Begin typing your search above and press return to search.

అంబానీనా మ‌జాకానా.. అంబానీ వ‌స్తే అంతేగా.. అంతేగా!

By:  Tupaki Desk   |   17 Sep 2022 10:30 AM GMT
అంబానీనా మ‌జాకానా.. అంబానీ వ‌స్తే అంతేగా.. అంతేగా!
X
డ‌బ్బు ఉంటే కొండ మీద కోతి కూడా చెప్పిన‌ట్టు ఆడుతుంది అని ఒక సామెత‌. ఇప్పుడు ఇదే సామెత ఖ‌చ్చితంగా అప‌ర కుబేరుడు, ప్ర‌పంచంలో అత్య‌ధిక ధ‌న‌వంతుల్లో 8వ కోటేశ్వ‌రుడు, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీకి కూడా వ‌ర్తిస్తుంది.

ఇంత‌కూ విష‌య‌మేమిటంటే.. ముకేష్ అంబానీ త‌న‌కు కాబోయే కోడ‌ల్ని వెంట‌బెట్టుకుని తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి విచ్చేశారు. అయితే ఆయ‌న‌కు ఒక రాష్ట్ర‌ప‌తికి ద‌క్కిన స్థాయిలో స్వాగ‌త స‌త్కారాలు, విన‌మ్ర న‌మ‌స్కారాలు, వీడ్కోలు కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేశారు.

ముకేష్ అంబానీ క‌నీసం వార్డు మెంబ‌ర్ కూడా కాదు. ఆయ‌న ఒక ధ‌న‌వంతుడు. అంత‌కుమించి ఆయ‌న‌కు ఏ ట్యాగూ లేదు. అయితే వైఎస్సార్సీపీ నేత‌లు, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) అధికారులు అంబానీకి పూర్తిగా సాగిల‌ప‌డిపోయారని విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

గ‌తంలో ఇదే వైఎస్సార్సీపీ నేత‌లు.. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మృతి వెనుక ముకేష్ అంబానీ ఉన్నాడ‌ని ఆయ‌న రిల‌య‌న్స్ మార్టుల‌పై అప్ప‌ట్లో దాడులు చేశారు. అంతేకాకుండా సాక్షి టీవీ, సాక్షి ప‌త్రిక‌లోనూ ప్ర‌త్యేక క‌థ‌నాలు ప్ర‌చురించారు. కృష్ణా-గోదావ‌రి బేసిన్‌లో ఆయిల్ తవ్వ‌కాల‌కు వైఎస్సార్ అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని.. అవి రాష్ట్ర ప్రజ‌ల‌కే ద‌క్కాల‌ని కోరుకున్నార‌ని.. దీంతో ఆయ‌న‌ను హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో చంపించార‌ని ఇలా ఏవో క‌థ‌లు అల్లార‌ని గుర్తు చేస్తున్నారు.

ఆ త‌ర్వాత ఏం జ్ఞానోద‌యం అయిందో కానీ రిల‌య‌న్స్‌లో పెద్ద హోదాలో ఉన్న ప‌రిమ‌ళ్ న‌త్వానీ అనే వ్య‌క్తిని ముకేష్ అంబానీ వెంట‌బెట్టుకుని ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డం, న‌త్వానీ రాజ్య‌స‌భ సీటు ఇవ్వ‌డం జ‌రిగిపోయాయి.

ఇక ప్ర‌స్తుతం విష‌యానికొస్తే ముకేష్ అంబానీకి తిరుమ‌ల ద‌ర్శ‌నం యాత్ర‌లో వైఎస్సార్సీపీ ముఖ్య నేత‌, వైఎస్ జ‌గ‌న్‌కు కుడి భుజంగా చెప్ప‌బ‌డుతున్న ఆ పార్టీ పార్ల‌మెంట‌రీ నేత విజ‌య‌సాయిరెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి నారాయ‌ణ‌స్వామి, చంద్ర‌గిరి ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్ చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి, తిరుప‌తి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి త‌దిత‌రులు అంబానీ సేవ‌లో పుల‌క‌రించిపోయార‌ని విమ‌ర్శలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇక ప్ర‌జాప్ర‌తిధులే కాకుండా తిరుప‌తి జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌ట ర‌మ‌ణారెడ్డి, జిల్లా ఎస్పీ ప‌ర‌మేశ్వ‌ర‌రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని స్వాగ‌త స‌త్కారాలు ప‌లికార‌ని నెటిజ‌న్లు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఇక ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులే అంబానీ సేవ‌లో మునిగి తేలితే టీటీడీ అధికారులు త‌క్కువ తింటారా ఇక వారి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నే లేదంటున్నారు. టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి మొద‌లుకుని అధికార గ‌ణ‌మంతా ముకేష్ అంబానీ సేవ‌లో త‌రించార‌ని అంటున్నారు. ఇంతా చేసిన అంబానీ క‌నీసం వార్డు మెంబ‌ర్ కూడా కాదని గుర్తు చేస్తున్నారు.

రోజూ కొన్ని వేల మంది భ‌క్తులు తిరుమ‌ల‌కు వ‌స్తున్నారు. ద‌ర్శ‌నానికి 20 గంట‌ల కంటే త‌క్కువ స‌మ‌యం ప‌ట్ట‌డం లేదు. సామాన్య భ‌క్తుల‌కే మా పెద్ద పీట అంటూ ఊద‌ర‌గొట్ట‌డం, ఊక‌దంపుడు మాట‌లు చెప్ప‌డం త‌ప్ప టీటీడీ అధికారులు చేస్తుందేమీ లేద‌ని ఇప్ప‌టికే భ‌క్తుల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు ఉన్నాయి.

ఇక మంత్రులు, అంబానీ లాంటి అప‌ర కోటీశ్వ‌రులు వ‌స్తే మాత్రం వారి సేవ‌లో టీటీడీ అధికారులు త‌రిస్తున్నార‌ని భ‌క్తులు, సామాన్య జ‌నం మండిప‌డుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.