Begin typing your search above and press return to search.

బీజేపీ ట్రిపుల్ ఆర్ లో ఒక ఆర్ ఎగురిపోనుందా..?

By:  Tupaki Desk   |   16 April 2022 2:30 PM GMT
బీజేపీ ట్రిపుల్ ఆర్ లో ఒక ఆర్ ఎగురిపోనుందా..?
X
తెలంగాణలో బీజేపీకి ఉన్న ట్రిపుల్ ఆర్ ఎమ్మెల్యేల్లో రఘునందన్ రావు ఒకరు. 2020 ఉప ఎన్నికల్లో గెలిచిన ఆయన ఒకప్పటి టీఆర్ఎస్ ముఖ్య లీడర్ అని చాలా మందికి తెలుసు. అయితే బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఆయన మళ్లీ టీఆర్ఎస్లోకి వెళుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో టీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన రఘునందన్ రావు మళ్లీ టీఆర్ఎస్ నాయుకులతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారని, దీంతో ఆయన తొందర్లోనే గులాబీ కండువా కప్పుకుంటారని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ విషయంపై రఘునందన్ రావు స్పందించి తాను ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని వీడేది లేదని స్పష్టం చేశారు. కానీ నిప్పు లేనిదే పొగ రాదుగా అని కొందరు సెటైరికల్ కామెంట్లు చేయడం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.

హైకోర్టులో అడ్వకేట్ గా పనిచేసిన రఘునందన్ రావు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పనిచేశారు. అయితే 2013లో టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారన్న అభియోగంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు.

అలా బహిష్కరణకు గురైన తరువాత రఘునందన్ రావు బీజేపీలో చేరారు. అప్పటి నుంచి దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వస్తున్నారు. 2014, 2018లో ఓటమి చెందిన ఆయన 2020 ఉప ఎన్నికల్లో బీజేపీ స్టాటజీతో గెలుపొందారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా.. లేకున్నా.. టీవీ చర్చల్లో నిత్యం కనిపించేవారు. ఇక ఎమ్మెల్యే అయిన తరువత రఘునందన్ రావు జోరు పెంచారు. టీఆర్ఎస్ పై నిత్యం విమర్శలు, ఆరోపణలు చేస్తూ బీజేపీలో ప్రముఖంగా మారారు.

అయితే కొద్ది రోజులుగా రఘునందన్ రావు వ్యవహారంలో మార్పు వస్తోందని కొందరు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన టీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆయన కూతురు హాస్పిట్ ప్రారంభోత్సవానికి వైద్యశాక మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. దీంతో తన పర్సనల్ కార్యక్రమానికి హరీశ్ రావును పిలవడంపై బీజేపీలో జోరుగా చర్చ సాగుతోంది. ఆయన టీఆర్ఎస్ నేతలతో సన్నిహిత సంబంధాలు లేకుండానే హరీశ్ రావును ఆహ్వానించారా..? అని అంటున్నారు.

ఇక తనకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని బీజేపీ సంస్థాగత ప్రతినిధులతో అన్నట్లు ప్రచారం సాగుతోంది. గత కొన్ని రోజులుగా బీజేపీలో అసంతృప్త వాదులు తీవ్రంగా పెరిగిపోయారని వారిలో కొందరు ఇతర పార్టీల్లోకి వెళుతారని అంటున్నారు.

వారిలో ప్రముఖంగా రఘునందన్ రావు ఉన్నట్లు కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అయితే తాను ఎప్పటికీ బీజేపీని వీడేది లేదని అంటున్నారు. కానీ నిప్పు లేనిదే పొగ రాదుగా.. పార్టీ మారుతానని ఎవరో ఒకరితో వ్యాఖ్యలు చేయకుండానే ఇలాంటి ప్రాచారం సాగుతుందా..? అని కొందరు అంటున్నారు. మరి రఘునందన్ రావు చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.