Begin typing your search above and press return to search.

బుట్టా రేణుకకు ఆదోని ఎమ్మెల్యే సీటు

By:  Tupaki Desk   |   24 Feb 2019 5:44 AM GMT
బుట్టా రేణుకకు ఆదోని ఎమ్మెల్యే సీటు
X
2014 ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు బుట్టా రేణుక. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో వైసీపీని కాదని టీడీపీలో చేరారు. మళ్లీ ఇప్పుడు కర్నూలు ఎంపీగానే పోటీ చేయాలనేది బుట్టా రేణుక ప్లాన్‌. కానీ ఇప్పుడు ఆమె ప్లాన్స్ ఏవీ వర్కవుట్‌ అయ్యేట్లు కన్పించడం లేదు. ఎందుకంటే.. కోట్ల ఫ్యామిలీ టీడీపీలోకి రాబోతుంది. ఇప్పటికే.. కోట్ల ఫ్యామిలీకీ వాళ్లు ఆశించిన సీట్లను చంద్రబాబు ఆఫర్‌ చేశారు. కర్నూలు నుంచి కోట్ల పోటీ చేయబోతున్నారు. దీంతో.. ఈసారి బుట్టా రేణుకను కర్నూలు ఎంపీగా కాకుండా ఆదోని ఎమ్మెల్యేగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారట చంద్రబాబు.

కానీ బుట్టా రేణుకకు మాత్రం ఎంపీగానే పోటీ చేయాలని ఉంది. ఆమెకు రాష్ట్ర రాజకీయల పట్ల పెద్దగా ఆసక్తి లేదు. అదీగాక.. బుట్టా ఫ్యామిలికి ఉన్న వ్యాపారాల దృష్ట్యా ఎంపీ సీటు అయితే బాగుందని రేణుకు ప్లాన్‌. కానీ కోట్ల ఫ్యామిలి కూడా ఇప్పుడు చంద్రబాబుకు కావాలి. కోట్ల ఫ్యామిలీకి ఉన్న ఓట్‌ బ్యాంక్‌ ని మిస్‌ చేసుకునేందుకు చంద్రబాబు సిద్ధంగా లేడు. అందుకే.. కర్నూలు ఎంపీ సీటు దాదాపుగా కోట్ల కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కి కన్‌ ఫర్మ్‌ చేశారు. అయితే.. ఆదోని ఎమ్మెల్యే సీటుని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడుకి ఇస్తానని బాబు మాట ఇచ్చారు. అయితే.. మారుతున్న సమీకరణాలతో ఎప్పటికప్పుడు తన ప్లాన్స్‌ ని కూడా మారుస్తున్నారు చంద్రబాబు. ఇప్పుడు మీనాక్షి నాయుడ్ని కూడా కాదని బుట్టా రేణుకను నిలబెట్టే ఆలోచనలో ఉన్నారు. కానీ రేణుక మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అస్సలు సుముఖత చూపించడం లేదు. ఇప్పటికే తన అనుచరులతో కూడా రేణుక మాట్లాడుతున్నారు. అనవసరంగా పార్టీ మారామా అనే ఆలోచనలో కూడా ఉన్నారట బుట్టా రేణుక. మరోవైపు.. ఎలాగైనా సరే.. కర్నూలు జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ స్థానాల్లో కచ్చితంగా 10 గెలవాలనే పట్టుదలతో ఉన్నారు చంద్రబాబు.