Begin typing your search above and press return to search.

డేరింగ్ డెసిషన్స్ పై మోదీ అదిరేటి స్టేట్ మెంట్ ఇదే!

By:  Tupaki Desk   |   14 Oct 2019 3:47 PM GMT
డేరింగ్ డెసిషన్స్ పై మోదీ అదిరేటి స్టేట్ మెంట్ ఇదే!
X
ప్రధాని నరేంద్ర మోదీ జనం నాడి పట్టిన నేతగానే చెప్పుకోవాలి. జనం ఏం కోరుకుంటున్నారు? జనంలో మంచి మైలేజీ రావాలంటే ఏం చేయాలి? అసలు ఏ నిర్ణయాలు తీసుకుంటే... జనం హర్షిస్తారు? జనం హర్షించని నిర్ణయాలు తీసుకున్నా నెట్టుకొచ్చేదెలా?... ఇలా ఏ విషయాన్ని తీసుకున్నా... మోదీ ఫుల్ క్లారిటీతోనే ముందడుగు వేస్తారనే చెప్పాలి. అందుకు నిదర్శనంగానే పార్లమెంటులో ప్రధాన విపక్షంతో పాటు పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకించినా కూడా ఆర్టిక్ 370ని మోదీ ఇట్టే రద్దు చేసి పారేశారు. అంతేనా... జనాన్ని నెలల తరబడి ఇబ్బందుల పాలు చేసిన డిమానిటైజేషన్ వంటి నిర్ణయాల విషయంలోనూ మోదీ వెనకడుగు వేసిందే లేదు. జనాన్ని ఇబ్బంది పెట్టిన ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా... తనపై జనంలో నెగెటివిటీ రాకుండా చూసుకోవడంలో మోదీ దిట్టగానే చెప్పాలి.

సరే... ఇదంతా తెలిసిందే కదా. మరి ఇన్ని డేరింగ్ డెసిషన్స్ తీసుకున్న మోదీ... అందుకు తనకు బలమిచ్చిన అంశాలేమిటన్న విషయంపై ఇప్పటిదాకా పెద్దగా ప్రఃస్తావించలేదనే చెప్పాలి. ఆ సమయం కూడా రానే వచ్చింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మహారాష్ట్ర, హర్యానా పర్యటనల్లో భాగంగా మోదీ ఓ రేంజిలో ప్రసంగాలు దంచేస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం ఆయన హర్యానా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫరీదాబాద్ జిల్లా వల్లఢ్ గడ్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఈ ప్రసంగం వింటే... ఎవరైనా ఇట్టే మోదీ పట్ల ఆకర్షితులు కాక తప్పదన్న వాదన వినిపిస్తోంది.

ఈ సందర్భంగా మోదీ ఏమన్నారంటే... దేశం ప్రస్తుతం ఊహకందని నిర్ణయాలను తీసుకుంటోందని, భారత ఓటర్లు ఇచ్చిన శక్తితోనే ఆర్టికల్‌ 370 రద్దు వంటి సాహసోపేత నిర్ణయాలను కేంద్రం తీసుకుందని మోదీ అన్నారు. ఆర్టికల్‌ 35ఏ వల్లే జమ్మూకశ్మీర్‌లోని విద్యావంతులైన వాల్మీకి యువతకు ఉద్యోగాలు రాలేదని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలాకోట్‌ వైమానిక దాడులు, వన్‌ పెన్షన్‌- వన్‌ ర్యాంక్‌, త్రిపుల్‌ తలాక్‌ బిల్లులను కాంగ్రెస్‌ వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేసిన మోదీ... దేశ ఓటర్లు ఇచ్చిన బలం, బలగంతోనే తాను వీటిపై ముందుకు సాగగలిగానని చెప్పుకొచ్చారు. జనం ఇచ్చిన బలంతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నానని చెప్పడమంటే... అంతకు మించిన అదిరేటి డైలాగ్ ఏముంటుంది? నిజమే... జనం మోదీకి క్లిస్టర్ క్లియర్ మెజారిటీతో పట్టం కడితే... దేశ రుగ్మతలుగా ఉన్న చాలా అంశాలపై జనానికి కాస్తంత కష్టమైనా గానీ.. మోదీ ముందుకే సాగుతున్నారు. ఈ మాటలను బట్టి చూస్తే... భవిష్యత్తుల్లోనూ మోదీ మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది.