Begin typing your search above and press return to search.

భర్త మీద కోపంతో 14 రోజుల పసికందును అలా చేసింది

By:  Tupaki Desk   |   15 Nov 2020 1:30 AM GMT
భర్త మీద కోపంతో 14 రోజుల పసికందును అలా చేసింది
X
కనురెప్పలు కాటేస్తాయని ఊహించగలమా? కన్నబిడ్డ తప్పు చేసినా కడుపులో పెట్టుకునే అమ్మ.. అతి దారుణంగా అభంశుభం తెలియని పసిగుడ్డును చంపేసిన పాశవిక ఘటన హైదరాబాద్ లోని సనత్ నగర్ లో చోటు చేసుకుంది. విన్నంతనే.. ఇలా కూడా జరుగుతుందా? అన్న భయాందోళన కలిగేలా ఉన్న ఈ ఉదంతాన్ని చూస్తే.. మారిన కాలంతో పాటు అమ్మతనంలోనూ మార్పులు వచ్చే పాడు రోజులు వచ్చేశాయా? అన్న సందేహం కలుగక మానదు. ఈ ప్రపంచంలో అన్ని సంబంధాలు దారుణ రీతిలో మారుతున్న వేళ.. పిల్లల విషయంలో తల్లి వ్యవహరించే విషయంలో పెద్దమార్పులు చోటు చేసుకోలేదు.

ఇప్పుడు అలాంటివి కూడా చోటు చేసుకోనున్నాయన్న సందేహానికి తావిచ్చేలా తాజా ఉదంతం చోటు చేసుకుందని చెప్పాలి. భర్తతో.. అత్తారింట్లో ఉన్న గొడవల నేపథ్యంలో పద్నాలుగు రోజుల పసిగుడ్డును మేడ మీద నుంచి కిందకు పారేసి చంపేసిన దారుణ ఘటన చోటు చేసుకుంది. కుత్భుల్లాపూర్ కు చెందిన వేణుగోపాల్ కు ఫతేనగర్ కు చెందిన లావణ్యతో 2016లో పెళ్లైంది. వారికో బాబు ఉన్నాడు. ఇదిలా ఉండగా.. భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇదే సమయంలో లావణ్య మరోసారి గర్భవతైంది. డెలివరీ కోసం పుట్టింటికి వచ్చింది.

కుటుంబ సమస్యలు కొలిక్కి రాకపోవటంతో గత నెలలో ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే.. అప్రమత్తంగా ఉన్న కుటుంబ సభ్యుల పుణ్యమా అని ఆమెను కాపాడుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే.. మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన ఆమె అన్యమనస్కంగా ఉంటోంది. భర్త మీద కోపాన్ని ఏమీ తెలియని పసిగుడ్డు మీద చూపిస్తూ.. తాను ఉంటున్న మూడో అంతస్తు నుంచి కిందకు విసిరేసింది. దీంతో.. ఆ చిన్నారి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఉదంతం గురించి తెలుసుకున్న భర్త.. భార్య మీద ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారిస్తున్నారు. అమ్మతనానికి మచ్చ తెచ్చిన లావణ్య ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.