Begin typing your search above and press return to search.

బేసిక్‌ తో మోదీ వండ‌ర్ చేయ‌నున్నారా?

By:  Tupaki Desk   |   7 Jan 2017 4:07 AM GMT
బేసిక్‌ తో మోదీ వండ‌ర్ చేయ‌నున్నారా?
X
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ... గ‌డ‌చిన రెండున్న‌రేళ్లుగా వేసిన ప్ర‌తి అడుగు కూడా ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా మోదీ చేసిన ప్ర‌చారం... అంత‌కుముందెన్న‌డూ జ‌రిగిన దాఖ‌లా లేదు. అందుబాటులోకి వ‌చ్చిన సోష‌ల్ మీడియాతో దుమ్ము రేపిన మోదీ... వైరి వ‌ర్గాలను పెద్ద దెబ్బే కొట్టారు. దాదాపు మూడు ద‌శాబ్దాలుగా దేశంలో క‌నిపించకుండా పోయిన సంపూర్ణ మెజారిటీ సాధించిన‌ పార్టీగా బీజేపీని అంద‌ల‌మెక్కించారు. ఆ త‌ర్వాత ప్ర‌ధాని బాధ్య‌త‌లు చేప‌ట్టిన మోదీ... ప్ర‌క‌టించిన ప్ర‌తి ప‌థ‌కం కూడా జ‌నాన్ని విశేషంగా ఆక‌ట్టుకుంద‌నే చెప్పాలి. స్వ‌చ్ఛ భార‌త్‌ - ఆద‌ర్శ గ్రామ యోజ‌న‌ - స్మార్ట్ సిటీ... త‌దిత‌ర కొత్త ప‌థ‌కాల‌న్నీ కూడా మోదీ ఇమేజీని పెంచాయ‌నే చెప్పాలి. ఇక రెండు నెల‌ల క్రితం తీసుకున్న పెద్ద నోట్ల ర‌ద్దు - ఆ త‌ర్వాత రూ.2 వేల నోటు పేరిట మ‌రింత పెద్ద నోటు ఎంట్రీ... మోదీని తొలుత ఆకాశానికెత్తేసిన జ‌నం... ఆ త‌ర్వాత విమ‌ర్శ‌లు చేయ‌డం మొద‌లెట్టారు. ఈ విమ‌ర్శ‌ల‌న్నీ పెద్ద నోట్ల ర‌ద్దుపై కాకుండా.... ఆ కార‌ణంగా త‌లెత్తిన క‌రెన్సీ క‌ష్టాల‌పైనేన‌ని మ‌రువ‌రాదు.

పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత త్వ‌ర‌లో ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్న కేంద్ర బ‌డ్జెట్‌ లో మోదీ... మ‌రో స‌రికొత్త ప‌థ‌కానికి శ్రీకారం చుట్ట‌నున్నార‌న్న వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. పెద్ద నోట్ల ర‌ద్దుతో వెలుగులోకి వ‌చ్చిన న‌ల్ల‌ధ‌నాన్ని జ‌న్‌ ధ‌న్ ఖాతాల్లో జ‌మ చేస్తార‌ని తొలుత భావించినా... దానిపై ప్ర‌భుత్వం ఇప్ప‌టిదాకా నోరు విప్ప‌లేదు. ఈ క్ర‌మంలో వ‌చ్చే బ‌డ్జెట్లో దీనిపై ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న రావ‌చ్చ‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగిన యూనివ‌ర్స‌ల్ బేసిక్ ఇన్‌ క‌మ్ (యూబీఐ) తెర‌పైకి వ‌చ్చింది. ఈ నెల 3న బ‌జినెస్ ఇన్‌ సైడ‌ర్ అనే ఓ వెబ్ సైట్ రాసిన క‌థ‌నం ఈ అంశాన్ని తెర‌పైకి తెచ్చింద‌ని చెప్పాలి. ఈ క‌థ‌నం... ప్ర‌కారం దేశంలో యూబీఐ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టే దిశ‌గా మోదీ స‌ర్కారు ఆలోచిస్తోంది. ఈ నెలాఖ‌రులో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న బ‌డ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్నార‌ని, ఈ దిశ‌గా జ‌రుగుతున్న క‌స‌ర‌త్తు దాదాపుగా పూర్తి కావ‌చ్చింద‌న్న వార్త‌లు ఆస‌క్తి రేపుతున్నాయి.

అస‌లు యూబీఐ అంటే ఏమిటంటే... దేశంలో ధ‌నిక‌ - పేద అన్న తేడా లేకుండా.. ప్ర‌తి ఒక్క‌రి ఖాతాలో ఓ నిర్ణీత న‌గ‌దును జ‌మ చేస్తారు. ఈ న‌గ‌దును పౌరులు త‌మ నిత్యావ‌స‌రాల‌కే కాకుండా ఇత‌ర‌త్రా దేనికైనా వాడుకునే అవ‌కాశం ఉంది. అంతేకాకుండా... ఉద్యోగం ద్వారానో - లేదా స్వ‌యం ఉపాధి ద్వారానో మ‌నం సంపాదిస్తున్న ఆదాయంపై ప్ర‌భుత్వం ప‌న్ను వేస్తోంది. యూబీఐ ద్వారా మ‌న ఖాతాల్లో జ‌మ అయ్యే మొత్తంపై ఇలాంటి ట్యాక్సే మీ ఉండ‌ద‌ట‌. అంటే... యూబీఐ అమ‌ల్లోకి వ‌స్తే... ఇక ఏ ప‌ని చేయ‌కున్నా దేశ పౌరులంద‌రికీ ఎంతో కొంత మొత్తం చేతికందుతుంద‌న్న‌మాట‌. వేత‌న జీవుల‌కు దీనిపై ఆస‌క్తి ఉండ‌కున్నా.. పేద‌ - దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి - ఏ ఆస‌రా లేని వారు మాత్రం ఈ ప‌థ‌కానికి బాగానే ఆకర్షితుల‌య్యే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఊరికే డ‌బ్బు వ‌చ్చి ప‌డుతుందంటే... ఎవ‌రికి మాత్రం ఆశ ఉండ‌దు చెప్పండి. దీనిపై ప్ర‌భుత్వం నుంచి ఇప్ప‌టిదాకా ఎలాంటి ప్ర‌క‌ట‌న రాకున్నా... కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన కొంద‌రు అధికారులు మాత్రం పేర్లు వెల్ల‌డించ‌కుండానే... ప్రభుత్వం ఈ దిశ‌గా ముమ్మ‌ర క‌స‌ర‌త్తు చేస్తోంద‌ని చెబుతుండ‌టం గ‌మ‌నార్హం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/