Begin typing your search above and press return to search.

మరికొద్ది గంటల్లోనే ఆఫ్ఘన్ లో కొత్త ప్రభుత్వం..షాకిచ్చిన మహిళలు

By:  Tupaki Desk   |   3 Sep 2021 4:35 AM GMT
మరికొద్ది గంటల్లోనే ఆఫ్ఘన్ లో కొత్త ప్రభుత్వం..షాకిచ్చిన మహిళలు
X
ఆఫ్ఘానిస్తాన్ పూర్తిగా తాలిబన్ల వశం అయ్యింది. దీనితో ఇప్పుడు ఆప్ఘనిస్థాన్‌ లో కొత్త ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందనే విషయం పై అందరి లోనూ ఆసక్తి మొదలైంది. అమెరికా దళాలు ఇప్పటికే ఆప్ఘనిస్థాన్‌ నుండి వెళ్లడంతో, ప్రభుత్వం ఏర్పాటుపై తాలిబన్లు ఫోకస్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు దిశగా తాలిబన్లు పలు నిర్ణయాలు తీసుకున్నారని వార్తలు వెలువడుతున్నాయి. శుక్రవారం మతపరమైన ప్రార్థనలు ముగిసిన తర్వాత దేశంలో నూతన ప్రభుత్వానికి సంబంధించిన వివరాలను వెల్లడించనుందని తాలిబన్ వర్గాలు తెలిపాయి. రాజధాని కాబూల్‌ లోని అధ్యక్ష భవనంలో ఈ కార్యక్రమం ఉంటుందని తాలిబన్ అధికార ప్రతినిధి అహ్మదుల్లా ముత్తఖీ తెలిపారు.

తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రోజువారీ పరిపాలనా వ్యవహారాలను తాలిబన్ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్ నాయకత్వంలోని ప్రత్యేక మండలి చూసుకునే అవకాశముందని తాలిబన్ ప్రతినిధులు తెలిపారు. అయితే పరిపాలన కోసం ఎటువంటి మండలి ఏర్పాటైనా దానికి అధినాయకుడిగా తాలిబన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుంజాదా ఉంటారని తెలిపారు. ఇక ఆప్ఘనిస్థాన్‌ లో ప్రజాస్వామ్యం ఉండబోదని వీరి నిర్ణయాలను బట్టి అర్థమవుతోంది. ఇక తాలిబన్ లీడర్ షిప్ కౌన్సిల్ ద్వారా అప్ఘానిస్తాన్ లో ఇకపై పరిపాలన సాగనుంది. దేశంలో ఒక్క పంజ్ షీర్ ఫ్రావిన్స్ తప్ప అన్ని రాష్ట్రాలను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఓ వైపు ఆప్ఘనిస్థాన్‌లో ప్రభుత్వ ఏర్పాటు కోసం తాలిబన్లు ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు అక్కడ తమ హక్కుల కోసం మహిళలు రోడ్డెక్కారు. రాబోయే ప్రభుత్వంలో మహిళలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ మహిళలు రోడ్డెక్కారు. హెరాత్ నగరంలోని సిల్క్ రోడ్డులో 50 మందికి పైగా మహిళలు ప్లకార్డులు చేతపట్టి రోడ్డు మీదకు వచ్చారు. తమకు ఎలాంటి భయం లేదని, ప్రభుత్వంలో మహిళలకు తప్పకుండా స్థానం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మహిళల సపోర్ట్ లేకుండా ప్రభుత్వాలు మనుగడ సాధించలేవని పేర్కొన్నారు. తాలిబ‌న్ల ప‌రిపాల‌న‌లో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ ఉండ‌దు. వారంతా ఇంటికే ప‌రిమితం కావాల్సి వ‌స్తుంది. అంతేకాదు, మ‌హిళ‌ల‌కు హ‌క్కులు ఏ మాత్రం ఉండ‌వు. ఎవ‌రైనా ఎదిరించి బ‌య‌ట‌కు వ‌స్తే వారికి ఎలాంటి శిక్ష‌లు విధిస్తారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అందుకే ముందుగానే మహిళలు తాలిబన్ల కి షాకిస్తూ మహిళలకి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

ఇక, అఫ్గనిస్తాన్‌ లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఆహార సంక్షోభం తీవ్రమవుతుందనే వార్తలు అఫ్గన్‌ వాసుల్ని మరింత కలవరపెడుతున్నాయి. ఇప్పటికే దేశంలో 30శాతానికిపైగా పౌరులు నిత్యం కనీసం ఒకపూట భోజనం చేస్తున్నారో లేదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో దేశంలో ప్రస్తుతమున్న ఆహార నిల్వలు కూడా ఈ నెలతోనే పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేస్తుంది.