Begin typing your search above and press return to search.

జూనియర్ల బౌలింగ్.. పట్టు విడిచిన భారత్.. గెలిచేసిన న్యూజిలాండ్

By:  Tupaki Desk   |   25 Nov 2022 11:10 AM GMT
జూనియర్ల బౌలింగ్.. పట్టు విడిచిన భారత్.. గెలిచేసిన న్యూజిలాండ్
X
బ్యాటింగ్ లో బాగున్నా.. బౌలింగ్ లో పూర్తిగా జూనియర్లను నమ్ముకుని బరిలో దిగిన టీమిండియా.. న్యూజిలాండ్ తో శుక్రవారం జరిగిన మొదటి వన్డేలో ఓటమి పాలైంది. ఆక్లాండ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. దీంతో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శిఖర్ ధావన్ సారథ్యంలో భారత్ ఏడు వికెట్లకు 306 పరుగులు చేసింది. ఓపెనర్లు ధావన్‌ (72), శుభ్‌మన్ గిల్ (50) తొలి వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు.

వన్ డౌన్ లో వచ్చిన శ్రేయస్‌ అయ్యర్ (80) భారీ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, ఓపెనర్ల తర్వాత వికెట్ కీపర్ రిషభ్‌ పంత్ (15), స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ (4)ను ఒకే ఓవర్‌లో పేసర్ లాకీ ఫెర్గూసన్ పెవిలియన్‌కు చేర్చి భారత్‌ను దెబ్బతీశాడు. దీంతో జట్టు స్కోరు నెమ్మదించింది. ఈ సమయంలో అయ్యర్ కు జతగా వాషింగ్టన్‌ సుందర్ (37*), సంజూ శాంసన్ (36) రాణించారు. ఎదుర్కొన్న తొలి బంతినే సూర్య బౌండరీకి పంపి శుభారంభం చేసినా ఫెర్గూసన్ అతడికి అడ్డుకట్ట వేశాడు.

సుందర్ మెరుపులు..

శాంసన్ ఔటయ్యేటప్పటికి భారత్ స్కోరు చూస్తే 300 దాటడం కష్టమేననిపించింది. కానీ, యువ వాషింగ్టన్ సుందర్ అలవోకగా బ్యాటింగ్ చేసి 300 దాటించాడు. కేవలం 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 37 పరుగులు చేశాడు. అంతకుముందు సంజూ-శ్రేయస్ ఆదుకున్నాడు. ఐదో వికెట్‌కు 94 పరుగులు జోడించారు. అయితే, సుందర్ వచ్చాక ఇన్నింగ్స్ మారిపోయింది. చక్కటి టైమింగ్ తో అతడు కొట్టిన షాట్లు అలరించాయి. ముఖ్యంగా స్కూప్ షాట్ తో బౌండరీ సాధించిన తీరు సూపర్.

లాథమ్, విలియమ్సన్ కొట్టేశారు..

భారత్ విధించిన లక్ష్యం మోస్తరుదే అయినా.. దీనిని అందుకునే క్రమంలో కివీస్ ఇబ్బంది పడింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఓపెనర్లు ఫిన్‌ అలెన్ (22), డేవన్ కాన్వే (24).. 5 ఓవర్లలో 33 పరుగులే చేశారు. జట్టు స్కోరు 35 పరుగుల వద్ద అలెన్ (22)ను శార్దూల్ ఔట్ చేశాడు. అనంతరం ఉమ్రాన్‌ మాలిక్‌ కాన్వేను వెనక్కు పంపాడు. వీరద్దరూ కీపర్‌ రిషభ్‌ పంత్ చేతికి క్యాచ్‌ ఇచ్చారు. అప్పటికి కివీస్ 15.1వ ఓవర్లలో 68 పరుగులు చేసింది. కాగా, ఈ ఓవర్‌ రెండో బంతిని ఉమ్రాన్ 153.1 కి.మీ వేగంతో వేయడం విశేషం. అయితే, ఉమ్రాన్‌ జోరు కొనసాగిస్తూ డారిల్‌ మిచెల్‌ (11)నూ ఔట్ చేశాడు. అప్పటికి 19.5 ఓవర్లలో కివీస్‌ స్కోరు 88 పరుగులే. మూడో వికెట్‌ను కూడా కోల్పోయింది. అయితే ఇక్కడినుంచి కెప్టెన్ విలియమ్సన్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ లాథమ్ మనకు అవకాశం ఇవ్వలేదు.

లాథమ్‌-కేన్‌ కొట్టేశారు.

లాథమ్, విలియమ్సన్ జోరుతో కివీస్ 47.1 ఓవర్లలోనే గెలిచేసింది. లాథమ్ (145*: 104 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్స్‌లు), విలియమ్సన్ (94*: 98 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌) నాలుగో వికెట్‌కు 221 పరుగులు జోడించారు. మొదట నిలదొక్కుకున్న వీరిద్దరూ తర్వాత దూకుడు పెంచి స్కోరుబోర్డును నడిపించారు. ఈ క్రమంలో లాథమ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శార్దూల్ వేసిన ఇన్నింగ్స్‌ 40వ ఓవర్‌లో వరుసగా ఒక సిక్స్, 4 ఫోర్లతో 25 పరుగులు సాధించాడు. ఈ ఓవర్ తో న్యూజిలాండ్ విజయం ఖాయమైంది.

జూనియర్ల బౌలింగ్ దెబ్బేసింది

కివీస్ ను ఆదిలోనే దెబ్బతీసినా.. తర్వాత ఆ ఊపును భారత బౌలర్ల కొనసాగించలేకపోయారు. ప్రధాన పేసర్లు ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ ఇద్దరూ అరంగేట్ర బౌలర్ల్లే. ఇక శార్దూల్ ఠాకూర్ మీడియం పేసర్ మాత్రమే. ముఖ్యంగా అర్షదీప్ 8.1 ఓవర్లలోనే 68 పరుగులిచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. శార్దూల్ మొదట బాగానే కట్టడి చేసినా చివర్లో చేతులెత్తేశాడు. 9 ఓవర్లలో 63 పరుగులిచ్చాడు. ఉమ్రాన్ 10 ఓవర్లలో 66 పరుగులు సమర్పించుకున్నాడు. కాగా, జట్టు ఓటమికి మరో ప్రధాన కారణం స్పిన్నర్ చాహల్ వైఫల్యం. 10 ఓవర్లలో 67 పరుగులిచ్చిన చాహల్ ఏమాత్రం ప్రభావం చూపలేదు. అతడికంటే సుందర్ (10-0-42-0) మెరుగ్గా బౌలింగ్ చేయడం గమనార్హం. కాగా, మూడేళ్ల నుంచి జట్టులో ఉన్న హైదరాబాదీ సీమర్ మొహమ్మద్ సిరాజ్ ను కాకుండా కుర్ర పేసర్లు ఉమ్రాన్, అర్షదీప్ తో బరిలో దిగడం భారత్ చేసిన తప్పు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.