Begin typing your search above and press return to search.

దిశ నిందితుల్లో కొత్త యాంగిల్ చెప్పిన సీపీ సజ్జనార్

By:  Tupaki Desk   |   7 Dec 2019 6:58 AM GMT
దిశ నిందితుల్లో కొత్త యాంగిల్ చెప్పిన సీపీ సజ్జనార్
X
ఈ శుక్రవారాన్ని ఇప్పట్లో మర్చిపోలేరేమో? ఊహించని రీతిలో నిద్ర లేచి.. అప్పుడప్పుడే వదులుతున్న మత్తును ఒక్కసారిగా దించేస్తూ దిశ నిందితుల ఎన్ కౌంటర్ సమాచారం కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఎన్ కౌంటర్ సమాచారం బయటకు వచ్చిన కాసేపటికే వైరల్ గా మారటమే కాదు.. ఊహించని రీతిలో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం కావటంపై పలువురు విస్మయానికి గురి అవుతున్నారు.

బాధితులకు అందాల్సిన న్యాయం అందకపోవటం.. ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్న వేళ.. అందుకు భిన్నమైన పరిస్థితి దిశ ఉదంతంలో చోటు చేసుకోవటమే ప్రజల ఆనందానికి కారణంగా చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. దిశ ఉదంతంలో నలుగురు నిందితులకు సంబంధించి షాకింగ్ నిజాన్ని వెల్లడించారు సీపీ సజ్జనార్. దిశ నిందితులు గతంలోనూ ఇలాంటి దారుణాలకే పాల్పడి ఉంటారని..దిశ ఉదంతం మొదటిదే అయి ఉండకపోవచ్చన్న అనుమానాన్అని వ్యక్తం చేశారు.

అంతేకాదు..దిశ తరహాలో గుర్తు తెలియకుండా కాలిపోయిన యువతులకు సంబంధించి కర్ణాటక.. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో చోటు చేసుకున్న ఉదంతాల్ని విశ్లేషిస్తున్నామని.. ఈ తీవ్రమైన నేరాలతో దిశ నిందితులకు లింకు ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే మిగిలిన రాష్ట్రాల నుంచి వచ్చిన సమాచారాన్ని విశ్లేషిస్తున్నామని.. ఆధారాలు లభించే అవకాశం ఉందని చెప్పారు.

సజ్జనార్ మాటల్ని చూస్తే.. దిశ నిందితులు మామూలోళ్లు కాదని.. గతంలోనూ ఎన్నో దారుణాలకు లింకు ఉంటుందన్న ఊహే ఉలిక్కిపడేలా చేస్తుందని చెప్పక తప్పదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సమాచారంతో పోల్చటం ద్వారా మరిన్ని కొత్త విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందంటున్నారు.