Begin typing your search above and press return to search.

భారత ప్రయాణికులకు ఆ దేశం‌లోకి నో ఎంట్రీ... ప్రధాని కీలక ప్రకటన !

By:  Tupaki Desk   |   8 April 2021 8:30 AM GMT
భారత ప్రయాణికులకు ఆ దేశం‌లోకి నో ఎంట్రీ...  ప్రధాని కీలక ప్రకటన !
X
భారత్ లో గత కొన్ని రోజులుగా మళ్లీ కరోనా మహమ్మారి జోరు చూపిస్తుంది. రెండో దశలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా రోజువారీ కేసుల సంఖ్య లక్షను దాటేసింది. ఈ క్రమంలోనే.. న్యూజిలాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి న్యూజిలాండ్ వచ్చే భారత ప్రయాణికులపై తాత్కాలిక నిషేధం విధించింది. భారత్ నుంచి న్యూజిలాండ్ వెళ్లే ఆ దేశపు పౌరుల రాకపై కూడా న్యూజిలాండ్ తాత్కాలికంగా నిషేధం విధించింది. భారత్ నుంచి న్యూజిలాండ్ ప్రయాణాలపై రెండు వారాల పాటు ఆంక్షలు కొనసాగనున్నట్లు ఆ దేశ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డెర్న్ ఆక్లాండ్‌ లో జరిగిన న్యూస్ కాన్ఫరెన్స్ ‌లో అధికారిక ప్రకటన చేశారు.

న్యూజిలాండ్ ఇప్పుడు మాత్రమే కాదు తొలుత కరోనా విజృంభించిన సమయంలో కూడా ముందుగానే జాగ్రత్త పడింది. కరోనా వైరస్ వ్యాప్తి మొదలయిన వెంటనే ఇతర దేశాల నుంచి రాకపోకలపై గతంలోనూ న్యూజిలాండ్ నిషేధం విధించింది. అందుకే ఆ దేశంలో కరోనా అంతగా ప్రభావం చూపలేకపోయింది. దాదాపు 40 రోజుల నుంచి న్యూజిలాండ్‌ లో ఎలాంటి కమ్యూనిటీ ట్రాన్స్ ‌మిషన్ జరగలేదంటే ఆ దేశం ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్‌ నుంచి ప్రయాణాలపై న్యూజిలాండ్ విధించిన ఆంక్షలు ఏప్రిల్ 11 నుంచి 28 వరకూ కొనసాగనున్నాయి. న్యూజిలాండ్ ‌లో క్రమక్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, బుధవారం 7 పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ దేశ ప్రధాని తెలిపారు.

గురువారం ఒక్కరోజే న్యూజిలాండ్‌కు వెళ్లిన వారిలో 23 మందికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ఈ 23 మందిలో 17 మంది భారతీయులే కావడం గమనార్హం. దీంతో.. భారత్ నుంచి ప్రయాణాలపై తాత్కాలికంగా నిషేధం విధించాలని న్యూజిలాండ్ నిర్ణయించింది. ఇదిలా ఉండగా.. భారత్‌లో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఇతర దేశాలను కూడా కలవరపెడుతున్నాయి. భారత్‌లో గడచిన 24 గంటల్లో 1,26,789 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. గడచిన 24 గంటల్లో 685 మంది కరోనా కారణంగా భారత్‌లో మృత్యువాత పడ్డారు.