు మరింత ఇమేజ్ పెంచేలా చేసింది. నిజానికి.. దీనికి కారణం మోడీనే. ఇంతకీ జరిగిందేమంటే..

రష్యా ప్రతినిధులతో జరిగిన ఒక ఫోటో సెషన్ ప్రోగ్రామ్ లో మోడీ పాల్గొన్నారు. వేదిక మీదకు మోడీ వచ్చే సమయానికి వరుస కుర్చీలు.. మధ్యలో మోడీ కూర్చోవటానికి వీలుగా ఒక చక్కటి సోఫాను ఏర్పాటు చేశారు. వేదిక మీదకు వచ్చిన ఆయన.. సోఫాను చూసి దాన్ని మార్చాలని.. మిగిలిన వారికి ఏర్పాటు చేసిన రీతిలోనే కుర్చీని వేయాలని కోరారు.

ఈ పరిణామానికి ఒక్కసారి ఆశ్చర్యపోయిన సిబ్బంది.. వెంటనే తేరుకొని మోడీ కోసం పరుగు .. పరుగున కుర్చీ తీసుకొచ్చి ఫోటో సెషన్ ను పూర్తి చేశారు. ఈ ఉదంతాన్ని కేంద్ర రైల్వేశాఖామంత్రి పీయూష్ గోయిల్ సోషల్ మీడియాలో వెల్లడించటమే కాదు.. అందుకు సంబంధించిన ఒక వీడియోను షేర్ చేసుకున్నారు. ప్రధాని మోడీ సింప్లిసిటీ ఎంతన్న విషయాన్ని తెలియజేసే ఈ వ్యవహారంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎప్పుడేం చేయాలో మోడీకి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదేమో?