Begin typing your search above and press return to search.

అంపశయ్యపై సోషలిస్టు యోధుడు.. ఆ నేతాజీదో చరిత్ర

By:  Tupaki Desk   |   3 Oct 2022 12:02 PM GMT
అంపశయ్యపై సోషలిస్టు యోధుడు.. ఆ నేతాజీదో చరిత్ర
X
భారత రాజకీయాల్లో ఓ శిఖరం అంపశయ్యపై ఉంది. దాదాపు ఆరు దశాబ్దాల కాలంలో తనదైన ముద్ర వేసిన ఆ నాయకుడు ఆస్పత్రి ఐసీయూలో ఉన్నారు. జయప్రకాశ్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా, రాజ్ నారాయణ తదితర సోషలిస్టు తరం నాయకుల అడుగుజాడల్లో ఎదిగిన ఆ నేతాజీది ఓ చరిత్ర. ఆయనే ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి ములాయం సింగ్ యాదవ్. 82 ఏళ్ల ములాయం ప్రస్తుతం గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

వయో భారానికి తోడు అనారోగ్య కారణాలతో ఇటీవల ఆయన ఆస్పత్రిలో చేరారు. తొలుత ప్రయివేటు వార్డులో చేరినా.. ఆదివారం ఆయన ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో ఐసీయూకు మార్చారు. ప్రధాని మోదీ సోమవారం మధ్యాహ్నం ములాయం కుమారుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కు ఫోన్ చేసి ములాయం ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కాగా, తండ్రి ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో అఖిలేశ్ తాజాగా మేదాంత ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం ములాయంకు నిపుణులైన వైద్యుల టీమ్ చికిత్స అందిస్తోంది.

ఎందుకు ములాయం గొప్ప..?

ఉత్తరాది అంటేనే అగ్రవర్ణాల ఆధిపత్యం. అందులోనూ యూపీ అంటే మరీను. అలాంటిచోట ములాయం సింగ్ రాజకీయంగా ఎదిగారు. తొలుత జనతాదళ్ లో చేరినా.. ఆపై సొంతంగా సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ని స్థాపించి అధికారంలోకి వచ్చి సీఎం అయ్యారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీకి మూడు వేర్వేరు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ములాయంది. అంతేకాదు ములాయం కుమారుడు అఖిలేశ్ 2011లో యూపీ సీఎం అయ్యారు. ఐదేళ్ల పాటు కొనసాగారు.

10 సార్లు ఎమ్మెల్యే.. 7 సార్లు ఎంపీ.. మూడుసార్లు సీఎం..

1967లో తొలిసారి మొదలు ములాయం మొత్తం 10 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జశ్వంత్ నగర్ నుంచి ఏడుసార్లు, గన్నౌర్ నుంచి రెండుసార్లు, సహస్వాన్ నుంచి ఓసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989, 1992, 2003లో మూడుసార్లు యూపీ సీఎంగా పనిచేశారు. ప్రస్తుతం ఏడోసారి ఎంపీగా కొనసాగుతున్నారు. 1996 నుంచి ఎంపీగా పోటీచేస్తున్నారు. 2003లో ఎంపీగా ఉండగానే యూపీ సీఎం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో మొయిన్ పురి నుంచి ఎంపీగా గెలుపొందినా.. రాజీనామా చేసి యూపీ సీఎంగానే కొనసాగారు.

ములాయం మొత్తం ఐదుసార్లు మొయిన్ పురి ఎంపీగా గెలిచారు. సంభాల్ నుంచి రెండుసార్లు, కనౌజ్, అజాంగఢ్ నుంచి ఓసారి నెగ్గారు. కనౌజ్ కు 2000లో రాజీనామా చేయడం ద్వారా తన కుమారుడు అఖిలేశ్ రాజకీయ ప్రవేశానికి బాటలు వేశారు. 1999, 2014లో ములాయం రెండుసార్లు రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలుపొందడం విశేషం. 1982 లో ములాయం ఎమ్మెల్సీగానూ వ్యవహరించారు. 1996-98 కాలంలో ములాయం కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు.

ఎమర్జెన్సీలో 19 నెలల జైలు

ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీలో చాలామంది సోషలిస్టు నాయకుల్లాగే ములాయం నెలల తరబడి జైలులో ఉన్నారు. ఆయన మొత్తం 19 నెలలు కారాగారంలో గడిపారు. ఈ పరిణామమే ములాయం రాజకీయ జీవితాన్ని మరింత ఎత్తులకు తీసుకెళ్లింది. కాగా, ములాయం రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటి భార్య మాలతీదేవి కాగా.. ఆమె 2003లో అనారోగ్యంతో చనిపోయారు. అనంతరం సాధన గుప్తాను వివాహమాడారు. సాధన ఈ ఏడాది చనిపోయారు. కాగా, ఐదుగురు అన్నదమ్ముల్లో ములాయం మధ్యవారు. అన్నలిద్దరూ వెలుగులోకి రాకున్నా.. ఇద్దరు తమ్ముళ్లు రాజ్ పాల్, శివపాల్ రాజకీయాల్లో కొనసాగుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.