Begin typing your search above and press return to search.

మైసూరా కొత్త పార్టీ?

By:  Tupaki Desk   |   9 July 2016 7:43 AM GMT
మైసూరా కొత్త పార్టీ?
X
వైసీపీని వీడిన సీనియర్ నేత మైసూరా రెడ్డి కొత్త పార్టీ పెడతారని తెలుస్తోంది. వైసీపీని వీడిన తరువాత ఆయన టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగినా ఇంతవరకు ఆ దిశగా అడుగులు పడలేదు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఆయన సిమెంటు కంపెనీకి భూముల కేటాయింపులు వంటివి జరిగిన నేపథ్యంలో మైసూరా చేరిక తప్పదన్న భావన వ్యక్తమైనా తాజా పరిస్థితులు మాత్రం వేరేగా కనిపిస్తున్నాయి. ఆయన టీడీపీలో చేరడం కంటే కొత్త పార్టీ పెట్టడంపైనే దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఆయన ఇప్పటికే రాయలసీమలోని పలువురు నేతలు - వివిధ రంగాలకు చెందినవారితో రహస్యంగా భేటీ అవుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన త్వరలో కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.

ముఖ్యంగా రాయలసీమ జిల్లాల వెనుకబాటుతనంపై ఆయన పోరాటం జరపాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే దీనికి కార్యాచరణ రూపొందిస్తారని వినిపిస్తోంది. రాయలసీమ వెనుకబాటుతనంపై ఆయన చాలా సీరియస్ గా ఉన్నారని.. దానిపైనే పోరాటం జరపాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అందుకు గాను గత 50 ఏళ్లలో పాలకులు చేసిన అన్యాయాన్ని ఎండగడుతూ.. రాయలసీమలోని కరువు - పేదరికం సమస్యలను ఎత్తిచూపుతూ యాత్ర చేపట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనివల్ల వైసీపీకి పట్టున్న రాయలసీమ జిల్లాల్లో తన పట్టు పెంచుకోవడం సాధ్యమవుతుందన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు.

అయితే... వ్యక్తిగతంగా పేరు ప్రతిష్ఠలున్నా కూడా ప్రస్తుత తరుణంలో ప్రధాన పార్టీలను కాదని సొంతంగా ఉద్యమం నిర్మించడం ఏపీలోసాధ్యం కాదన్న వాదనా వినిపిస్తోంది. ఇప్పటికే రాయలసీమలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి రాయలసీమ పరిరక్షణ పేరుతో ఉద్యమం చేస్తున్నా మీడియా దానికి ప్రయారిటీ ఇవ్వకుండా తొక్కిపెడుతోందని.. దాంతో ప్రజల్లోనూ ఆ ప్రభావం కనిపించడం లేదని... ఇప్పుడు మైసూరా యాత్ర చేపట్టినా దాదాపుగా అదే పరిస్థితులు ఉంటాయని అంటున్నారు. రాష్ట్రంలోని ప్రధాన పత్రికలు అధికార - విపక్షాలకు అనుకూలంగా ఉంటున్న సమయంలో మైసూరా యాత్రకు మద్దతు దొరకదని అంటున్నారు. మైసూరా రెడ్డి మరో బైరెడ్డి రాజశేఖరరెడ్డి అవుతారని అంటున్నారు.