Begin typing your search above and press return to search.

అప్పుల్లేని ఆంధ్రా.... ఎలా సాధ్యం పవన్... ?

By:  Tupaki Desk   |   17 March 2022 10:28 AM GMT
అప్పుల్లేని ఆంధ్రా.... ఎలా సాధ్యం పవన్... ?
X
ఏపీ అప్పుల పాలు అయిందని ఆవిర్భావ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల్లో ఆంధ్రా అని ఆయన మంచి టైమింగ్ తో రైమింగ్ తో మాట్లాడారు. అంతే కాదు, ఏనాడో తరిమెల నాగిరెడ్డి రాసిన తాకట్టులో భారత దేశం పుస్తకం గురించి ప్రస్థావించారు. ఇపుడు ఏపీ అప్పులు అన్నవి మంచివి కావు అన్న సంగతి అందరికీ తెలిసినా ఎందుకు అప్పులు అయ్యాయన్న దాని మీద పవన్ పూర్తిగా దృష్టి పెట్టలేదని అంటున్నారు.

అదే టైమ్ లో ఏపీ విభజనతోనే 90 వేల కోట్ల అప్పుతో వచ్చిన సంగతిని కూడా గుర్తు చేస్తున్నారు. ఇక చంద్రబాబు అయిదేళ్ల జమానాలో మరో రెండున్నర లక్షల అప్పులు చేసారని, ఇక మూడేళ్ల ఏలుబడిలో జగన్ సర్కార్ కూడా మూడు లక్షల కోట్ల దాకా అప్పులు చేసిందని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే ఏపీ అప్పులు ఏడు లక్షల కోట్లకు చేరుకున్నాయి.

మరి ఈ అప్పులో వివరాల లోతుల్లోకి వెళ్లని పవన్ కళ్యాణ్ మొత్తం ఏడు కోట్ల రూపాయలు ఏపీ అప్పు అని ప్రస్తుత ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కూడా చర్చనీయాంశంగా ఉంది. ఇంకో వైపు చూస్తే విభజన హామీలను బీజేపీ ఎక్కడా నెరవేర్చలేదు, అలాగే ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఎనిమిదేళ్ళు గడచినా రెవిన్యూ లోటుని భర్తీ చేస్తూ నిధులను కూడా పెద్ద ఎత్తున కేటాయించలేదు.

మరి అవన్నీ కనుక చేసి ఉంటే చంద్రబాబు అయినా జగన్ అయినా ఈ మాదిరిగా అప్పులు చేసే పరిస్థితి ఉండదు కదా అని అంటున్నారు. అడ్డగోలుగా ఏపీని విభజించడం వల్లనే అప్పులు పెరిగాయన్న సంగతిని కూడా మేధవులు ప్రస్తావిస్తున్నారు. దీని మీద సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ మాట్లాడుతూ పవన్ ఆవిర్భావ సభలో చెప్పిన అంశాలు ఒక వైపే అన్నట్లుగా ఉన్నాయని విమర్శించారు.

ఏపీలో సకల సమస్యలకు కారణం అయిన బీజేపీని పల్లెత్తు మాట అనకుండా అప్పుల ఏపీ అని ఆవేదన చెందితే ఫలితం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. మరో వైపు చూస్తే ఏపీని సంపన్న రాష్ట్రం చేస్తామని పవన్ చెప్పడం పట్ల కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతునాయి. ఏపీలో ఈ రోజుకు చేసిన లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కట్టేందుకే ముప్పయి నుంచి నలభై వేల కోట్ల రూపాయలు ఏటా పక్కన పెట్టాలని, ఇక ఉద్యోగుల జీతలకు మరో డెబ్బై వేల కోట్లు అవుతాయని ఆ విధంగా చూస్తే ఈ రెండింటికే లక్ష కోట్ల బడ్జెట్ అవుతుంది అని చెబుతున్నారు.

ఇక ఏపీకి ఈ రోజున వచ్చే ఆదాయం నికరంగా డెబ్బై వేల కోట్లుగా ఉందని, కరోనా వంటి విపత్తులు భవిష్యత్తులో లేకుండా ఉంటే కచ్చితంగా మరో రెండేళ్లకు ఏపీ ఆదాయం తొంబై వేల కోట్లకు పెరుగుతుందని, ఆ విధంగా చూసుకున్నా లక్ష కోట్ల కచ్చితమైన ఖర్చుకు పది వేల కోట్లు అప్పు తేవాల్సిందే అని అంటున్నారు.

మరి ఏపీలో ఏ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేయకుండా అలా వదిలేయలేరు కదా. పైగా కనీస అవసరాలకు కూడా నిధులు లేని పరిస్థితి కూడా ఎపుడూ ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఈ నేపధ్యంలో కేంద్రం నుంచి వచ్చే పధకాలు అమలు కావాలన్నా మ్యాచింగ్ గ్రాంట్స్ కింద రాష్ట్రం ఎంతో కొంత మొత్తలను ఖర్చు పెట్టాలి. మరి ఏపీ అప్పుల లెక్కలు తెలిసి కూడా పవన్ పైసా కూడా అప్పు తేకుండా ఏపీని అభివృద్ధి చేస్తామని చెప్పడం పట్ల చర్చ అయితే ఉంది.

ఏపీని సంపన్న రాష్ట్రంగా మార్చాలీ అంటే కేంద్రం పెద్ద ఎత్తున ఆదుకోవాల్సి ఉంటుందని, విభజన హామీలను తుచ తప్పకుండా నెరవేర్చి స్పెషల్ గ్రాంట్స్ రిలీజ్ చేస్తే కనీసం మరో పదేళ్ల కాలానికి అయినా పోలవరం రాజధాని వంటి వాటి ద్వారా ఏపీ తన కాళ్ల మీద నిలబడే పరిస్థితి ఉంటుందని ఆర్ధిక మేధావులు చెబుతున్న లెక్కలు. మొత్తానికి నాయకులు ఆవేశంలో చెప్పే మాటలకు ఆచరణకు పొంతన ఎపుడూ ఉండదనే అంటున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచినా కూడా అప్పుల బాధలు మాత్రం తప్పవన్నది మేధావుల నిశ్చితాభిప్రాయం