Begin typing your search above and press return to search.

వైసీపీ ఎంపీలు ఎక్కడ సామీ?

By:  Tupaki Desk   |   22 Jan 2022 4:30 PM GMT
వైసీపీ ఎంపీలు ఎక్కడ సామీ?
X
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. మ‌రి వీరు ఎక్క‌డ ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఇప్ప‌టికే వారు ఎన్నిక‌ల్లో గెలిచి.. రెండున్న‌రేళ్లు అయిపోయింది. ఈ రెండున్న‌రేళ్ల కాలంలో ఏ ఒక్క ఎంపీ అయినా.. ఇది నేను చేశాను. ఇది నేనే చేశాను! అని చెప్పుకొనే ప్రాజెక్టు ఉందా? పోనీ.. కేంద్రం నుంచి నిదులు తెచ్చిన ఎంపీ ఏ ఒక్క‌రైనా ఉన్నారా? పాత విష‌యాలు ప‌క్క‌న పెడితే.. క‌రోనా అనంత‌రం.. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమైనా ప్రాజెక్టులు కానీ.. ఇత‌ర రూపాల్లో నిధులు కానీ.. తెచ్చిన ఎంపీ ఒక్క‌రైనా ఉన్నారా? అంటే.. లేర‌నే స‌మాధాన‌న‌మే వ‌స్తోంది.

అంతేకాదు.. అస‌లు చాలా మందికి త‌మ ఎంపీల పేర్లు కూడా తెలియని ప‌రిస్థితిలో ప్ర‌జ‌లు ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు విజ‌య‌న‌గ‌రం, అనంత‌పురం, హిందూపురం, మ‌చిలీప‌ట్నం, అన‌కాప‌ల్లి, పాడేరు వంటి చోట్ల ఎంపీ ఎవ‌రో కూడా ఇక్క‌డి ప్ర‌జ‌లకు తెలియ‌డం లేదు. దీనికి కార‌ణం..వారు ప్ర‌జ‌ల్లో ఉండ‌క‌పోవ‌డ‌మే. నిజానికి ఒక ఎంపీ ప్ర‌జ‌ల్లోకి రావ‌డాన‌నికి ప్ర‌ధానంగా స‌ద‌రు నియోజ‌క‌వ‌ర్గంలో ఏదైనా అభివృద్ధి కార్య‌క్ర‌మం చేప‌డితే.. వాటిని ప్రారంభించేందుకో.. లేక ఆయా ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో.. చూసేందుకు వ‌స్తారు.

కానీ..వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నా.. క‌నీసం.. ప్ర‌జ‌ల‌కు క‌నిపించే ప‌రిస్థితి లేదు. దీనికి కార‌ణం..వారికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల‌కు మ‌ద్య గ్యాప్ పెరిగిపోవ‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎక్క‌డా త‌ట్ట మ‌ట్టి ఎత్త‌డం లేదు. ఒక్క రిబ్బ‌న్ క‌టింగ్ కూడా చేయ‌డం లేదు. దీంతో ఎంపీలు ఎవ‌రి మానాన వారు ఉన్నారు. మ‌రికొంద‌రు ఎంపీలు.. ఢిల్లీ గ‌డ‌ప దాటి వ‌చ్చేందుకు ఇష్ట ప‌ప‌డ‌డం లేదు. ఇంకొంద‌రు జ‌గ‌న్ కోస‌మే తాము గెలిచామ‌నే ధీమాలో ఉన్నారు. మ‌రికొంద‌రు వివాదాల‌తోనే కాలం వెళ్ల‌బుచ్చుతున్నారు. దీంతో వారికి ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య ఉండాల్సిన బంధం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

వాస్త‌వానికి 25 ఎంపీ స్థానాలు ఉంటే.. ఏకంగా 22 స్థానాల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. కాబ‌ట్టి రాస్ట్రానికి కేంద్రం న‌నుంచి నిధులు వ‌స్తాయ‌ని.. వాటితో అభివృద్ధి జ‌రుగుతుంద‌ని ప్ర‌జ‌లు భావించారు. కానీ.. ఈ విష‌యంలో ఏ ఒక్క ఎంపీ కూడా ముందుకు వెళ్ల‌క‌పోవ‌డం.. ఎమ్మెల్యేల‌తో క‌య్యాల‌కు సిద్ధ‌ప‌డుతుండ‌డం.. వ్యాపారాలు..వ్య‌వ‌హారాల్లో మునిగి తేలుతుండ‌డంతో వారికి ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య గ్యాప్ పెరిగిపోయి.. అస‌లు ఎంపీ ఉన్నారా? అనే ప్ర‌శ్న మిగులుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ప‌రిస్థితి ఇలానే ఉంటే..వారు వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తారా? అనేది ప్ర‌శ్న‌.