Begin typing your search above and press return to search.

ముందుంది మరింత ప్రమాదం: సెప్టెంబర్- డిసెంబర్ లో వైరస్ తీవ్ర స్థాయిలో దాడి

By:  Tupaki Desk   |   4 July 2020 1:45 PM IST
ముందుంది మరింత ప్రమాదం: సెప్టెంబర్- డిసెంబర్ లో వైరస్ తీవ్ర స్థాయిలో దాడి
X
ఇప్పటికే ప్రపంచాన్ని మహమ్మారి వైరస్ వణికిస్తోంది. కోటికి పైగా కేసులు నమోదయ్యాయి. లక్షలాది మంది ప్రజలు మృత్యువాత పడుతున్నారు. ఇప్పుడే తీవ్ర స్థాయిలో ఉండగా భవిష్యత్ తో మరింత ముప్పు పొంచి ఉందని పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్- డిసెంబర్ మధ్య మానవ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందని ఓ నివేదిక వెల్లడిస్తోంది. రెండో దశ (సెకండ్‌ వేవ్‌) ప్రమాదం పొంచి ఉందని, రెండో దశలో వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టదని ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ హెచ్చరించింది.

అమెరికా, దక్షిణాసియా, మధ్యప్రాచ్యం అంతటా వైరస్ వేగం పుంజుకుంటోందని, ప్రపంచం ప్రమాదకరమైన దశలో ఉందని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే వైరస్ రెండో దశ సెప్టెంబర్‌లో ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారని తెలిపింది. తాజాగా విడుదల చేసిన అధ్యయన నివేదికలో పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. వైరస్‌ ఉధృతి తీవ్రంగా ఉండి ఘోర పరిస్థితులు ఏర్పడుతాయని ఆ నివేదిక వెల్లడించింది. చాలామంది ఇంకా దీని బారిన పడే అవకాశం ఉందని లాన్సెట్‌ తెలిపింది. ప్రస్తుత వైరస్ ను1918లో ప్రపంచాన్ని వణికించిన స్పానిష్‌ ఫ్లూని లాన్సెట్‌ గుర్తు చేసింది. ఆ ఫ్లూ మాదిరే ప్రస్తుత వైరస్ ఉధృతి కొనసాగుతుందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి నుంచే మొదటి దశ తీవ్రత మొదలైందని.. రానున్న రెండో దశను సమర్థంగా ఎదుర్కోవడానికి లాన్సెట్‌ పలు సూచనలు చేసింది.

వైరస్ లక్షణాలు జ్వరం, దగ్గు కనిపించే వరకు బాధితులు నిరీక్షించకుండా కండరాల నొప్పి, అలసట, తలనొప్పి, విరేచనాలు, దద్దుర్లు వంటివి ఉన్నప్పుడే వైరస్ గా అనుమాన పడాలని లాన్సెట్‌ సూచించింది. వైరస్ లక్షణాల ప్రారంభ దశలోనే ఎవరికి వారు ఐసోలేషన్‌ అవడంతో ఇతరులకు సోకే ప్రమాదాన్ని తగ్గించవచ్చని తెలిపింది. వైరస్‌కు సంబంధించిన అన్ని ఇన్ఫెక్షన్లను 48 గంటల్లోపు గుర్తించగలిగితే రెండో దశ ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు.

వైరస్ వ్యాప్తి చెందకుండా సామూహిక పరీక్షలు నిర్వహించడం, ట్రేసింగ్‌ చేయడం, ఐసోలేషన్‌ తో నివారించవచ్చన్న లాన్సెట్‌ తెలిపింది. దీర్ఘకాలికంగా లాక్‌డౌన్లు విధించడం వైరస్‌ వ్యాప్తి నిరోధానికి పరిష్కారం కాదని స్పష్టం చేసింది. రెండు వారాలకు మించి లాక్‌డౌన్‌ ఉండకూడదని పేర్కొంది. ప్రజల మానసిక ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడకుండా చూడాలని సూచించింది.

దీంతోపాటు వైరస్ కట్టడిలో ప్రాథమిక రోగ నిర్ధారణ, కాంటాక్ట్‌ ట్రేసింగ్, ఐసోలేషన్‌ కీలకమైందని లాన్సెట్‌ నివేదిక తెలిపింది. సామాజిక దూరం, చేతులను తరచూ కడుక్కోవడం, మాస్క్‌లు ధరించడం, సామూహిక సమావేశాల నిషేధం వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు ప్రభుత్వాలు వైరస్‌ పునరుత్పత్తి సంఖ్యను తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించింది.