Begin typing your search above and press return to search.

గంటా... బోండా...కన్నా...చాలానే మాట్లాడుకున్నారుట...?

By:  Tupaki Desk   |   16 Dec 2022 3:30 PM GMT
గంటా... బోండా...కన్నా...చాలానే మాట్లాడుకున్నారుట...?
X
ఒకరు మాజీ మంత్రి, రెండు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న నేత. ఆయనే టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు. ఆయన తెలుగుదేశంలో ఉన్నా పెద్దగా లేనట్లుగానే ఉంటున్నారు. ఏదో వెలితితో అసంతృప్తితో ఆయన తన రాజకీయాన్ని చేస్తూ వస్తున్నారు. ఇక బోండా ఉమా మహేశ్వరరావు. తెలుగుదేశం తరఫున గెలిచింది ఒక్కసారే అయినా విజయవాడ రాజకీయ కేంద్రం కావడంతో హైలెట్ బాగా అవుతున్నారు.

పైగా బలమైన సామాజికవర్గం అండగా ఉండడంతో కూడా ఆయన రాజకీయానికి అది ఆలంబన అవుతోంది. మూడవ వారు కన్నా లక్ష్మీ నారాయణ. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. అనేక సార్లు మంత్రి పదవిని చేపట్టిన నాయకుడు. ఇక వ్యవహార శైలి చూస్తే గుంటూరు మిర్చీ లాంటి గుంటూర్ నేత. ఆయన తాను ఉన్న బీజేపీలో ప్రస్తుతం అసంతృప్తితో రగులుతున్నారు. ప్రత్యేకించి ప్రస్తుత బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు మీద ఆయన మండిపోతున్నారని టాక్.

బోండా ఉమా సైతం టీడీపీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదని కలత చెందుతున్నారని టాక్. ఇలా ఈ ముగ్గురూ ఎవరి మటుకు వారు ఉన్నా వార్తల్లో నిలిచే వ్యక్తులు. అలాంటిది ముగ్గురూ ఒకే చోట కలిశారు అంటే అది రాజకీయ సంచలనమే అవుతుంది. విజయవాడకు ఒక వివాహ వేడుక నిమిత్తం వచ్చిన గంటను అక్కడ ఆయన నివాసంలో కన్నా, బోండా కలుసుకున్నారు. ముగ్గురూ భేటీ అయి అనేక విషయాలు మాట్లాడుకున్నారు.

ఆ మధ్యన ఎవరో అన్నట్లుగా సినిమా వాళ్ళు కలిస్తే సినిమా విషయాలు చర్చకు వస్తాయి. రాజకీయ నేతలు కలిస్తే కచ్చితంగా రాజకీయాల గురించే మాట్లాడుకుంటారు. పైకి మాత్రం అబ్బే అదేమీలేదు, కాలక్షేపం కబుర్లు చెప్పుకున్నామని వారు అన్నా మీడియా అనుమానించకమానదు, సగటు జనం కూడా చైతన్యం అయ్యారు కాబట్టి ఏదో ఉంటుంది లోగుట్టు అనే అనుకుంటారు

నిజానికి ఇది జస్ట్ మామూలు భేటీ అని గంటా లైట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ విషయం చూస్తే చాలానే ఉంది అని లేట్ గా లేటెస్ట్ గా ఒక న్యూస్ అయితే పొలిటికల్ గా వైరల్ అవుతోంది. గంటా కాపులను సమాయత్త పరచే పనిలో కొంతకాలంగా ఉన్నారు. ఇక బోండా సైతం కాపు సామాజికవర్గం ముందుండాలి అని ఆలోచించే వ్యక్తి, కన్నా కాంగ్రెస్ బీజేపీలను చూసేశారు. ఆయన వేరే పార్టీలోకి మారాలని అనుకుంటున్నారు అని ప్రచారం చాలా కాలంగా సాగుతోంది.

అది నిజమా అన్నట్లుగా ఈ మధ్యనే జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆయన ఇంటికి వెళ్ళి మరీ చర్చలు జరిపారు. ఆ చర్చల తరువాత గంటాతో కన్నా భేటీ అంటే ఏమనుకోవాలి. ఇక ఈ ముగ్గురు నేతలూ ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలు. ఈ ముగ్గురూ కలసి ఒకే పార్టీలోకి వెళ్తారని ప్రచారం అయితే సాగుతోంది. ఆ పార్టీయే జనసేన అని అంటున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని జనసేన అనుకుంటోంది. దానికి తగినట్లుగా పవన్ వారాహి రధాని రెడీ చేసుకుని పెట్టుకున్నారు.

ఎక్కడికక్కడ పార్టీని బలోపేతం చేసుకుంటూ గట్టి నాయకులను తెచ్చుకోవాలని జనసేన భావిస్తోంది. దానికి నాందిగా ఈ భేటీ జరిగింది అని అంటున్నారు. ఒక విధంగా చూస్తే ముగ్గురు నేతల మధ్య చాలా విషయాలే చర్చకు వచ్చాయని వాటి వివరాలు ఎవరూ బయటకు చెప్పకపోయినా ముందు ముందు జరిగే పరిణామాల బట్టి అవి బయటపడతాయని అంటున్నారు. మొత్తానికి ముగ్గురూ కలసి ముగ్గులోకి దిగబోతున్నారు అన్నదే ప్రచారంలో ఉన్న టాక్. ఏ ముగ్గులోకి అని మాత్రం ఇపుడు అడిగినా ఎవరూ జవాబు చెప్పరు, చెప్పలేరు అంతే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.