Begin typing your search above and press return to search.

నీతా అంబానీ అదరగొట్టేసింది

By:  Tupaki Desk   |   4 Aug 2016 5:19 PM GMT
నీతా అంబానీ అదరగొట్టేసింది
X
నీతా అంబానీ అరుదైన రికార్డును సృష్టించారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణిగా కాకుండా తనదైన శైలిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించే ఆమె.. ఇప్పటివరకూ ఏ భారతీయ మహిళకు దక్కని అరుదైన గౌరవం లభించింది. ఒలింపిక్ కమిటీలో తొలి భారతీయ మహిళా సభ్యురాలిగా ఎంపికైన ఆమె చరిత్రనే సృష్టించారు.

తాజాగా జరిగిన ఐవోసీ 129వ సమావేశంలో రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్.. ఛైర్ పర్సన్ అయిన నీతా అంబానీని ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్ అజెండా 2020 ఆధారంగా కొత్త సభ్యుల ఎంపికను చేపట్టారు. క్రీడల్ని పోత్సహించటం.. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల్ని చేపట్టిన నీతా అంబానీ ఇటీవలే.. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. దీంతో ఆమెకు ఐవోసీలో స్థానం కోసం నామినేట్ అయ్యారు.

తనకు లభించిన అరుదైన గుర్తింపు మీద నీతా అంబానీ తాజాగా స్పందించారు. తనకు దక్కిన గౌరవం భారతీయ మహిళకు అంతర్జాతీయంగా లభించిన గుర్తింపుగా అభివర్ణించిన ఆమె.. దేశీయంగా క్రీడాకారులకు తాను అండగా నిలుస్తానని చెప్పారు. ఇప్పటివరకూ భారత్ నుంచి ఐవోసీ కమిటీలో సభ్యులుగా దొరాబ్జీ టాటా.. రాజా రణ్ ధీర్ సింగ్ లకు మాత్రమే ఐవోసీలో స్థానం లభించింది. టాటాను ఐవోసీలో సభ్యుడిగా ఎంపిక కాగా.. రణ్ దీర్ సింగ్ అంతర్జాతీయ కమిటీలో గౌరవ సభ్యుడిగా ఎన్నికయ్యారు. భారతీయ మహిళకు కమిటీలో చోటు లభించటం నీతా అంబానీతోనే మొదలైంది. కంగ్రాట్స్ నీతా.