Begin typing your search above and press return to search.

వైఎస్ జగన్ కు ముద్రగడ లేఖ..ఎందుకంటే!

By:  Tupaki Desk   |   9 July 2019 7:30 AM GMT
వైఎస్ జగన్ కు ముద్రగడ లేఖ..ఎందుకంటే!
X
విషయం పాతదే - ముఖ్యమంత్రే మారారు. ముద్రగడ మరో లేఖను రాశారు. ఇది వరకూ చంద్రబాబు నాయుడుకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతూ పలు సార్లు ముద్రగడ పద్మనాభం లేఖలు రాశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ ఇచ్చిన కాపులకు రిజర్వేషన్ హామీని అమలు పరచాలని అప్పట్లో ముద్రగడ వరస పెట్టి లేఖలు రాశారు. అయితే వాటిని చంద్రబాబు నాయుడు బుట్ట దాఖలు చేస్తూ వచ్చారు.

కాపుల రిజర్వేషన్ అంశంలో చంద్రబాబు నాయుడు ఒకింత కపట వైఖరిని అనుసరించారు. అధికారం అందగానే రిజర్వేషన్లు అని ప్రకటించి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అనేక డొక్కామొక్కీలు పడ్డారు. అయితే చంద్రబాబు ఏం చేసినా తెలుగుదేశంలోని కాపు నేతలు సమర్థించారు.

ముద్రగడ ఒక దశలో చంద్రబాబుపై తీవ్రంగా స్పందించారు. ఆ తర్వాత జగన్ పై విరుచుకుపడ్డారు. కాపు రిజర్వేషన్ల అంశం తన పరిధిలోనిది కాదని జగన్ పాదయాత్ర సందర్భంగా తేల్చేశారు. దీంతో ముద్రగడ ఆయనపై విమర్శలు చేయడం ఆరంభించారు.

ఎన్నికల సమయంలో ముద్రగడ కామ్ అయిపోయారు. అటు చంద్రబాబుకూ మద్దతు పలకలేదు - జగన్ కూ మద్దతు అనలేదు. పవన్ వైపూ మొగ్గు చూపలేదు. కామ్ అయిపోయారాయన.

ఇక ఇప్పుడు మళ్లీ కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సీఎం జగన్ కు లేఖను రాశారాయన. అయితే అది తన పరిధిలోని అంశం కాదని - ఆ విషయంలో తను మోసపూరిత హామీని ఇవ్వలేనంటూ ఎన్నికలకు ముందే జగన్ తేల్చేసిన సంగతి తెలిసిందే!