Begin typing your search above and press return to search.

టెక్ కంపెనీల తీరుతో 30 వేల మంది ఫ్రెష‌ర్స్ ఆందోళ‌న‌.. కార‌ణ‌మిదే!

By:  Tupaki Desk   |   10 Oct 2022 8:30 AM GMT
టెక్ కంపెనీల తీరుతో 30 వేల మంది ఫ్రెష‌ర్స్ ఆందోళ‌న‌.. కార‌ణ‌మిదే!
X
టెక్ కంపెనీలలో నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఆలస్యం అవుతుండటంతో ఫ్రెషర్లు కెరీర్ గురించి ఆందోళన చెందుతున్నారు. ఆఫ‌ర్ లెట‌ర్లు పొందిన ఆరు నెల‌ల త‌ర్వాత కూడా ఉద్యోగంలో చేర‌డానికి వారు ఎదురుచూడాల్సి వ‌స్తోంది. దీంతో వారంతా ఆందోళ‌న చెందుతున్నారు. ఉద్యోగంలో చేరి తాము చ‌దువు కోసం చేసిన విద్యా రుణాల‌ను చెల్లించేయొచ్చ‌ని అనుకున్నారు. అయితే దిగ్గ‌జ టెక్ కంపెనీలు సైతం ఆఫ‌ర్ లెట‌ర్లు ఇచ్చి నెల‌ల త‌ర‌బ‌డి గ‌డిచినా త‌మను ఇంకా ఉద్యోగాల్లోకి తీసుకోక‌పోవ‌డంతో ఆఫ‌ర్ లెట‌ర్లు పొందిన వారు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నారు.

కేవ‌లం విద్యా రుణాలు తీసుకున్న‌వారు మాత్ర‌మే కాకుండా మంచి కంపెనీల్లో జాబ్ వ‌స్తుంద‌ని అప్ప‌టికే చేస్తున్న జాబ్‌ను వ‌దులుకున్న‌వారు ఆందోళ‌న చెందుతున్నారు. ఇలా 30,000 మంది ఆఫ‌ర్ లెట‌ర్ల‌తో ఎదురుచూస్తున్నార‌ని చెబుతున్నారు. వీరంతా ఇన్ఫోసిస్‌, విప్రో, క్యాప్ జెమిని, టెక్ మ‌హీంద్రా వంటి దిగ్గ‌జ సంస్థ‌ల్లోనే ఆఫ‌ర్ లెట‌ర్లు పొందార‌ని అంటున్నారు. అయితే వీరిని ఇంకా ఉద్యోగాల్లోకి చేర్చుకోక‌పోవ‌డంతో వీరంతా నెల‌ల త‌ర‌బ‌డి వేచిచూస్తున్నారు.

ప్రీత్ పాల్ సింగ్ భాటియా అనే యువ‌కుడు ఏప్రిల్ 2022లో ఇన్ఫోసిస్ నుంచి ఆఫ‌ర్ లెట‌ర్ పొందారు. అయితే, ఆరు నెలల గ‌డిచినా ఇప్ప‌టికీ అత‌డికి కంపెనీ జాయినింగ్ లెట‌ర్ ఇవ్వ‌లేదు.
"మార్చి 2న, నేను పరీక్ష రాశాను, ఆపై ఇంటర్వ్యూ రౌండ్ పూర్తి చేశాను. ఏప్రిల్‌లో ఇన్ఫోసిస్‌కు ఎంపికయిన‌ట్టు వారి నుంచి మెయిల్‌ను అందుకున్నాను. ఉద్యోగంలో చేర‌డానికి ఇంకా రెండు వారాలు పడుతుందని.. పరీక్షలు, ఫలితాల ఆలస్యం ఇందుకు కార‌ణ‌మ‌ని కంపెనీ మెయిల్‌లో తెలిపింది. కానీ ఇప్పటికి ఆరు నెలలు గ‌డిచినా కంపెనీ నుంచి ఇతర వివరాలు నాతో స‌హా ఎవరికీ అందలేదు. మార్చిలో మా ముందు ఆఫ‌ర్ లెట‌ర్లు అందుకున్న‌ బ్యాచ్ సెప్టెంబర్ 15 నాటికి చేరాల్సి ఉంది, కానీ అది కూడా వాయిదా పడింది, " అని అత‌డు ఒక ప‌త్రిక‌తో త‌న ఆవేద‌న వెళ్ల‌గ‌క్కాడు.

ఇలా ఆన్‌బోర్డింగ్ కోసం నిరీక్షిస్తున్న‌ యువ గ్రాడ్యుయేట్లు తమ భవిష్యత్తు, కెరీర్ గురించి ఆందోళన చెందుతున్నారు. ప్ర‌స్తుతం ర‌ష్యా - ఉక్రెయిన్ యుద్ధం, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం ప‌రిస్థితుల కార‌ణంగా కంపెనీలు త‌గినంత ప్రాజెక్టుల‌ను విదేశాల నుంచి పొంద‌లేక‌పోతున్నాయి. పెద్ద కంపెనీలు కూడా ఇబ్బందులు ప‌డుతున్నాయి. దీంతో త‌మ‌ను హోల్డ్‌లో ఉంచాయని ఆఫ‌ర్ లెట‌ర్లు అందుకున్న‌వారు ఐటీ ఫ్రెష‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. తాము కంపెనీకి మెయిల్ పెట్టినా వారు ప్ర‌తిస్పందించ‌డం లేద‌ని అంటున్నారు.

కంపెనీల నుంచి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో టెక్ గ్రాడ్యుయేట్లు వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. ప్ర‌స్తుతం స్టార్ట‌ప్‌లు ఉద్యోగ నియామ‌కాలు జ‌రుపుతున్నాయి. దీంతో ఐటీ ఫ్రెష‌ర్స్ స్టార్ట‌ప్‌ల‌పై దృష్టి సారించారు. అయితే స్టార్ట‌ప్‌లు శిక్ష‌ణ పొందిన ఉద్యోగుల‌ను తీసుకుంటున్నాయ‌ని అంటున్నారు. ఫ్రెష‌ర్ల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌డం లేద‌ని చెబుతున్నారు.

ప్ర‌పంచంలో ఆర్థిక మాంద్య ప‌రిస్థితుల కార‌ణంగా రిక్రూట్‌మెంట్స్ స‌రిగా సాగ‌డం లేద‌ని అభ్య‌ర్థులు చెబుతున్నారు. కొంత‌మంది రాత‌ప‌రీక్ష‌ను ముగించుకుని.. ఇంటర్వ్యూ రౌండ్ వ‌ర‌కు వ‌చ్చారు. అయితే వారికి అది నిర్వ‌హించ‌కుండా ప్ర‌స్తుతానికి హోల్డ్‌లో పెట్టారు. మ‌రికొంద‌రు తమ ఆప్టిట్యూడ్ పరీక్ష కోసం వేచి ఉన్నారు. మరోవైపు, చివరి సంవత్సరం చ‌దువుతున్న‌ ఐటీ విద్యార్థులు కూడా ఇది తమ ప్లేస్‌మెంట్ ప్రక్రియను ప్రభావితం చేస్తుందని ఆందోళన చెందుతున్నారు.

ఈ నేప‌థ్యంలో.. ఐటీ రంగ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES)... కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. 2,000 కంటే ఎక్కువ క్యాంపస్‌ల చేరిక ప్రక్రియలో జాప్యానికి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది.

కాగా ఒక‌ నివేదిక ప్రకారం.. మార్చి 2023 నాటికి టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌, విప్రో మొత్తం 1,55,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవచ్చని అంచనా వేయబడింది. అయితే ఇది మునుపటితో పోలిస్తే 30% తగ్గ‌డం గ‌మ‌నార్హం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.