Begin typing your search above and press return to search.

సీమలోనూ ఇలాంటి రాజకీయ హత్య కనిపించదు.. తమ్మినేని హత్యలో షాకింగ్ నిజాలు

By:  Tupaki Desk   |   17 Aug 2022 11:30 AM GMT
సీమలోనూ ఇలాంటి రాజకీయ హత్య కనిపించదు.. తమ్మినేని హత్యలో షాకింగ్ నిజాలు
X
ఫ్యాక్షన్ అన్న మాటను తరచూ వింటుంటాం. ఏపీలోని నాలుగు రాయలసీమ జిల్లాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఈ ఫ్యాక్షన్ లోనూ కొన్ని అప్రకటిత నియమాలు పాటిస్తుంటారు. అనవసరంగా హత్యలు ఉండవు. రాజకీయంగా ఎదుగుతుంటే ఓర్వలేక హత్యలు చేయటం తక్కువ. ఏదైనా హత్యలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉంటేనే హత్య చేసేందుకు వెనుకాడరు. కానీ.. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు..మూడు రోజుల క్రితం చోటు చేసుకున్న దారుణ రాజకీయ హత్య చూసినప్పుడు కరుడుగట్టిన ఫ్యాక్షన్ నేలలోనూ ఇలాంటివి జరగవన్న మాట వినిపిస్తోంది. అన్నింటికి మించి హత్యకు గురైన వ్యక్తిని అంత కిరాతకంగా.. పాశవికంగా చంపటం చూస్తే.. ఇదెక్కడి దారుణం? అనుకోకుండా ఉండలేం.

సీమలో ఉండే ఫ్యాక్షన్ కు ఒక నీతి ఉంటుందని చెబుతారు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేకున్నా.. ఒకమాట మాత్రం నిజమని చెప్పక తప్పదు. తాజాగా జరిగిన రాజకీయ హత్యతో పోల్చినప్పుడు ఫ్యాక్షన్ హత్యలోనూ ఇంతటి కసి మాత్రం కనిపించదు. హత్య లక్ష్యం ప్రాణం తీయటమే. కానీ.. తుమ్మల హత్యలో మాత్రం అంతకు మించిన పాశవికత కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది.

ఈ హత్యకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి మత్తేశం నోటి నుంచి తాజాగా వచ్చిన సంచలన అంశాలు చూస్తే.. ఈ తరహా వైఖరికి కేసీఆర్ సర్కారు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పాలి. లేనిపక్షంలో తెలంగాణకు ఇదో కొత్త వ్యాధిగా మారుతుందన్నది మర్చిపోకూడదు. అధికార పార్టీకి చెందిన తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి ముత్తేశం ఏం చెప్పారంటే..

- మద్దులపల్లి దోబి ఘాట్‌కు చేరుకోగానే ఎదురుగా వేగంగా వచ్చిన ఓ ఆటో తుమ్మల ప్రయాణిస్తున్న మా బైక్ ను ఢీ కొట్టింది. బైక్ మీద ఉన్న మేమిద్దరం పక్కనే ఉన్న గుంతలో పడిపోయాం. ఆటో నుంచి నలుగురు కిందకు దిగి వేట కోడవళ్లతో కృష్ణయ్యపై దాడి చేశారు.

- కృష్ణయ్యను దారుణంగా నరకటాన్ని ప్రత్యక్షంగా చూశా. కృష్ణ స్వామి, నూకల లింగయ్య,నాగేశ్వర్ రావు, మెంటల్ శ్రీను.. ఈ నలుగురు కత్తులతో దాడి చేశారు. ఆటోలో మొత్తం ఆరుగురు వచ్చారు. మిగిలిన ఇద్దరు ఆటోలోనే ఉన్నారు.

- హత్య చేసే వారంతా కోటేశ్వర్ రావుతో తిరిగే వారే. కృష్ణయ్యను ను ప్లాన్ ప్రకారం హత్య చేశారు. తమ్మినేని వీరభద్రం, తమ్మినేని కోటేశ్వర్ రావు తెల్దారపల్లిలో వేరే పార్టీ పెత్తనం ఉండనివ్వరు. ఎవరైనా ఎదురు తిరిగితే చంపేస్తామని బెదిరిస్తారు.

- తమ్మినేని వీరభద్రం, తమ్మినేని కోటేశ్వర్ రావు తెల్దారపల్లిలో వేరే పార్టీ పెత్తనం ఉండనివ్వరు. ఎవరైనా ఎదురు తిరిగితే చంపేస్తామని బెదిరిస్తారు. వారిద్దరి ప్రమేయం లేనిదే కృష్ణయ్య హత్య జరగదు.

- తమ్మినేని హత్య జరిగిన తర్వాత రోడ్డు మీద పడి ఉన్న మృతదేహాన్ని చూస్తూ కోటేశ్వరరావు కారులో వెళ్లారు. ఆ కారులో అతడొక్కడే ఉండటాన్ని గమనించారు.నాపైనా దాడికి ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్న రాళ్లతో ఎదురుదాడి చేశాను.

- హత్యకు పాల్పడుతున్న వారితో తనను చంపొద్దని కృష్ణయ్య రెండు చేతులు జోడించి వేడుకున్నారు. 'నేనేం తప్పు చేశానని చంపుతారు' అని ఆయన అడిగారు. ఏ మాత్రం కనికరం లేకుండా చేతులు నరికేశారు. మెడపై బలంగా దాడి చేశారు. నరాలు తెగి నేను చూస్తుండగానే క్రిష్ణయ్య ప్రాణాలు కోల్పోయారు. 5 నిమిషాల వ్యవధిలోనే నా కళ్ల ముందే దాడి చేసి హత్య చేసి పరారయ్యారు.