Begin typing your search above and press return to search.

సామాజిక న్యాయాన్ని ఎవరు కాదంటారు? - చంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   12 July 2022 3:59 PM GMT
సామాజిక న్యాయాన్ని ఎవరు కాదంటారు? - చంద్ర‌బాబు
X
రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముతో టీడీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో టీడీపీ, బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, యనమల, అచ్చెన్నాయుడు, సీఎం రమేశ్‌, జీవీఎల్, సోమువీర్రాజు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్మును టీడీపీ అధినేత చంద్రబాబు సన్మానించారు. అలాగే ముర్ముకు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చంద్రబాబు పరిచయం చేశారు.

కాగా, రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముని టీడీపీ ఆత్మీయ సమావేశానికి పిలవడంపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. నాలుగు సంవత్సరాల అనంతరం టీడీపీ, బీజేపీ నేతలు మాటామంతి కలిపారు. ద్రౌపది ముర్ము‌ను ఎన్‌డీఏ అభ్యర్ధిగా నియమించడంపై టీడీపీ, బీజేపీ నేతలు చర్చించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ మిజోరం రెండు రాష్ట్రాలు మాత్రమే పూర్తిగా ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపాయి.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ.. ``రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికలో భాగస్వామ్యం కావడం అందరి అదృష్టం. పేద కుటుంబంలో జన్మించిన ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము. మారుమూల గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగింది. సామాజిక న్యాయం కోసం ముర్మును బలపరిచాలని తెదేపా నిర్ణయించింది. రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్మును ఎంపిక చేసిన మోదీని అభినందిస్తున్నాను. గతంలో అబ్దుల్‌ కలాం, రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎన్నిక వేళ సైతం టీడీపీ మద్దతు తెలిపింది.`` అని వివ‌రించారు.

రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము నిలవడం సంతోషంగా ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఓ ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడం సంతోషకరమైన విషమన్నారు. సామాజిక న్యాయం కోసం ఏర్పాటు చేసిన పార్టీ తెదేపా అని.. ఎంతో మందికి ఉన్నత పదవులు కూడా ఇప్పించిందన్నారు. ఎమ్మెల్యే, మంత్రిగా, గవర్నర్‌గా ముర్ముకు అశేష అనుభవం ఉంది.. అలాంటి వ్యక్తికి మద్దతు తెలపడం అందరి అదృష్టమని అచ్చెన్నాయుడు తెలిపారు.

ద్రౌపది ముర్ము వివిధ హోదాల్లో పని చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. స్వాతంత్య్రం తర్వాత ఎక్కువ కాలం మహిళా గవర్నర్‌గా చేసిన వ్యక్తి ముర్ము అని కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో తొలిసారిగా గిరిజన మహిళ రాష్ట్రపతి అభ్యర్థిగా నిలుస్తోందని.. దేశవ్యాప్తంగా 42 పార్టీలు ముర్ముకు మద్దతు తెలుపుతున్నాయన్నారు.

``ప్రజాస్వామ్యంలో భారత్‌ ఎంతో పరిణతి చెందింది. భారత్‌ అభివృద్ధిలో వాజ్‌పేయీ ప్రముఖ పాత్ర పోషించారు. వాజ్‌పేయీ వచ్చిన తర్వాతే ఎస్టీకి మంత్రివర్గంలో స్థానం లభించింది. సమాజానికి దూరంగా ఉన్న వ్యక్తుల గురించి ఆలోచించిన వ్యక్తి వాజ్‌పేయీ. అనంతరం ఇనాళ్లకు మళ్లీ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్మును నిలపడం రాజకీయ అవసరం కాదు. కేవలం సామాజిక బాధ్యతే.`` అని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు.