Begin typing your search above and press return to search.

‘అజా’ వచ్చింది.. మోడీ ప్రసంగం ఆగిపోయింది

By:  Tupaki Desk   |   28 March 2016 4:09 AM GMT
‘అజా’ వచ్చింది.. మోడీ ప్రసంగం ఆగిపోయింది
X
మోడీ పేరు విన్న వెంటనే ముస్లింల వ్యతిరేకిగా ఆయన్ను గుర్తు తెచ్చుకుంటారు. ముస్లింలు అంటే ఆయనకు ఏ మాత్రం ఇష్టం ఉండదని.. వారి ప్రయోజనాల్ని.. హక్కుల్ని అదిమేసేలా వ్యవహరిస్తుంటారని ఆయనపై పలు ఆరోపణలు.. విమర్శలు చేయటం తెలిసిందే. ముస్లింల విషయంలో ఆయన కరకుగా ఉంటారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే.. అందుకు భిన్నమైన ఘటన ఒకటి తాజాగా చోటు చేసుకుంది. ప్రధానిగా వ్యవహరిస్తున్న మోడీ చేసిన చర్య అందరి దృష్టిని ఆకర్షించటమేకాదు.. పలువురు ముస్లింలకు ఆయన అసలు తీరు ఎలా ఉంటుందన్న విషయం పబ్లిక్ గా నిరూపితమైంది.

తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా పలు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్న ప్రధాని మోడీ.. తాజాగా పశ్చిమబెంగాల్ లో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలోని ఖరగ్ పూర్ లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. బహిరంగ సభను ఉద్దేశిస్తూ మోడీ మాట్లాడుతున్న సమయంలో.. వేదికకు కాస్త దగ్గరగా ఉన్న మసీదు నుంచి ఆజా వినిపించింది. వెంటనే అలెర్ట్ అయిన మోడీ.. తన ప్రసంగాన్ని నిలిపివేశారు.

ఆజా వచ్చిన వెంటనే మోడీ స్పందించటమే కాదు.. రెండు నిమిషాల పాటు అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరిన మోడీ.. తన కారణంగా ఎవరి ప్రార్థనలు ఇబ్బందికరంగా మారకూడదని వ్యాఖ్యానించారు. మళ్లీ ప్రార్థనల అనంతరం తన ప్రసంగం కొనసాగించారు. ఈ సంఘటనతో ఇతర మతాల మీద తనకున్న గౌరవాన్ని మోడీ చేతల్లో నిరూపించారని చెప్పొచ్చు.