Begin typing your search above and press return to search.

బాబుకు ముద్రగడ రాసిన లేఖలో ఏముంది?

By:  Tupaki Desk   |   3 March 2016 6:30 AM GMT
బాబుకు ముద్రగడ రాసిన లేఖలో ఏముంది?
X
కాపుల్ని బీసీల్లోకి చేర్చాలన్నది దశాబ్దాల నాటి డిమాండ్. నాటి ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఈ డిమాండ్ ఇప్పటికి తీరకుండా ఉంది. కాపుల ప్రయోజనాల్ని దెబ్బ తీసిన తప్పుడు నిర్ణయాన్ని సరి చేయటానికి అధికారపక్షం అండ తప్పనిసరి. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే కాపుల్ని బీసీల్లోకి చేరుస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించటం.. ఎన్నికల్లో బాబు ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి కావటం తెలిసిందే. సీఎం అయి.. 20 నెలలు పూర్తి అయినా కాపుల్ని బీసీల్లోకి చేర్చే విషయంపై ఏపీ సర్కారు కామ్ ఉండిపోయింది. దీనిపై గళం విప్పిన కాపునేత కమ్ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపుల్ని బీసీల జాబితాలో చేర్చాలన్న డిమాండ్ ను ఏపీ సర్కారుకు ప్రధాన అంశంగా మార్చటంలో సక్సెస్ అయ్యారు.

తాను చేపట్టిన ఆందోళన.. అనంతరం చేసిన దీక్షతో ఏపీ సర్కారు చెమటలు పట్టించిన ముద్రగడ.. చివరకు ఏపీ ప్రభుత్వ మంత్రుల బృందం తన ఇంటికి వచ్చి.. తాను చేసిన డిమాండ్లను నిర్దేశిత కాలంలో పూర్తి చేయటానికి ఓకే చెప్పేలా చేయటంలో సక్సెస్ అయ్యారు. అనుకున్న గడువు పూర్తి కాక ముందే తనను ఏపీ సర్కారు మోసం చేసిందంటూ.. ఏపీ ముఖ్యమంత్రికి ఒక లేఖను రాశాను ముద్రగడ. సదరు లేఖలో.. ఏపీ ముఖ్యమంత్రి వ్యక్తిగత అంశాల్ని ప్రస్తావించటమే కాదు.. ఆయన్ను కించపర్చేలా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

తన డిమాండ్ల సాధనకు విమర్శల కంటే కూడా.. హేతుబద్ధమైన వాదన అవసరమన్న విషయాన్ని ముద్రగడ మర్చిపోయారు. తన ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా చేపట్టాలే తప్పించి.. రాజకీయాంశాల ప్రస్తావనతో పక్కదారి పట్టేలా చేయకూడదన్న అంశాన్ని మిస్ అవుతున్నారు. ముద్రగడ తాజా లేఖ చూస్తే.. ఆయనకు కాపుల డిమాండ్లు తీరటం ముఖ్యమా? లేక.. ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించటం ముఖ్యమా? అన్న డౌట్ రాక మానదు. ఆయన రాసిన లేఖలోని కొన్ని అంశాల్ని చూస్తే..

‘‘బ్రిటీష్ పాలనలో ఉన్న రిజర్వేషన్ల నుంచి ఏ కులాన్నయినా తొలగించారా? కానీ.. దరిద్రపు జాతి పేదరికంలో ఉండి మగ్గటం వలన రోడ్లు ఎక్కి అడిగే పరిస్థితి లేకుండా పోయింది. స్వాతంత్ర్యం ఈ దేశానికి వచ్చిందేమో కానీ.. మా జాతికి రాలేదని భావిస్తున్నాను’’

‘‘కాపులకు రుణ మంజూరుపై మోసపూరిత జీవో జారీ చేశారు. జన్మభూమి కమిటీ ప్రమేయంతోనే దరఖాస్తులు ఆమోదించేలా నిబంధనలు ఉన్నాయి. ఇదేం న్యాయమని అడుతున్నా. ఇలా ఇచ్చే నిధులు మీ రెండు ఎకరాల ఎస్టేట్ లోనివి కావు. తక్షణం ఇస్తానన్న రూ.500కోట్ల మాట మరిచిపోయి.. బడ్జెట్ లో వెయ్యి కోట్లు పెడతామంటున్నారు. మా జాతికి ఎందుకూ అక్కరకు కారి రుణాల మంజూరుకు భారీ కార్యక్రమం పెట్టి.. ఒక 420 నాయకుడితో నేను కాపు జాతిలో చెడపుట్టానని తిట్టుస్తున్నారు’’

‘‘నా మొదటి ఉత్తరం వచ్చే దాకా.. మా జాతి వల్ల కుర్చీలో ఉన్నానని చెప్పటం తప్ప.. వారికి ఇచ్చిన హామీలు అమలు చేయాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? ఈ దరిద్రపు జాతి పూర్తిగా అంతరించి పోవాలన్నదే మీ కోరికగా కనిపిస్తోంది. రెండు ఎకరాల రైతు అయిన మీరు ఈ పేద జాతిపై సానుభూతి చూపకపోవటం అతి దారుణం’’

‘‘మీరు చెప్పుకునే క్యారెక్టరు పిల్లనిచ్చిన మామను సీఎం పదవి నుంచి దించినప్పుడే లోకానికి తెలిసింది. మీరు 1984 నుంచి చేసిన నేరాల చిట్టా విప్పమంటారా? ఇప్పుడు నాపై పెడుతున్న ఆంక్షలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మీపై పెట్టి ఉంటే మీరు ఎక్కడ ఉండేవారో..?’’

‘‘మా సోదరులను బెదిరించటం కాదు.. దమ్మూ.. ధైర్యం.. చీమూ నెత్తురు ఉంటే మా జాతిని టెర్రరిస్టులుగా ముద్ర వేసి జైలులో పెట్టండి’’

‘‘పట్టిసీమకు.. పప్పు బెల్లాలకు.. రాజధానికి కొబ్బరికాయ కొట్టటానికి.. విదేశాలు తిరగటానికి.. ప్రత్యేక విమానాల్లో విహరించటానికి.. గెస్టు హౌసులకు.. ఆపీసులకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారే.. మాకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే ఆర్థిక పరిస్థితి బాగోలేదని అబద్ధాలు చెప్పి తప్పించుకుంటే ఈ జాతి సహించదు’’

‘‘మీ రెండు ఎకరాల ఎస్టేట్ నిధులు కానీ.. చీకటి ఒప్పందాల నిధులు కానీ మేం కోరుకోవటం లేదు. రాష్ట్ర ఆదాయంలో మా జాతి పన్నులరూపంలో కట్టిన వాటా కూడా ఉంది. తక్షణం హామీలు అమలు చేయాల్సిందే. అవన్నీ మీ సంతకంతో అధికారికంగా హామీ పత్రంగా మార్చి 10 సాయంత్రం లోపు పంపాలి. లేనిపక్షంలో మార్చి 11 ఉదయం 10 గంటల నుంచి నా ఇంటి ఆవరణలో ఆమరణ దీక్ష చేపడతా’’