Begin typing your search above and press return to search.

ట్రంప్‌..మోడీ భేటీ..షెడ్యూల్ ఖ‌రారు

By:  Tupaki Desk   |   15 May 2017 5:54 PM GMT
ట్రంప్‌..మోడీ భేటీ..షెడ్యూల్ ఖ‌రారు
X
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. జూన్ చివరి వారంలో వాషింగ్టన్‌లో వీరు సమావేశం కావచ్చునని భావిస్తున్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ప్రధాని తొలిసారిగా ఆయనను కలువనున్నారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ప్రధాన ఎజెండాగా ఈ చర్చలు సాగనున్నాయి. భారత్‌ను కలవరపాటుకు గురిచేస్తున్న హెచ్1బీ వీసాల కోతపైనా చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.

అణు సరఫరా దేశాల కూటమిలో భారత్ చేరిక, ఇరుదేశాల మధ్య రక్షణ ఒప్పందాలు, తూర్పు, దక్షిణాసియాలో చైనా దూకుడు వ్యవహారం తదితర అంశాలు సైతం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీలో చర్చకు రానున్నట్లు స‌మాచారం. అయితే విదేశాంగశాఖ ఉన్నతాధికారులు ఎవరూ ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు. అమెరికా అధికారులు మాత్రం భేటీ జరిగే అవకాశముందని సూచనప్రాయంగా తెలిపారు. జూన్ 26 నుంచి 28 వరకు ప్రధాని మోదీ వాషింగ్టన్‌లో పర్యటించనున్నారని సమాచారం. ఒకవేళ అప్పుడు చర్చలు కుదురకపోతే జూలై 7,8 తేదీల్లో జర్మనీలోని హనోవర్‌లో జరిగే జీ-20 సమావేశాల సందర్భంగా వారిద్దరూ భేటీ కావచ్చునని తెలుస్తోంది. ఉగ్రవాద దాడులు, వాటిలో పాకిస్థాన్ పాత్రపై ట్రంప్, మోడీ చర్చల సందర్భంగా ఇరుదేశాల దర్యాప్తు సంస్థలు సమాచారం ఇచ్చిపుచ్చుకునే ఒప్పందాన్ని ఖరారు చేసుకోనున్నాయి.

ఇదిలాఉండ‌గా...భారత్, పాకిస్థాన్ ప్రధానులు నరేంద్ర మోడీ, నవాజ్ షరీఫ్ త్వరలో భేటీ కానున్నారని సమాచారం. కజకిస్థాన్‌లో వచ్చే నెల జరుగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమావేశాల సందర్భంగా వీరిద్దరూ భేటీ కావచ్చునని పాక్ ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్ తెలిపారు. భారత్ నుంచి సానుకూల సంకేతాలు వస్తేనే చర్చలకు అవకాశం ఉంటుందని పాకిస్థాన్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.