Begin typing your search above and press return to search.

మొన్న అయోధ్య‌.. నిన్న క‌శ్మీర్‌.. ఇప్పుడు హిందీ.. మోడీనా మ‌జాకా!!

By:  Tupaki Desk   |   13 Oct 2022 5:26 AM GMT
మొన్న అయోధ్య‌.. నిన్న క‌శ్మీర్‌.. ఇప్పుడు హిందీ.. మోడీనా మ‌జాకా!!
X
మొన్న‌టికి మొన్న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకు స్థాప‌న చేశారు. అబ్బ‌.. ఆర్ ఎస్ ఎస్ అనుకున్న‌ది సాధించేసిందిగా.. అని బుగ్గ‌లు నొక్కుకున్నారు. త‌ర్వాత‌.. క‌శ్మీర్ ప్ర‌త్యేక హ‌క్కుల‌కు సంబంధించిన ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేశారు.. ఇంకేముంది.. ప్ర‌జాస్వామ్య వాదులు ల‌బోదిబోమ‌న్నారు. మ‌రి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హ‌వా అక్క‌డితో ఆగిందా.. లేదు.. లేదు.. ఇప్పుడు హిందీ వ‌రకు వ‌చ్చేసింది. ఔన‌న్నా.. కాద‌న్నా.. మోడీ ఎఫెక్ట్ తో ఈ దేశం.. ''హిందీ.. సీఖో.. లిఖో.. బాతో!'' సూత్రాన్ని తూ.చ‌. త‌ప్ప‌క పాటించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే.. ఇది కూడా ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాల్లోని త్రిభాషా సూత్రం కావ‌డమే ఇప్పుడు ప్ర‌ధాన వివాదానికి తెర‌దీసింది.

ప్ర‌స్తుతం దేశంలోఅనేక ప్రాంతీయ భాష‌లు ఉన్నాయి. దాదాపు అధికార భాష‌గా.. ఆంగ్లం అమ‌లు జ‌రుగుతూనే ఉంది. అయితే.. రాజ‌భాష‌గా ఉన్న హిందీనే దేశం మొత్తం అమ‌లు కావాల‌నేది ఆర్ ఎస్ ఎస్ కీల‌క సిద్ధాంతం. ఇదే.. ఇప్పుడు మోడీ అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా.. సెంట్రల్‌ యూనివర్సిటీలతోపాటు ఐఐటీ, ఐఐఎం వంటి టెక్నికల్‌ లేదా నాన్‌టెక్నికల్‌ విద్యాసంస్థల్లో హిందీ భాషను తప్పనిసరి చేయాలంటూ అమిత్‌ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సులు తీవ్ర వివాదానికి కార‌ణంగా మారాయి.

ఈ విషయంపై దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. పలు రాజకీయ పార్టీల నేతలు ఈ సిఫార్సులను వ్యతిరేకిస్తున్నారు. దేశంలో చాలా అధికారిక భాషలుండగా హిందీనే ప్రధాన భాషగా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కేరళ సీఎం పినరయి విజయన్‌ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. మరోవైపు, కేంద్రం ప్రయత్నాలను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు.

విద్యా సంస్థలు, ప్రభుత్వ నియామకాల్లో హిందీని తప్పనిసరి చేసే విషయంలో నిరుద్యోగులు, విద్యార్థులకు ఎన్నో భయాలు నెలకొన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం అనే భావనకు ప్రతీకగా నిలిచే భారత్‌లో ఏ ఒక్క భాషనూ ఇతర భాషల కంటే ఎక్కువ చేసినా అది దేశ సమగ్రతను దెబ్బతీస్తుంది. దేశంలో చాలా భాషలు అధికారికంగా ఉన్నప్పుడు హిందీని ప్రధాన భాషగా పేర్కొనొద్దనేది .. ప్రాంతీయ పార్టీల వాద‌న‌. కాదు.. దేశం మొత్తం.. హిందీ మాట్లాడాలి.. నేర్చుకోవాలి.. రాయాలి.. అనేది మోడీ సిద్ధాంతం.. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.