Begin typing your search above and press return to search.

కరోనా బీభత్సం .. ఒక్కరోజే 47 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు !

By:  Tupaki Desk   |   24 March 2021 5:36 AM GMT
కరోనా బీభత్సం .. ఒక్కరోజే 47 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు !
X
దేశంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకి వెలుగులోకి వచ్చే పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా శరవేగంగా కొనసాగుతుంది. ఇక, గ‌త‌ 24 గంట‌ల్లో 47,262 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం నిన్న‌ 23,907 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,17,34,058కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 275 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 1,60,441కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,12,05,160 మంది కోలుకున్నారు. 3,68,457 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌ లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 5,08,41,286 మందికి వ్యాక్సిన్లు వేశారు.

కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో వైరస్ వ్యాప్తి పెరుగుతున్న వేళ పాజిటివ్ కేసుల గుర్తింపు, బాధితులకు చికిత్స అందించే విషయంలో వేగం పెంచాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. టెస్టుల సంఖ్య పెంచాలని సూచించింది. టెస్ట్-ట్రాక్-ట్రీట్ ప్రొటోకాల్ ‌ను అనుసరించాలని నిర్దేశించింది. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు తాజా మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని కేంద్ర హోం శాఖ మంగళవారం పేర్కొంది. ఆర్టీ పీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచాలని కొత్త మార్గదర్శకాల్లో హోం శాఖ సూచించింది. కొత్తగా పాజిటివ్‌గా తేలిన వ్యక్తులను గుర్తించగానే వెంటనే ఐసోలేషన్ లేదా చికిత్స కేంద్రానికి తరలించాలని ఆదేశించింది. తద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని తెలిపింది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరూ వ్యాక్సిన్‌ పొందవచ్చని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో కానీ నేరుగా గానీ వ్యాక్సిన్‌ పొందవచ్చని కేంద్ర మంత్రి పకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విస్తృతంగా సాగుతోంది.