Begin typing your search above and press return to search.

వెనక్కి తగ్గటం మోడీ సర్కారుకు అలవాటైందా? ఆ పన్ను బాదుడికి తాజాగా బ్రేక్

By:  Tupaki Desk   |   31 Dec 2021 11:30 PM GMT
వెనక్కి తగ్గటం మోడీ సర్కారుకు అలవాటైందా? ఆ పన్ను బాదుడికి తాజాగా బ్రేక్
X
చేతులు కాలే వరకు ఆగటం ఎందుకు? కాలిపోయిన తర్వాత అప్పుడే తెలివి వచ్చినట్లుగా ఆకులు పట్టుకోవటం ఎందుకు? తెలిసి తప్పులు చేస్తున్న మోడీ సర్కారును ఏమనాలి? గతంలో మాదిరి ఎవరేం అనుకున్నా ఫర్లేదు.. తాము అనుకున్నది అనుకున్నట్లు చేయటం తప్పించి.. ఎవరి మాటా వినమన్నట్లుగా వ్యవహరించిన మోడీ సర్కారులో ఈ మధ్యన తెలియని భయం.. అంతకు మించి బెరుకు కనిపిస్తోంది. కాకుంటే.. తాము తగ్గాల్సి వచ్చే అంశాల్ని గుర్తించే విషయంలో మాత్రం అదే పనిగా తప్పులు చేస్తూనే ఉంది.

మూడు వ్యవసాయ చట్టాల మీద పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైనా పట్టని మోడీ సర్కారు.. యూపీ ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన వేళ.. వెనక్కి తగ్గటమే కాదు.. చెంపలేసుకున్న వైనం తెలిసిందే. అది మొదలు.. ఒకటి తర్వాత ఒకటిగా వెనక్కి తగ్గటం కనిపిస్తోంది. తాజాగా వస్త్రాల మీద జనవరి 1 నుంచి ఐదు శాతంగా ఉన్న జీఎస్టీని 12 శాతంగా మార్చాలన్న నిర్ణయం తెలిసిందే. దీనిపై బీజేపీ పాలిత రాష్ట్రాల నేతలు మొదలు ఇతర రాష్ట్రాల్లోని అధికార పక్షాలు.. జీఎస్టీని పెంచొద్దన్న వినతలు చేయటం తెలిసిందే.

జీఎస్టీ పెంపు అమలుకు సరిగ్గా ఒక్కరోజు ముందు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెర మీదకు వచ్చి.. వస్త్రాల మీద విధిస్తామని చెప్పిన 12 శాతం జీఎస్టీ పెంపును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దేశం నలుమూలల నుంచి వస్త్రాల మీద జీఎస్టీ పెంపుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. కష్టాలు కొని తెచ్చుకోవటం.. అందునా మరో రెండు నెలల్లో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో డ్యామేజ్ జరుగుతుందన్న విషయాన్ని గుర్తించి అనక చప్పున మేల్కొన్న కేంద్రం.. జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వాయిదా వేశారు.

ఇదేదో ముందే నిర్ణయం తీసుకొని.. మిగిలిన వారు మేల్కొని ఆయా వర్గాలకు దన్నుగా గళం విప్పే దానికి ముందే.. తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఉంటే.. క్రెడిట్ మోడీ సర్కారు ఖాతాలో ఉండేది. అందుకు భిన్నంగా అందరూ వినతులు చేశాక.. వెనక్కి తగ్గటం అన్నది తమ పోరాటాల పుణ్యమేనని చెప్పుకోవటం ఖాయం. ఎక్కడి దాకానో ఎందుకు? తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విషయాన్నే తీసుకుందాం.

వస్త్రాల మీద జీఎస్టీ పెంపును బీజేపీ పాలిత రాష్ట్రాలే వ్యతిరేకిస్తున్నాయని.. తమ మాట వినని మోడీ సర్కారు.. తమ సొంత పార్టీ నేతల మాటల్ని అయినా వినాలంటూ చురకలు అంటిస్తూ గురువారం ఒక ట్వీట్ చేశారు. ఇలాంటి వారికి నిర్మలా సీతారామన్ నిర్ణయం.. నైతిక విజయాన్నికలిగించేలా చేస్తుందని చెప్పక తప్పదు. ఇప్పటికైనా మోడీ సర్కారు కళ్లు తెరిచి.. విపక్షాలకు అవకాశం ఇచ్చే విధానాన్ని వదిలేస్తే మంచిది. లేదంటే.. అందుకు తగ్గ మూల్యం చెల్లించక తప్పదు. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయన్న మాటను మోడీ పరివారం గుర్తిస్తే మంచిది.