Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు జీఎస్టీ షాకిచ్చిన మోడీ.. కేవలం రూ.296 కోట్లు ఇచ్చాడే?

By:  Tupaki Desk   |   1 Jun 2022 8:30 AM GMT
కేసీఆర్ కు జీఎస్టీ షాకిచ్చిన మోడీ.. కేవలం రూ.296 కోట్లు ఇచ్చాడే?
X
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయువుపట్టుపై కొడుతూ ఆటాడుకుంటున్నాడు ప్రధాని మోడీ. తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారడం.. ఈనెల జీతాలకు కష్టమైపోతున్న పరిస్థితుల్లో మరో గట్టి షాకిచ్చాడు మోడీ. ఇప్పటికే ఎక్కడా తెలంగాణ ప్రభుత్వానికి అప్పు పుట్టకుండా ఆంక్షలు విధించిన మోడీ సర్కార్.. ఎంత బతిమిలాడుతున్నా కనికరించడం లేదు. కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ మోడీని ఎదురిస్తుండడంతో అంతే స్థాయిలో కేంద్రం తెలంగాణ ఆర్థిక పరిస్థితులపై గట్టి దెబ్బలు కొడుతోంది.

జూన్ నెలలో జీతాలకు కానకష్టంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు , పెన్షన్లు ఇవ్వడం గగనంగా మారింది. ఇక ఈనెల రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధుకు డబ్బుల్లేని పరిస్థితి. దీనికి దాదాపు 7వేల కోట్లు అవసరం.. జీతాలు, పెన్షన్లకు 3వేల కోట్లకు పైగా కావాలి. వీటిని ఎలా సర్దుబాటు చేయాలి? ఎక్కడ అప్పుపుట్టించాలన్న దానిపై కేసీఆర్ సర్కార్ మల్లగుల్లాలు పడుతోంది.

చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడుతున్న వేళ మోడీ సర్కార్ తాజాగా కేసీఆర్ కు మరో షాక్ ఇచ్చింది. కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ బకాయిలను తాజాగా రాష్ట్రాలకు కేంద్రం విడుదల చేసింది. దీనిద్వారా కనీసం 2వేల కోట్లకు పైగా వస్తాయని కేసీఆర్ ఆశలు పెట్టుకున్నారు. కేంద్రం రాష్ట్రాలకు 86912 కోట్ల రూపాయల బకాయిలను రాష్ట్రాలకు విడుదల చేసింది.

ఈ వాటాలో తెలంగాణ ప్రభుత్వానికి కేవలం రూ.296 కోట్లు మాత్రమే ఇచ్చింది కేంద్రం. ఇక పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కు మాత్రం ఏకంగా రూ.3199 కోట్లు విడుదల చేసింది. ఇది కేసీఆర్ సర్కార్ కు మరింత ఇబ్బందికరంగా మారింది. ఏపీకి అన్ని వేల కోట్లు ఇచ్చి తెలంగాణకు ముష్టి 300 కోట్లు కూడా ఇవ్వకపోవడంతో ఈనెల ఎలా గడుస్తుందా? అని కేసీఆర్ సర్కార్ తలపట్టుకుంటోంది.

2017 జులై1న దేశంలో జీఎస్టీని అమల్లోకి తెచ్చింది కేంద్రం. జీఎస్టీ అమలు తర్వాత కలిగే రెవెన్యూ లోటు భర్తీకి ఐదేళ్లపాటు రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వాలని చట్టం చేసింది. అందులో భాగంగానే ఏపీకి భారీగా పరిహారం ఇచ్చి తెలంగాణకు కేవలం 296 కోట్లు ఇచ్చింది. ఈ పరిణామం కేసీఆర్ సర్కార్ కు మింగుడుపడడం లేదు. మోడీ కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం అప్పులు తీసుకునేందుకు కేంద్రప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. దీంతో కరోనా తర్వాత అతలాకుతలమైన రాష్ట్ర సర్కార్ కు ప్రతీ నెల ఒక గండంలా గడుస్తోంది. క్లిష్టమైన ఈ జూన్ నెలను కేసీఆర్ సర్కార్ ఎలా అధిగమిస్తుందన్నది కీలకంగా మారింది. జూన్ లో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు, వడ్డీలు, రైతు బంధుకు డబ్బులు వేయడం కేసీఆర్ సర్కార్ తలకు మించిన భారంగా మారింది. నిధుల సేకరణ కానకష్టంగా మారడంతో ఆర్థికశాఖ ఆందోళన చెందుతోంది. జూన్ లోనే సుమారు రూ.20వేల కోట్లు చెల్లించాల్సినవే ఉండడంతో సర్దుబాటు ఎలా అన్న అంశంపై మల్లగుల్లాలు పడుతోంది.