Begin typing your search above and press return to search.

ఎవరీ డాక్టర్ అర్చనా శర్మ.. ఆమె ఆత్మహత్య పెను వివాదం ఎందుకైంది?

By:  Tupaki Desk   |   31 March 2022 4:39 AM GMT
ఎవరీ డాక్టర్ అర్చనా శర్మ.. ఆమె ఆత్మహత్య పెను వివాదం ఎందుకైంది?
X
ఒక వైద్యురాలి ఆత్మహత్య రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి షాకింగ్ గా మారటమే కాదు.. దాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం నేరుగా లైన్లోకి వచ్చి.. పరిస్థితిని సమీక్షించటంతోపాటు.. సదరు వైద్యురాలి మరణానికి కారణమైన వారిని వదిలి పెట్టమని స్పష్టం చేస్తున్నా.. పరిస్థితి మాత్రం మారటం లేదని చెబుతున్నారు. ఇంతకీ ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ అర్చనా శర్మ ఎవరు? ఆమె ఎందుకు సూసైడ్ చేసుకున్నారు? ఆమె మరణం రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త తిప్పల్ని తెచ్చి పెట్టింది. అసలేం జరిగిందంటే..రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో డాక్టర్ అర్చనా శర్మ అనే గైనకాలజిస్టు ఉన్నారు. ఆమె తన భర్తతో కలిసి లాల్ సోట్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు.

తాజాగా ఒక గర్భిణికి సిజేరియన్ చేస్తున్న వేళలో రోగి ప్రాణం పోయింది. అయితే.. ఇదంతా డాక్టర్ అర్చనా శర్మ నిర్లక్ష్యంతోనే జరిగిందంటూ బాధితురాలి కుటుంబసభ్యులు ఆమెపై ఆరోపణలు చేశారు. డాక్టర్ అర్చనాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమెపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి.. విచారణ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. జరిగిన పరిణామాలకు తీవ్ర మనస్తాపానికి గురైన డాక్టర్ అర్చనా శర్మ ఆత్మహత్య చేసుకున్నారు. తాను ఆత్మహత్య చేసుకోవటానికి ముందు ఆమె తన సూసైడ్ లెటర్ లో తాను నిర్దోషినని చెప్పటానికి తన చావే సాక్ష్యమని.. అమాయక వైద్యుల్ని వేధించటం మానుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఈ లేఖ జిల్లాలోని వైద్యులను తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేసింది. డాక్టర్ అర్చనా శర్మ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులకు నిరసనగా వైద్య సేవల్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విధుల్లో ఉన్న వైద్యులపై సెక్షన్ 302 కిద కేసు నమోదు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన తర్వాత కూడా ఆ సెక్షన్ కింద కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

తాజా ఉదంతంలో డాక్టర్ అర్చనా శర్మతో పాటు.. ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర వేదనకు గురయ్యారని.. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవటంతో పాటు.. తక్షణమే అరెస్టు చేయాలని జిల్లా వైద్యుల సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ ఉదంతం స్థానిక ఉన్నతాధికారులు మొదలు ముఖ్యమంత్రి వరకు ఒత్తిడి మొదలైంది. వైద్యురాలి ఆత్మహత్యపై సీఎం అశోక్ గహ్లోత్ విచారం వ్యక్తం చేశారు.

ఈ ఉదంతంలో నిందితుల్ని వదిలిపెట్టమన్న ఆయన.. వైద్యురాలి ఆత్మహత్య విచారకరమని.. రోగుల ప్రాణాల్ని కాపాడటం కోసం వైద్యులు శాయశక్తులా ప్రయత్నిస్తారని చెప్పారు. కానీ.. ఇలాంటి దురద్రష్టకర ఉదంతాలు చోటు చేసుకున్నప్పుడు వైద్యుల్ని నిందించటం సరికాదంటూ సీఎం అశోక్ గహ్లోత్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ఉదంతం రాజస్థాన్ లో ఇప్పుడు పెను సంచలనంగా మారింది. వైద్యుల మీద వృత్తిపరమైన ఒత్తిడి ఏ స్థాయిలో ఉందన్న విషయాన్ని తెలియజేస్తుందని చెబుతున్నారు.