Begin typing your search above and press return to search.

కొత్త రాష్ట్రపతి : బీజేపీ బిల్లులు కూడా తిప్పిపంపిన ధీరురాలు

By:  Tupaki Desk   |   25 July 2022 8:30 AM GMT
కొత్త రాష్ట్రపతి : బీజేపీ బిల్లులు కూడా తిప్పిపంపిన ధీరురాలు
X
ఈ రోజు సువిశాల భారత దేశానికి కొత్త రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నిక అయ్యారు. ఆమె ఈ దేశానికి 15వ రాష్ట్రపతి. ఆమె ఎన్నికలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆమె తొలి గిరిజన మహిళగా రాష్ట్రపతి భవన్ లో అడుగుపెడుతున్నారు. ఇక తాను నమ్మిన సిద్ధాంతాలను తుచ తప్పకుండా అమలు చేస్తూ అందులోనే తన జీవితాన్ని పండించుకున్న నిరుపేద మహిళగా ఆమెను చూడాలి.

ఒడిషాలోని నీటి పారుదల శాఖలో 1979లో ఒక చిన్న గుమాస్తాగా జీవితాన్ని ప్రారంభిచిన ద్రౌపది ముర్ము ఆ పనితీరులోనే తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఉత్తమ ఉద్యోగి అన్న మార్కులు ఆనాడే సాధించారు. ఇక రాజకీయ జీవితంలో కూడా ఆమె మీద ఏ మరక మచ్చా అసలు లేదు. తాను అనుకున్న పనులను చక్కగా నిజాయతీగా నెరవేర్చారు.

ఆమె రాజకీయ జీవితం మొత్తం పాతికేళ్ళుగా చెప్పాలి. 1997లో ఈ దేశానికి స్వాతంత్ర్యం లభించి యాభై ఏళ్లు అయింది. అపుడే ఒక వార్డ్ కౌన్సిలర్ గా తన రాజకీయ్ జీవితాన్ని ముర్ము ప్రారంభించారు. అలా అంచెలంచెలుగా ఆమె ఎదుగుతూ ఈ రోజున దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించారు. ఇపుడు దేశానికి అమృతోత్సవ్ శుభవేళ. స్వాతంత్ర్యం లభించి ఏడున్నర పదులు నిండిన వేళ ఒక గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఆమె అక్కడ ఉండడం అంటే గ్రేట్ గానే చూడాలి.

అదే విధంగా కేవలం పాతికేళ్ల కాలంలో ద్రౌపది ముర్ము సాధించిన అపూర్వ విజయంగా దీన్ని చూడాలి. ఇక ద్రౌపది ముర్ము జార్ఖండ్ రాష్ట్రానికి తొలి గవర్నర్ గా మహిళా గవర్నర్ గా ఆరున్నర ఏళ్ల పై చిలుకు పనిచేశారు. సాధారణంగా గవర్నర్ పదవీకాలం అయిదేళ్ళు మాత్రమే. ద్రౌపది ముర్ము ఆ రికార్డుని అధిగమించారు అంటే అది కూడా గ్రేటే మరి.

ఇక జార్ఖండ్ లో బీజేపీ ప్రభుత్వం కూడా చాన్నాళ్ళు ఉంది. ఆనాడు బీజేపీ సర్కార్ పంపే అన్ని బిల్లులను గవర్నర్ గా ద్రౌపది ముర్ము సంతకం చేసి పంపించలేదు. కొన్ని బిల్లులను వెనక్కి పంపించి తన రాజ్యాంగ విధులకు పూర్తి న్యాయం చేశారు. ఒకనాటి బీజేపీ నాయకురాలిని అని ఆమె భావించి ఉంటే ప్రతీ బిల్లూకూ ఆమోదం తెలిపేవారు అని చెబుతారు.

ఇదంతా ఎందుకు ఇపుడు చెప్పాలీ అంటే ద్రౌపది ముర్ము ఈ సువిశాల దేశానికి రాష్టపతిగా ఎలా పనిచేస్తారు అన్న ఆసక్తి ఉంది. క్లిష్ట సమస్యలను ఆమె చాలా నేర్పుగా ఓర్పుగా ఎదుర్కొన్న అనుభవాలే ఇపుడు ఆమెని మరింతగా ముందుకు నడిపిస్తాయని అంటున్నారు. ఆమె ఇపుడు రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నారు.

ఈ పదవిలో ఆమె నూటికి నూరు శాతం రాజ్యాంగబద్ధంగానే ఉంటారని అంటున్నారు. ముఖ్యంగా 2024లో ఏ పార్టీకి మెజారిటీ రాని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ఆమె కీలకమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. ద్రౌపది ముర్ము రాజ్యాంగం ఏమి చెప్పిందో దానికి అనుగుణంగానే నడుస్తారు అనే అంటున్నారు. మొత్తానికి ఆమె తానేంటో రాష్ట్రపతిగా నూరు శాతం రుజువు చేసుకుంటారని ఆమె గవర్నర్ గా చేసిన పనితీరు తెలియచేస్తోంది.