Begin typing your search above and press return to search.

జగన్నాధ రధచక్రాలకు బ్రేకులు....?

By:  Tupaki Desk   |   30 April 2022 4:30 PM GMT
జగన్నాధ రధచక్రాలకు బ్రేకులు....?
X
ఏపీలో వైసీపీ మూడేళ్ల పాలన మరో నెలలో ముగుస్తోంది. ఇక వచ్చే రెండేళ్ళు ఎన్నికల కాక చాలా తీవ్రంగా ఉంటుంది. అదే సమయంలో అధికార పక్షం దగ్గర కూడా అన్ని అస్త్రాలు అయిపోయాయి. అప్పులు తెచ్చో మరోటి చేసో లేక ఆస్తులను కుదువపెట్టో ఏదో రకంగా ఏపీ సంక్షేమ రధాన్ని మూడేళ్ల పాటు అతి కష్టం మీద జగన్ నడిపించారు.

నిజానికి జగన్ మంత్రిగా కూడా చేయకుండా సీఎం అయ్యారు. ఆయన సీఎం అయ్యేనాటికి ఏపీ ఖజానాలో వంద కోట్లు మాత్రమే ఉన్నాయి. అప్పటికి టీడీపీ చేసిన మూడు లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి. ఇక ఏపీకి కొత్తగా అప్పులు పుట్టవని నాటి ఆర్ధిక మంత్రి యనమల రామక్రిష్ణుడు ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు. అనుభవం పెద్దగా లేని జగన్ అప్పుల్లో ఉన్న ఏపీని ఎలా పాలిస్తారు అన్న చర్చ అయితే నాడు వచ్చింది.

అయితే అప్పులు తేవడంతో బాబు కంటే ఘనుడు జగన్ అని నిరూపించుకున్నారు. ఆయన అనేక రకాలుగా చేసిన అప్పులతో ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు అయ్యాయి. ఈ రోజు నాటికి లక్షా 37 వేల కోట్ల రూపాయలను జనం ఖాతాల్లోకి నేరుగా వేశామని జగనే చెప్పారు. మరో రెండేళ్లలో లక్ష కోట్లు కూడా వేయడానికి అయితే రెడీగా ఉన్నారు.

అయితే ఆ డబ్బు కూడా అప్పు కిందనే పుట్టాలి. మరి అది జరగాలీ అంటే కేంద్రం కరుణించాలి. మోడీ చల్లని చూపు చూడాలి. ఇప్పటికే మితిమీరి అప్పులు చేసిన రాష్ట్రంగా ఏపీ ఉంది. ఏపీలో అప్పుల మీద కేంద్రం నివేదిక కోరడంతో అధికారులు అన్ని వివరాలూ పంపించారు. దీని మీద కేంద్రం సీరియస్ గానే ఉందని తెలుస్తోంది.

మరి కేంద్రం కనుక గట్టిగా బిగిస్తే ఏపీకి ఒక్క పైసా అప్పు కూడా పుట్టదు, అదే టైమ్ లో కేంద్రం కూడా ఎన్నో కొన్ని నిధులను ఏపీకి ఇస్తోంది. వాటిని కూడా సంక్షేమం వైపుగా మళ్ళించి ఏపీ ప్రభుత్వం తన హామీలను నెరవేర్చుకుంటోంది. ఇక ఇక్కడితో అది కూడా అయినట్లుగా ఉంది.

దాంతో రానున్న రెండేళ్ళూ కూడా ఏపీలో పాలన సాగడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక సంక్షేమ పధకాల కోసం పందేరాలు కూడా గతంలో మాదిరిగా సాఫీగా చేయడం అయ్యే పని కాదు అని అంటున్నారు. దానికి ఉదాహరణ ఈ నెల ఇప్పటికే సామాజిక పించన్లు బాగా లేట్ అయ్యాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు కూడా చాలా కాలంగా లేట్ అవుతున్నాయి. అందరికీ ఒకేసారి సొమ్ము ఇవ్వడం కష్టంగా ఉంటోంది.

అయితే మోడీ కనుక ఆదుకుంటేనే ఏపీలో పధకాలు అమలవుతాయి. మరి బీజేపీకి ఆ అవసరం ఉందా. జగన్ని జనంలో మంచిగా చూపించాలని కమలం భావిస్తుందా. రాజకీయ వ్యూహాంలో భాగంగా బాబు వైపు కనుక బీజేపీ మళ్ళితే మాత్రం జగన్నాధ రధచక్రాలకు బ్రేకులు పడినట్లే. అందుకే కేంద్రంతో మంచిగా ఉంటూ వైసీపీ అధినాయకత్వం వారి మెప్పుని పొందాలని చూస్తోంది అంటున్నారు. మొత్తానికి అంతా మోడీ చేతుల్లోనే ఉంది అంటున్నారు. ఏం జరుగుతుందో ఏమో చూడాలి.