Begin typing your search above and press return to search.

బంగ్లాదేశ్‌ లోని కాళీ మాత‌ ఆల‌యంలో మోదీ పూజ‌లు!

By:  Tupaki Desk   |   27 March 2021 7:18 AM GMT
బంగ్లాదేశ్‌ లోని  కాళీ మాత‌ ఆల‌యంలో మోదీ పూజ‌లు!
X
రెండు రోజుల పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్ వెళ్లిన భార‌త‌ ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లిన సంగతి తెలిసిందే. బాంగ్లాదేశ్ లో మోడీ ప‌లు కార్య‌క్ర‌మాల్లో వరుసగా పాల్గొంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ఉద‌యం ఆయ‌న సత్కిరా జిల్లా ఈశ్వరీపూర్ లోని జెశోరేశ్వ‌రి కాళీ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్నారు. దుర్గామాత శ‌క్తి పీఠాల్లో జెశోరేశ్వ‌రి ఆల‌యం ఒక‌‌టి. ఆలయానికి చేరుకున్న ప్రధాని మోడీకి కళాకారులు నృత్యాలు, భాజాలతో స్వాగతం పలికారు. చేతితో తయారుచేసిన ప్రత్యేక బంగారు ముకుటాన్ని(కిరీటాన్ని) అమ్మవారికి అలంకరించారు.

కాళీ మాత‌ను ద‌ర్శించుకున్న అనంత‌రం మోదీ మీడియాతో మాట్లాడుతూ... ఈ రోజు ఇక్క‌డి కాళీ మాత‌కు పూజ చేసే అవ‌కాశం ల‌భించిందని చెప్పారు. మాన‌వాళిని క‌రోనా నుంచి కాపాడాలని తాను జ‌గ‌న్మాత‌ను కోరుకున్నాన‌ని మోదీ చెప్పారు. తన జీవితంలో ఈరోజు చాలా ముఖ్యమైనదని, ఈరోజు ఎన్నటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. ఈ ఉత్సవాల్లో తనను భాగస్వామిని చేసినందుకు బంగ్లాదేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, బంగ్లాదేశ్‌ 50వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో అతిథిగా పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్క‌డకు వెళ్లారు. అలాగే, ఆయ‌న ప‌లు కార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొంటున్నారు. ఇక ఇవాళ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భేటీ అవనున్నారు ప్రధాని. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. హిందూ విశ్వాసాల ప్రకారం.. భారత్‌, పొరుగు దేశాల్లోని 51 శక్తిపీఠాల్లో జెషోరేశ్వరి కాళీ ఆలయం ఒకటి. 16వ శతాబ్దంలో హిందూ రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.