Begin typing your search above and press return to search.

ఆన్లైన్ క్లాస్ ఎఫెక్ట్ .. కూతురిని పెన్సిల్ తో పొడిచిన తల్లి !

By:  Tupaki Desk   |   24 Oct 2020 11:10 AM GMT
ఆన్లైన్ క్లాస్ ఎఫెక్ట్ .. కూతురిని పెన్సిల్ తో పొడిచిన తల్లి !
X
ముంబైలో ఓ తల్లి, తన బిడ్డ పై దాడి చేయడం, ఆగ్రహంలో అత్యంత పాశవికంగా ప్రవర్తించటం అందరినీ షాక్ కు గురి చేసింది. ప్రస్తుతం దేశంలో కరోనా కారణంగా స్కూల్స్ కొనసాగడం లేదు. చాలా వరకు ఆన్లైన్ తరగతుల ద్వారానే విద్యాబోధన సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ క్లాస్ సందర్భంగా, శ్రద్ధగా పాఠాలు వినకుండా, ఉపాధ్యాయులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని పెన్సిల్ తో కిరాతకంగా పొడిచింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ... ఆరో తరగతి చదువుతున్న 12 ఏళ్ల కుమార్తె ఆన్లైన్ తరగతులకు హాజరవుతోంది. ఆన్లైన్ క్లాసులో ఉన్న కుమార్తె టీచరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో విఫలమైంది.

దీంతో ఆ తల్లి ఆగ్రహంతో ఊగిపోయింది. విపరీతమైన కోపంలో ఉన్న ఆ తల్లి విచక్షణ జ్ఞానాన్ని మరిచిపోయి పన్నెండేళ్ల బిడ్డపై దారుణంగా దాడి చేసింది . ఆమె వీపు భాగంలో పెన్సిల్ తో పొడిచి, పలుమార్లు ఆ బాలికను నోటితో కొరికింది. దీంతో బాలిక తీవ్ర గాయాలపాలైంది . తల్లి చేస్తున్న దారుణాన్ని చూసిన బాలిక చెల్లెలు, చైల్డ్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వారికి చెప్పింది. దీంతో చైల్డ్ లైన్ నుండి ఇద్దరు ప్రతినిధులు బాలిక ఇంటికి చేరుకుని, అక్కడి పరిస్థితులను పరిశీలించి, తల్లి తో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ తల్లి బాలిక చదువుకోకుండా నిర్లక్ష్యంగా ఉండటం తప్పంటూ వారితో వాదించింది.

దీంతో సదరు మహిళ పై సాంట్ ‌క్రూజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. స్కూల్స్ లేకపోవడం, పిల్లలు ఇళ్లలోనే ఉంటూ తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా ఇబ్బంది పెడుతూ ఉండడం, చదువుకోకపోవటం, కరోనా కారణంగా నెలకొన్న ఆర్థిక ఇబ్బందులు వెరసి తల్లిదండ్రులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతూ ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ముంబైలో జరిగిన తాజా ఘటన కూడా విచక్షణ కోల్పోయిన తల్లి మానసిక పరిస్థితికి అద్దం పడుతుందని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు.