Begin typing your search above and press return to search.

ఎంపీగారి ప్రత్యేక పౌడర్ పాల లాజిక్!

By:  Tupaki Desk   |   14 Sep 2016 9:38 AM GMT
ఎంపీగారి ప్రత్యేక పౌడర్ పాల లాజిక్!
X
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంపై బీజేపీ నేతలు సంబరాల వంటివి చేసుకుంటుంటే.. ఆ ప్యాకేజీ వద్దు - హోదాయే కావాలి - ప్రజలు కోరుకున్న హోదాయే కావాలని ప్రతిపక్షాలు - ప్రజాసంఘాలు ధర్నాలు చేస్తూ అసంతృప్తిగా ఉన్నాయి. ఇచ్చిన వారి సంగతి, ఆ ప్యాకేజీని వద్దంటున్న వారి సంగతి అలా ఉంటే.. ప్యాకేజీ తీసుకున్నవారి పరిస్థితే ఎటూ కాకుండా ఉంది. ప్యాకేజీపై పూర్తి సంతృప్తి ప్రకటించి బీజేపీతో సంబరాలు చేసుకోనూలేరు - అలా అని హోదాయే కావాలని ప్రతిపక్షాలతోనూ - ప్రజలతోనూ కలిసి పోరాడనూ లేరు. ఇదే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు టీడీపీ ఎంపీ శివప్రసాద్!

పాల కోసం బిడ్డ - పాలు ఇవ్వలేక తల్లీ.. ఇద్దరూ ఏడుస్తున్నట్లుగానే రాష్ట్రం ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో బిడ్డను బతికించుకోవాలంటే పౌడర్ పాలు పట్టడం తప్పదని శివప్రసాద్ విశ్లేషించారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా కావాలో?...ప్యాకేజీ కావాలో? ప్రజలే నిర్ణయించుకోవాలని కూడా ఆయన అన్నారు. అంటే.. బిడ్డ ఆంధ్రప్రదేశ్ అని - తల్లి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పాలనేది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది.

కాసేపు ఆయన లాజిక్ ప్రకారమే ఆలోచిస్తే.. ఆ సమయంలో బిడ్డ నిచ్చిన తండ్రి ఆవుపాలు తెస్తానని చెప్పి మాటిచ్చి అందరిముందూ ఒప్పుకుని తీరా ఇప్పుడేమో పౌడర్ పాలు తప్ప ఇంకేమీ ఇవ్వలేను అంటే ఏమిచేయాలి? స్వచ్చమైనా ఆవుపాలు కంటే - దుకాణాల్లో దొరికే పాల పౌడరే చాలా బెటర్ అని కూడా చెబుతూ, ప్రకటనలు ఇస్తుంటే ఏమనాలి? తల్లి కూడా పౌడర్ పాలు చాలా గొప్పవని, ఆవుపాలు తాగిన బిడ్డలు ఏమంత గొప్పగా పెరిగిపోతున్నారో చెప్పాలని ఎదురుప్రశ్నిస్తుంటే ఆ బిడ్డ ఎవరికి చెప్పుకోవాలి? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటున్న ప్రజలు.

శివప్రసాద్ లాజిక్ ప్రకారమే ఆలోచించి ప్రజలు వేస్తున్న ఈ ప్రశ్నల్లో... తండ్రి అంటే కేంద్రప్రభుత్వం అని - పాల పౌడర్ అంటే ప్యాకేజీ అని - ప్రత్యేక హోదా అంటే స్వచ్చమైన ఆవుపాలు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదుకదా!!